Online Fraud on Students in Hyderabad : హైదరాబాద్కు చెందిన ఓ యువకుడు బీటెక్ పూర్తి చేశాడు. ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్లాలనే ఆలోచనలో పడ్డాడు. దాని కోసం ఇంటర్నెట్లో అక్కడి విశ్వవిద్యాలయాలు, విద్యారుణం పొందేందుకు ఉన్న మార్గాల కోసం వెతికాడు. మరుసటి రోజు అతడి వాట్సప్ నంబర్కు వచ్చిన మెసేజ్కు స్పందించాడు. తమ కన్సల్టెన్సీ ద్వారా రుణం ఇప్పిస్తామంటూ వివరాలు తీసుకున్నారు. వివిధ ఛార్జీల పేరుతో రూ.లక్షన్నర వసూలు చేశారు. సొమ్ము చేతికొచ్చాక ముఖం చాటేశారు.
ఓ యువతి సివిల్స్ శిక్షణ తీసుకుంటున్నారు. దిల్లీలోని ప్రముఖ కోచింగ్ సెంటర్లు యూపీఎస్సీకి సిద్ధమవుతున్న వారికి రాయితీపై మెటీరియల్ ఇస్తాయనే ప్రకటన చూశారు. ఆపై అక్కడున్న యూపీఐ నంబర్కు రూ.10 వేలు పంపారు. కొంత సమయానికి ఓ యువకుడు ఫోన్ చేసి పార్సిల్ చేసి కొరియర్లో పంపేందుకు రూ.5 వేలు బ్యాంకు ఖాతాలో జమ చేయించుకొని మోసం చేశాడు.
ఏ అవకాశాన్నీ వదలడం లేదు : సైబర్ మాయగాళ్లు ఏ అవకాశాన్నీ వదలడం లేదు. విద్యార్థులు, ఉద్యోగార్థులను లక్ష్యంగా చేసుకొని పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారు. ప్రధాన నగరాల్లోని కోచింగ్ కేంద్రాలు, దేశ, విదేశాల్లోని విద్యా సంస్థల పేరిట నకిలీ వెబ్సైట్లు రూపొందించి అడ్మిషన్లు, రుణాల పేరుతో వల విసురుతున్నారు. హైదరాబాద్ నగర పరిధిలో వారం రోజుల వ్యవధిలోనే ఈ తరహా కేసులు 10కి పైగా నమోదు కావటం గమనార్హం. ప్రముఖ విద్యాసంస్థల్లోని విద్యార్థులు, కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందుతున్న అభ్యర్థుల డేటా సేకరిస్తున్నారు. మెయిల్, వాట్సప్ నంబర్లకు లింకులు పంపి మోసం చేస్తున్నారు.
మెరిట్స్కాలర్షిప్ అంటూ : ప్రముఖ వర్సిటీల పేర్లతో అసలు దానిలా వెబ్సైట్లు రూపొందిస్తున్నారు. అడ్మిషన్లు, విద్యా రుణాలు, ఉపకార వేతనాల వివరాలు తెలుసుకునేందుకు వేర్వేరు ఫోన్ నంబర్లు పొందుపరుస్తారు. సంప్రదిస్తే అసలు కథ మొదలవుతుంది. అడ్మిషన్ ఫీజులంటూ రూ.10-20 వేలు, సీటు కేటాయించాలంటే మరికొంత సొమ్ము కాజేస్తారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టెలిగ్రామ్ యాప్ల్లో ప్రకటనలు గుప్పిస్తారు. మెరిట్ స్కాలర్షిప్లు సొంతం చేసుకునేందుకు ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తున్నట్టు నమ్మకం కలిగిస్తారు.
రుణాలిప్పిస్తాం అంటూ : ఇదే తరహాలోనే ఓ ప్రభుత్వ ఉద్యోగి తన కుమారుడిని ఇంగ్లాండ్ పంపేందుకు ప్రయత్నించి రూ.2 లక్షలు పోగొట్టుకున్నట్టుగా కేసు నమోదైంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రధాన విద్యాసంస్థల్లో చదవాలనుకునే విద్యార్థులకు రుణాలిప్పిస్తాం అంటూ కొందరు సైబర్ నేరగాళ్లు సొమ్ముకాజేస్తున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రుల పూర్తి వివరాలు సేకరిస్తారు. వారి పేరిట బ్యాంకులకు దరఖాస్తు చేస్తారు. ఆన్లైన్ బ్యాకింగ్ తమ ఆధీనంలోకి తీసుకుంటారు. విద్యా రుణం మంజూరు కాగానే మాయగాళ్లు విత్ డ్రా చేసుకుంటున్నారు.
"ప్రముఖ విద్యాలయాల పేర్లతో నకిలీ వెబ్సైట్లతో జాగ్రత్తగా ఉండాలి. వెబ్సైట్ తెరిచి ప్యాడ్ లాక్ను పరిశీలించినప్పుడు భద్రతా ప్రమాణాలు కనిపిస్తాయి. ఉపకారవేతనాలు, విద్యారుణాలు, అడ్మిషన్ల అవకాశాలు కల్పిస్తామనగానే వ్యక్తిగత వివరాలు పంచుకోవద్ధు. ఒకవేళ మోసపోయినట్టు గ్రహిస్తే స్థానిక పోలీస్స్టేషన్, 1930 టోల్ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయండి." - కవిత దార, డీసీపీ, సైబర్క్రైమ్
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్పై 15లక్షల సైబర్ దాడులు- ఇతర దేశాలతో కలిసి పాకిస్థాన్ దుస్సాహసం!