Negligence in Tenth Class Exam Hall Arrangement in Konaseema District : ఏపీ వ్యాప్తంగా నేటి నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి లోటు లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలి. కానీ అధికారుల నిర్లక్ష్యం వల్ల అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షలు రాసేందుకు వచ్చిన విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
స్కూలు యాజమాన్యం పరీక్ష గదిలోని సిమెంటు బస్తాలను ఖాళీ చేసి శుభ్రం చేయలేదు. పరీక్షా సమయానికి ముందు హడావిడిగా సిమెంటు బస్తాలను ఖాళీ చేయించారు. సిమెంటు బస్తాలు ఖాళీ చేసే వరకు పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థులు రూమ్ బయటే ఉంచటంపై వారి తల్లిదండ్రులు మండిపడ్డారు. ఘటన స్కూలు యాజమాన్యం నిర్లక్ష్యాన్ని చాటుతోందని ధ్వజమెత్తారు.
సామాన్యశాస్త్రం పరీక్ష మినహా మిగతా పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహిస్తారు. ఏప్రిల్ 1 వరకు ఇవి కొనసాగనున్నాయి. సుమారు 6.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఈసారి రెగ్యులర్ విద్యార్థులతోపాటే సార్వత్రిక విద్యాపీఠం అభ్యర్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రశ్నాపత్రం చదువుకునేందుకు అదనంగా 15 నిమిషాలు కేటాయించారు.
నేటి నుంచి పది పరీక్షలు - విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం
క్యాలెండర్ ప్రకారం మార్చి 31న రంజాన్ పర్వదినంలో ఏమైనా మార్పులు చోటు చేసుకుంటే సాంఘిక శాస్త్రం పరీక్షలో మార్పు చేయనున్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణ సదుపాయం కల్పించారు. పరీక్ష కేంద్రాల వద్దకు విద్యార్థులు, తల్లిదండ్రుల రాకతో సందడి వాతావరణం నెలకొంది.
పకడ్బందీగా ‘పది’ పరీక్షలకు ఏర్పాట్లు - అధికారులతో సీఎస్ సమీక్ష
