People Facing Difficulties Due to Lack of Parking Spaces in Visakhapatnam City: విశాఖ నగరంలో ఎక్కడ చూసినా రోడ్లపైనే వాహనాలు అడ్డదిడ్డంగా నిలిపేస్తుంటారు. వాస్తవానికి ఆ వాహనాలు ఉంచాల్సిన సెల్లార్లలో వ్యాపార దుకాణాలుంటాయి. జీవీఎంసీ, ట్రాఫిక్ పోలీసుల సమన్వయలోపం, నిర్లక్ష్యం కారణంగా మహా నగరంలో ట్రాఫిక్ రద్దీ తీవ్రంగా పెరిగిపోతుంది. మరోవైపు ఫుట్పాత్లు ఆక్రమించేస్తున్నా కళ్లప్పగించి చూస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిత్యం రద్దీనే: డాబాగార్డెన్స్, ద్వారకానగర్, ఆశీలుమెట్ట, జగదాంబ నుంచి కలెక్టర్ కార్యాలయం రహదారులు, కేజీహెచ్, జిల్లా పరిషత్, బీచ్రోడ్డు, గోపాలపట్నం, గాజువాక ప్రధాన రహదారి, తగరపువలస, భీమిలి ప్రధాన రహదారులు అత్యంత కీలకమైన ప్రాంతాలు. ఆ ప్రాంతాల్లోనే అత్యధికంగా వ్యాపార సముదాయాలున్నాయి. దీంతో రహదారులన్నీ రద్దీగా ఉంటాయి. నగరంలో వాణిజ్య భవనాలు దాదాపు 14 వేలకుపైగా ఉన్నాయి. ఇక్కడకు వెళ్లే ద్విచక్ర వాహనదారులు, కార్లు రహదారిపైనే పార్కింగ్ చేస్తున్నారు. జాతీయ రహదారికి ఇరువైపులా మధురవాడ వరకు వాణిజ్య సముదాయాల్లోని సెల్లార్లను నిబంధనలకు విరుద్ధంగా ఉపయోగిస్తున్నారు.
కొన్ని ప్రైవేటు పాఠశాలల తరగతులు సెల్లార్లలోనే నిర్వహిస్తున్నారు. మరికొన్నింటి వ్యాయామ, యోగా కేంద్రాలుగా మార్చేశారు. హోటళ్లు, వస్త్ర దుకాణాలు, సూపర్మార్కెట్లు, స్టోర్లు ఇలా ఎన్నో సెల్లార్లలోనే సాగుతున్నాయి. మరికొన్ని చోట్ల వాణిజ్య భవనాల ముందు జీవీఎంసీ నిర్మించిన నడక మార్గాలు అడ్డుగా ఉండటంతో రోడ్లపైనే వాహనాలు పెట్టేస్తున్నారు.

చర్చల్లేవు- చర్యల్లేవు: జీవీఎంసీ పట్టణ ప్రణాళికాధికారులు, ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పర్యవేక్షించే పోలీసులు సమీక్షించాలి. ముఖ్యమైన కూడళ్లు, ఇతర ప్రాంతాల్లోని సెల్లార్లలో ఆక్రమణలను తొలగించడానికి నోటీసులు జారీ చేయాలి. అక్కడున్న దుకాణాలను ఖాళీ చేయించి, వాహనాలు పార్కింగ్కు అవకాశం కల్పించాలి. నిర్లక్ష్యంగా రహదారి పక్కన నిలిపే వాహనాలకు అపరాధ రుసుం విధించాలి. నోటీసులిచ్చినా స్పందించని భవన యజమానులు, వ్యాపారులపై చర్యలు తీసుకోవచ్చు. అవేమీ ఇప్పుడు సాగడం లేదు. కొన్ని ప్రాంతాల్లో నడక మార్గాలను సైతం భవన యజమానులు అద్దెకిస్తుండటం గమనార్హం.
ట్రాఫిక్ నిబంధనలు పాటించరు, చలానాలు కట్టరు - ఇదీ విజయవాడలో పరిస్థితి!
ఏర్పాట్లు కట్టిదిట్టంగా ఉంటేనే : నగరంలో వాహనాలు నిలపడానికి ఎక్కడా ప్రత్యేకంగా పార్కింగ్ జోన్లు లేవు. ఇవి ఏర్పాటు చేస్తే బాగుంటుందని వాహనదారులు కోరుతున్నారు. అత్యంత రద్దీగా ఉండే జగదాంబ కూడలి ప్రాంతానికి సమీపంలో జీవీఎంసీ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా మల్టీ లెవల్ కారు పార్కింగ్ను రూ.9 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతానికి వచ్చేవారికి ఎంఎల్సీపీ ఎంతగానో ఉపయోగపడుతుంది. జగదాంబ, కేజీహెచ్ సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు నెలవారీ ఛార్జీలను ఒకేసారి చెల్లించి, పార్కింగ్ స్థలాన్ని కొనుక్కుంటున్నారు. వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో రూ.85కోట్లతో చేపట్టిన భారీ మల్టీ లెవల్ కారు పార్కింగ్ భవనం ప్రస్తుతం పూర్తయింది. ఇలాంటి ఎంఎల్సీపీలు నగరంలో ఇంకా ఏర్పాటు చేయాల్సి ఉంది.
ట్రాఫిక్ పోలీసులు లేరని గీత దాటారు - వారం రోజుల్లో 211 మందికి జరిమానా