Joinings in Indian Paramilitary With Fake Certificates in Adilabad : నకిలీ నివాస ధ్రువీకరణ పత్రాలు సృష్టించి సశస్త్ర సీమా బల్లో అక్రమంగా చేరిన ఘటన విస్తుగొలుపుతుంది. ఉత్తర భారతానికి చెందిన కొందరు యువకులు ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, మేడ్చల్లోని పలు ప్రాంతాల్లో నివసిస్తున్నట్లు ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించి ఉద్యోగాలు పొందారు. ఉద్యోగాల్లో భాగంగా వివిధ ప్రాంతాల్లో ఇచ్చే శిక్షణ సైతం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) విభాగంలో పనిచేసే జనరల్ డ్యూటీ(జీడీ) కానిస్టేబుళ్ల ఎంపిక కోసం కేంద్ర హోం మంత్రిత్వశాఖ 2023 డిసెంబర్లో ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేయగా, 2024 మార్చి నెలలో పరీక్షలు నిర్వహించింది. ఎంపికైన అభ్యర్థులకు 2024 అక్టోబర్లో విడతలవారీగా పోస్టింగ్లు ఇచ్చింది.
ఇందులో రాజస్థాన్కు చెందిన మనోజ్ షెకావత్ ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో నివాసం ఉంటున్నట్లు నకిలీ సర్టిఫికెట్ సమర్పించి సీమాబల్లో ఉద్యోగం పొందినట్లు ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. షెకావత్ ధ్రువపత్రాలు కేంద్ర ప్రభుత్వం నుంచి జిల్లా స్పెషల్బ్రాంచ్ (ఎస్బీ)కు విచారణకు రాగా నకిలీ ఆధార్కార్డు, ఇతర సర్టిఫికెట్లు సమర్పించి నివాస ధ్రువపత్రం పొందినట్లు గుర్తించారు. అలానే ఇచ్చోడ మండలం ఇస్లాంనగర్ చిరునామాతో సూరజ్, కోకస్ మన్నూర్ చిరునామాతో గజేందర్, విషుకర్మలు ఫేక్ సర్టిఫికెట్లు పత్రాలతో ఎస్ఎస్బీలో ఉద్యోగాలు పొందినట్లు కేసులు నమోదయ్యాయి.
ఈ విషయం తెలుసుకుని : ఆర్మీ, పారా మిలటరీ విభాగాల్లో చేరటానికి తెలంగాణ నుంచి పోటీ తక్కువ ఉంటోంది. దీన్నే ఆసరా చేసుకున్న ఉత్తరభారతానికి చెందిన యువకులు ఆదిలాబాద్, మేడ్చల్, భూపాలపల్లి జిల్లాల్లో నివాసం ఉంటున్నట్లు నకిలీ ధ్రువపత్రాలు సమర్పించి ఉద్యోగాలు పొందినట్లు రూఢీ అవుతోంది. ఈ నిర్వాకం వెనక స్థానికుల ప్రమేయంతో పాటు ఓ ముఠా హస్తం ఉన్నట్లు తెలిసింది.
- భూపాలపల్లిలో లక్ష్మీనగర్ జంగేడు గ్రామంలో 2-14 ఇంటి నంబర్ అడ్రస్తో ఓ యువకుడు ఫేక్ సర్టిఫికెట్ సృష్టించటమే కాకుండా దాని ఆధారంగా ఎస్ఎస్బీలో వంటమనిషిగా ఉద్యోగం పొందినట్లు తెలుస్తోంది. ఆయన ఇచ్చిన ఇంటి నంబరును భూపాలపల్లిలోని మున్సిపల్ రికార్డుల ప్రకారం ఆరాతీస్తే గతంలో ఆ ఇచ్చిన ఇంటి నంబర్తో గతంలో ఓ పూరిగుడిసె ఉంది. ఇప్పుడు అక్కడ గుడిసే లేదు. దీంతో అభ్యర్థి సమర్పించింది నకిలీ సర్టిఫికెట్ అని రుజువవుతుంది.
- ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కోకస్మన్నూర్లో ఉంటున్నట్లు 2024 సెప్టెంబర్ 27న రెసిడెన్షియల్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. రెవెన్యూ సిబ్బంది విచారణలో అలాంటి వ్యక్తి స్థానికంగా లేరని తేల్చారు. దీంతో ఆయన సమర్పించిన ఆర్జీని 2024అక్టోబర్ 16న రిజెక్ట్ చేశారు. కానీ సదరు అభ్యర్థి అదే నెంబర్తో మళ్లీ ఫేక్ సర్టిఫికెట్ సృష్టించి ఉద్యోగంలో చేరి ఇప్పుడు శిక్షణలో ఉన్నట్లు తెలుస్తోంది.
- మరో ఇద్దరు యువకుల్లో ఒకరు ఇచ్చోడ మండలంలోని ఇస్లాంనగర్ నివాసిగా, మరొకరు నేరడిగొండలో నివాసం ఉంటున్నట్లు నకిలీ పత్రాలు సృష్టించి ఉద్యోగంలో చేరినట్లు తెలిసింది.
- మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం వేంపల్లికి చెందినట్లుగా ఓ యువకుడు సర్టిఫికెట్ సమర్పించాడు. అయితే ఆ గ్రామంలో ఆ పేరుతో ఎవరూ లేరని గ్రామస్థులు తెలిపారు.
ఎంతకు తెగించార్రా! - తప్పుడు ధ్రువపత్రాలతో వారసులకు ప్రభుత్వ ఉద్యోగాలు
అక్రమ పహాణీలు సృష్టించి లక్షల్లో వసూలు - తహసీల్దార్తో పాటు ఏడుగురు అరెస్ట్