Cybercrime Syndicate Brutal Actions : సైబర్ క్రైంలు చేయడంలో టార్గెట్ చేరుకోలేదనే కారణంతో మయన్మార్ దేశంలోని మయవాడీ సైబర్క్రైమ్ సిండికేట్ పాల్పడిన అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఆ దేశ ఆర్మీ చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్తో బయటపడిన బాధితులు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోని ఆశ్రయిస్తుండటంతో అక్కడి ముఠాల దారుణాలు బహిర్గతమవుతున్నాయి. తాజాగా హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలోని ఫస్ట్ లాన్సర్ ప్రాంతానికి చెందిన యువకుడు(25) శనివారం సీఎస్బీకి ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు నమోదైంది.
వివరాల్లోకి వెళితే గతేడాది అమెజాన్ కస్టమర్ సర్వీస్లో పనిచేసినటువంటి బాధితుడు మరో మంచి ఉద్యోగం కోసం సెర్చ్ చేశాడు. ఈక్రమంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన సయ్యద్ ఇర్ఫాన్ టెలిగ్రాం ద్వారా ఇచ్చిన డేటా ఎంట్రీ జాబ్ ఆఫర్ గురించి తెలియడంతో ఆన్లైన్లో అతడిని సంప్రదించారు. ఇర్ఫాన్ ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన కమల్సింగ్ కరుంగాను పరిచయం చేయించారు. అనంతరం చైనాకు చెందిన వారితో టెలిగ్రాంలోనే ఇంటర్వ్యూ చేసి ఆ జాబ్నకు ఎంపికైనట్లు వెల్లడించారు. వారు పంపించిన విమాన టికెట్తో బాధితుడు గత డిసెంబరు 28న బ్యాంకాక్లోని సువర్ణభూమి విమానాశ్రయానికి వెళ్లారు.
సైబర్ క్రైమ్ సిండికేట్ దారుణ ఆకృత్యాలు : అక్కడి సదరు వ్యక్తులు బాధితుడిని మాయిసోట్కు తీసుకెళ్లారు. అనంతరం పాకిస్థాన్ ఏజెంట్ నుమాన్ ఓ వాహనంలో థాయ్లాండ్ దేశ సరిహద్దుల్లోని నది వద్దకు బాధితుడిని తరలించారు. అక్కడి నుంచి బాధితుడిని మరికొందరు బోటులో నదిని దాటించారు. మయన్మార్లోకి అడుగుపెట్టిన తర్వాత బాధితుడిని సైనిక దుస్తుల్లో ఉన్నటువంటి సాయుధులు మయవాడీలోని కేకే4 పార్క్కు తీసుకెళ్లి ఝంటూ కంపెనీకి చేర్చారు. అక్కడి నిర్వాహకులు బాధితుడి నుంచి పాస్పోర్టును తీసుకుని సైబర్ నేరాలు చేసే ఓ పనిని అప్పగించారు. అందుకు నిరాకరించినటువంటి బాధితుడు ఇంటికి వెళతానని చెప్పగా 4500 అమెరికా డాలర్లు చెల్లించాలని నిర్వాహకులు డిమాండ్ చేశారు. మరో గత్యంతరం లేక బాధితుడు సైబర్ నేరాలు చేసే పనికి అంగీకరించారు.
రోజుకు 18 గంటలు పని అప్పగింత : సోషల్ మీడియా యాప్ ఫేస్బుక్లో నకిలీ ఖాతా తెరిచి అమెరికా పౌరులకు ఫ్రెండ్ రిక్వెస్ట్లను పంపడం కొన్నిరోజులపాటు చాటింగ్ ద్వారా మచ్చిక చేసుకున్న అనంతరం వారితో నకిలీ క్రిప్టో కరెన్సీ వ్యాలెట్లలో ఇన్వెస్ట్మెంట్ చేయించడం లాంటి పనులను బాధితుడికి అప్పగించారు. ఈ పనుల్లో టీం లీడర్గా చైనా దేశస్థుడు ఉండగా అసిస్టెంట్ టీంలీడర్గా పంజాబీ ఉన్నారు. అమెరికా పౌరులు లక్ష అమెరికన్ డాలర్లను క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే ఒక్కశాతం కమీషన్ ఇస్తామని చెప్పారు. కొన్నిరోజుల తర్వాత బాధితుడి పనితీరు సరిగా లేదనే కారణంతో వారంతపు సెలవును తొలగించారు.
అతడికి రోజుకు 18 గంటలపాటు పనిని అప్పగించారు. అంతటితో ఆగకుండా భౌతికశిక్షలను కూడా అమలు చేశారు. వాటిలో ఎర్రటి ఎండలో కదలకుండా గంటలకొద్దీ నిలుచోవడం ఒకటి. అలాగే కప్పలా గెంతే శిక్షను విధించారు. ఈక్రమంలో బాధితులు మయన్మార్లోని భారత ఎంబసీకి రహస్యంగా మెయిల్ ద్వారా కంప్లైంట్ చేయడంతో రెస్క్యూ చేస్తామనే హామీ లభించింది. ఈలోపు సైబర్క్రైమ్ సిండికేట్ వలలో చిక్కుకున్న బాధితులకు విముక్తిని కలిగించేందుకు మయన్మార్, థాయ్లాండ్, చైనా మిలిటరీల ఆపరేషన్లు చేపట్టినట్లు బాధితులకు సమాచారమందింది.
ఈక్రమంలోనే గతనెల 23న మిలిటరీ కేకే4 పార్క్కు రావడంతో బాధితుడు వారి ముందు తన గోడు వెళ్లబోసుకున్నారు. అలా మిలిటరీ రెస్క్యూ చేసి భారత ఎంబసీ కార్యాలయానికి అప్పగించడంతో మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్లో బాధితుడు ఈనెల 11న ఉత్తర్ప్రదేశ్లోని ఘజియాబాద్ ఎయిర్పోర్ట్లో దిగారు. అక్కడినుంచి హైదరాబాద్కు చేరుకుని శనివారం పోలీసులకు కంప్లైంట్ చేశారు.
'స్మార్ట్ఫోన్ గిఫ్ట్ ఆఫర్' - ఆశపడ్డారో ఖాళీచేస్తారు
సైబర్ నేరగాళ్ల వికృత చేష్టలు - టార్గెట్ రీచ్ కాకుంటే 15 అంతస్తుల భవనం 7సార్లు ఎక్కాలి -