One Acre Land To Tenth Class Topper in Palnadu District: పదో తరగతి పరీక్షలలో 593 మార్కులు సాధించిన అమూల్య అనే విద్యార్థినికి ఎకరం పొలం మంజూరు చేస్తూ పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్బాబు ఆదేశాలు జారీ చేశారు. ఈనాడులో ‘అమూల్యమైన విజయం’ శీర్షికన గురువారం వచ్చిన కథనానికి కలెక్టర్ స్పందించారు. నాదెండ్ల మండలం చిరుమామిళ్ల జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని అమూల్య పదో తరగతి ఫలితాల్లో 593 మార్కులు సాధించి ప్రతిభ చాటింది.
హర్షం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు: అమూల్య కుటుంబ సభ్యులు కూలికి వెళ్తేనే పూట గడుస్తుందని తెలుసుకున్న కలెక్టర్ అరుణ్బాబు చలించిపోయారు. భూమి లేని నిరుపేదల పథకం కింద విద్యార్థిని కుటుంబానికి ఎకరం పొలం మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అమూల్యతో పాటు మరో ముగ్గురు ఆడపిల్లలను తల్లిదండ్రులు అనిల్, రూతమ్మ కష్టపడి చదివిస్తున్నారు. తమకు కల్పించిన ఈ ఎకరం భూమితో పిల్లలను మరింత ఉన్నత విద్యావంతులను చేసుకుంటామని వారు సంతోషం వ్యక్తం చేశారు.
పరీక్షలో గెలిచింది - జీవితంలో ఓడింది: మంచిగా చదివి భవిష్యత్తులో స్థిరపడాలని ఆ విద్యార్థిని కలలుగంది. అందుకు తగ్గట్లుగా బాగా చదివి పదో తరగతి పరీక్షలు రాసింది. ఫలితాల కోసం ఎదురు చూస్తుండగా అనారోగ్యం ఆమెను బలి తీసుకుంది. అయితే ఐదు రోజుల అనంతరం విడుదలైన ఫలితాల్లో ఆ విద్యార్థినికి అత్యధిక మార్కులు రావడంతో కుమార్తెను గుర్తుకు తెచ్చుకుని ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ విషాద ఘటన నంద్యాల జిల్లాలో జరిగింది.
దొర్నిపాడు మండలం చాకరాజువేముల గ్రామానికి చెందిన దేవరాజు, మరియమ్మలకు ఐదుగురు కుమార్తెలు. నాలుగో కుమార్తె సారా దొర్నిపాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివి పరీక్షలు రాసింది. ఫలితాల కోసం ఎదురుచూస్తున్న క్రమంలో అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ ఈ నెల 19న మృతి చెందింది. బుధవారం విడుదలైన ఫలితాల్లో ఆమె 557 మార్కులు సాధించింది. 500 పైగా మార్కులు వస్తాయని చనిపోయే ముందు కుమార్తె తనకు చెప్పిందని గుర్తుకు తెచ్చుకుంటూ ఆమె తండ్రి కంటతడి పెట్టారు.
ఏడాదిలోనే 175 కోర్సులు పూర్తి - ఏకంగా డిస్నీప్లస్ హాట్స్టార్ ఇంటర్వ్యూ
SSCలో రికార్డ్ - కాకినాడ విద్యార్థి నేహాంజనికి 600 మార్కులు