Nallamala Forest Inviting: విద్యార్థులకు వేసవి సెలవులు మొదలయ్యాయి. ఈ సెలవుల్లో సరదాగా విహార యాత్రకి వెళ్లడంతో పాటు విజ్ఞానాన్ని సైతం పొందాలనుకునే వారికి నల్లమల అటవీ ప్రాంతం స్వాగతం పలుకుతోంది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.
నల్లమల కొండలు తూర్పు కనుమల్లో విస్తరించి ఉన్నాయి. మొత్తం విస్తీర్ణం 5,947 చదరపు కిలో మీటర్లు కాగా ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాల్లో 3,040.74 చ.కి.మీల మేర రాజీవ్ గాంధీ పులుల అభయారణ్యం విస్తరించి ఉంది. దీనికి నాగార్జునసాగర్ శ్రీశైలం పులుల అభయారణ్యం అని మరో పేరు సైతం ఉంది.
పర్యాటకులకు అవసరమైన సౌకర్యాలు: సున్నిపెంట బయో డైవర్సిటీకి ఎదురుగా 8 హెక్టార్లలో ఎకలాజికల్ నాలెడ్జ్ పార్కును ఏర్పాటు చేశారు. జురాసిక్ యుగం నుంచి భూమి పుట్టుక, జీవపరిణామ క్రమం వరకు సంక్రమించిన మార్పులపై అవగాహన కలిగేలా ఇక్కడ 53 బొమ్మలు ఉన్నాయి. పర్యాటకులకు అవసరమైన సౌకర్యాలను కల్పించారు.
నల్లమల ప్రాంతంలో వేలాది ఔషధ మొక్కలున్నాయి. సున్నిపెంట జీవ వైవిధ్య కేంద్రం పరిధిలో అరుదైన, ఔషధ గుణాలున్న 353 జాతుల ప్రాధాన్యం గుర్తించారు. రోళ్లపెంట నుంచి పెచ్చెర్వుగూడేనికి వెళ్లే దారిలో వనమూలికల సంరక్షణ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒకే చోట 70 నుంచి 80 జాతుల ఔషధ మొక్కలు ఉంటాయి. విహారానికి వచ్చే పర్యాటకులు వీటి గురించి తెలుసుకోవచ్చు.
జీవ వైవిధ్యంపై పరిశోధన: నల్లమల జీవజాలాన్ని భవిష్యత్తు తరాలకు పరిచయం చేసేందుకు 2001 డిసెంబరు 8వ తేదీన శ్రీశైలం ప్రాజెక్టు కాలనీ కేంద్రంగా జీవవైవిధ్య పరిశోధనా సెంటర్ ఏర్పాటు చేశారు. ఇందులో 303 రకాల క్షీరదాలు, 102 రకాల సీతాకోక చిలుకలు, 80 రకాల పాములు, 55 రకాల చేపలు, 25 లాంబాలు, 18 కప్పలు, 77 రకాల కీటకాల వివరాలు ఉంటాయి. ప్రపంచంలోనే ఎంతో వైవిధ్య భరితమైన సాలెపురుగును ఇక్కడ చూడొచ్చు.
మరికొన్ని విశేషాలు:
- పులుల అభయారణ్యంలో దేశంలోనే నల్లమల అతి పెద్ద పులుల అభయారణ్యంగా ప్రసిద్ధి గాంచింది. 2024 లెక్కల ప్రకారం నల్లమలలో 87 పులులున్నట్లు NSTR (నాగార్జున సాగర్-శ్రీశైలం ప్రాజెక్ట్) నిర్ధారించింది. జంగిల్ సఫారీలో వెళ్లే పర్యాటకులకు పులులు తారసపడుతూ ఉన్నాయి. అదే విధంగా కృష్ణమ్మ అందాలను తిలకించొచ్చు.
- నల్లమల విహారానికి విచ్చేసే పర్యాటకులు జంగిల్ క్యాంప్లో స్టే చేయాలి అనుకుంటే ఆన్లైన్లో nstr.co.in వెబ్సైట్లో లాగిన్తో బుక్ చేసుకోవచ్చు. పర్యాటకుల కోసం బైర్లూటిలో 4 కాటేజీలు, 6 టెంట్లు, పచ్చర్లలో 4 కాటేజీలు, 2 టెంట్లు ఏర్పాటు చేశారు. ఒక రోజు విడిదికి రూ.7,000 చెల్లించాల్సి ఉంటుంది. ఉదయం 12 నుంచి మరుసటి రోజు ఉదయం 12 వరకు ఇక్కడ స్టే చేయొచ్చు.
- కేవలం సఫారీ చేసే వారు ఒకసారి వాహనానికి (10 మందికి) రూ.3,000 చెల్లించాలి. www.nstr లో లాగిన్ అయితే వీటి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక్కడ విహరించేందుకు వాహన సౌకర్యంతో పాటు భోజన సౌకర్యం ఉంటుంది.
- శ్రీశైలంలో చెంచుల జీవన విధానం వివరించే ప్రత్యేకమైన మ్యూజియం ఉంటుంది. ఆది మానవుల కాలం నుంచి చెంచుల జీవన విధానాన్ని ఎంతో చక్కగా బొమ్మలతో ఏర్పాటు చేశారు.
సముద్రం, నది కలిసే చోటు - అడవి మధ్యలో నడవచ్చు - సమ్మర్లో బెస్ట్ స్పాట్
పేరుపాలెం బీచ్ చూడాల్సిందే - కుటుంబంతో గడిపేందుకు బెస్ట్ టూరిస్ట్ స్పాట్