Eligible People For Indiramma Houses In Telangana : తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజాపాలనలో వచ్చిన మొత్తం దరఖాస్తుల్లో అర్హుల జాబితాను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇళ్ల కోసం మొత్తం 77.18 లక్షల మంది ప్రజలు దరఖాస్తు చేశారు. అయితే వీరిలో 36.03 లక్షలు అంటే 46.7 శాతం మంది మాత్రమే అర్హులని ప్రభుత్వం తేల్చింది. మిగతా 41.15 లక్షలు అంటే 53.3 శాతం మందిని ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అనర్హులుగా నిర్థరించారు. అనర్హులంతా దారిద్య్రరేఖ (బీపీఎల్)కు ఎగువన ఉన్నట్లు వెల్లడించారు.
మూడు జాబితాలు : గృహ నిర్మాణ శాఖ అర్హులు, అనర్హుల వివరాలను ఎల్-1, ఎల్-2, ఎల్-3గా విభజించి జాబితాను సిద్ధం చేసి పెట్టుకుంది. ఈ మూడు జాబితాల ప్రకారమే ప్రతి ఆర్థిక సంవత్సరం నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్రంలో ఏటా గరిష్ఠంగా మొత్తం 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేయనుంది. ఇళ్ల దరఖాస్తుల వివరాలను సంబంధిత అధికారులు ఇప్పటికే ఇందిరమ్మ యాప్లో నమోదు చేశారు.
ఇందిరమ్మ యాప్లో పొందుపరిచిన మార్గదర్శకాల మేరకు అన్ని కోణాల్లో క్షేత్ర స్థాయిలో చేసిన సర్వేతో పాటు గతంలో ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వే ద్వారా దరఖాస్తుదారులను ఎల్-1, ఎల్-2, ఎల్-3గా విభజించారు. ఎల్-1లో 23.05 లక్షల మంది, ఎల్-2లో 21.44 లక్షల మంది, ఎల్-3లో 32.69 లక్షల మంది ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తు చేసినట్లు తేల్చారు.
స్థలాలు ఉన్నవారు ఎల్-1లో : ఎల్-1 జాబితాలో సొంత స్థలాలు ఉండి ఇళ్లు లేని వారిని ఇందులో ఉంచారు. సొంత స్థలంలో మట్టిమిద్దెలు, పూరిళ్లు, రేకుల ఇళ్లు ఉన్నవారిని కూడా ఇందులో చేర్చారు. ఎల్-2 జాబితాలో స్థలాలతో పాటు ఇళ్లు లేని వారిని కూడా చేర్చారు. ఎల్-3 జాబితాలో ప్రభుత్వ ఉద్యోగులు, కార్లున్నవారు, సొంత ఇళ్లు, దారిద్య్రరేఖ(బీపీఎల్)కు ఎగువన ఉన్నవారు, ఆదాయపుపన్ను చెల్లిస్తున్న వారిని చేర్చారు.
41.15లక్షలకు చేరిన అనర్హులు : వీటన్నింటి ఆధారంగా గత ఫిబ్రవరి నెలలోనే సంబంధిత అధికారులు జాబితాను తయారు చేశారు. పలువురి నుంచి ఫిర్యాదులు రావడంతో మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం అనర్హుల జాబితాను ప్రభుత్వం రూపొందించింది. గ్రామాలు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, పురపాలికల వారీగా ఈ లిస్ట్ను సర్కారు సిద్ధం చేసి ఉంచింది.
రాష్ట్ర గృహ నిర్మాణశాఖ ఎల్-3లో 32.69 లక్షల మంది ఉన్నట్లు గుర్తించింది. తాజాగా మరోసారి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టడంతో అనర్హుల సంఖ్య భారీగా పెరిగింది. 32.69లక్షల నుంచి 41.15 లక్షలకు పెరిగింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎల్-3 జాబితాలో చేర్చిన దరఖాస్తుదారులంతా అనర్హులే. ఎల్-1 జాబితాలోని 18.67 లక్షల మంది, ఎల్-2 జాబితాలోని 17.36 లక్షల మంది మొత్తంగా 38.03 లక్షల మంది అర్హులుగా తేలారు.
వారికే ఇళ్లు కేటాయించండి - ఇందిరమ్మ ఇళ్లపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు