Mulagalampalli Headmaster Campaign : ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులు బలోపేతం కావాలనే సర్కార్ లక్ష్యాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు ఆ ఉపాధ్యాయుడు. ఇక్కడ అందించే విద్యాప్రమాణాలు, సౌకర్యాలు ప్రైవేట్ స్కూల్స్కి ఏ మాత్రం తీసిపోదని తనదైన శైలిలో అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చదివించాలని వినూత్న ప్రచారం చేస్తున్నారు. ఆయనే ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం ములగలంపల్లి మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మూడు రమేష్ బాబు.
గ్రామస్థులు, విద్యార్థుల తల్లిదండ్రులందరూ ఆయణ్ని బాబు మాస్టారు అని ప్రేమగా పిలుస్తారు. ప్రస్తుతం ఈయన బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని తన ద్విచక్ర వాహనానికి ఓ మైకును ఏర్పాటు చేసుకొని విస్తృత ప్రచారం చేస్తున్నారు. సర్కార్ బడుల్లో విజయవంతంగా అమలు చేస్తున్న కార్యక్రమాలు, ఫొటోలు, వివరాలుతో ముద్రించిన కరపత్రాలను ఇంటింటికి వెళ్లి పిల్లల తల్లిదండ్రులకు అందించి వాటిని సవివరంగా వివరిస్తున్నారు. రూపాయి ఖర్చు లేకుండా నాణ్యమైన విద్యను అందించే ప్రభుత్వ పాఠశాలకు పంపాలని వారికి వివరిస్తున్నారు.
Innovative Campaign For Admissions : ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ బడుల్లో బోధన అందిస్తున్నట్లు రమేష్ బాబు పిల్లల తల్లిదండ్రులకు చెబుతున్నారు. ఇప్పటివరకు ములగలంపల్లి, రౌతుగూడెం, రవీంద్రనగర్, కనకాపురం, పాకలగూడం తదితర గ్రామాల్లో ప్రచారాన్ని పూర్తి చేశారు. మరిన్ని గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేసి రానున్న విద్యా సంవత్సరానికి ఎక్కువ మంది విద్యార్థులు పాఠశాలలో చేరే విధంగా కృషి చేస్తానని రమేష్ బాబు పేర్కొన్నారు.
"గతేడాది, ఈ సంవత్సరానికి గాను బడిబాటలో భాగంగా పాఠశాలలో విద్యార్థుల నమోదును పెంచడానికి మైక్తో ప్రచారం చేస్తున్నాను. దీనికి పిల్లల తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన వస్తుంది. వారు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రభుత్వ బడుల్లో విజయవంతంగా అమలు చేస్తున్న కార్యక్రమాల ఫొటోలు, వివరాలతో ముద్రించిన కరపత్రాలతో ఇంటింటికి వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులకు వివరిస్తున్నాను. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా బోధన అందిస్తున్నట్లు వారికి చెబుతున్నాను. దీనికి మా అధికారులతో పాటు సహచర ఉపాధ్యాయలు సహకరిస్తున్నారు." - రమేష్ బాబు, ప్రధానోపాధ్యాయుడు