Moneylenders are Exploiting Common Man : సామాన్యులు, చిరు వ్యాపారులు, రైతులు లాంటి వారు తమకు డబ్బు అవసరమైనప్పుడు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తుంటారు. వారి అవసరాలను ఆసరాగా చేసుకుని వడ్డీ వ్యాపారులు ఆస్తిపత్రాలు, పసిడి ఆభరణాలు లాంటి వాటిని తాకట్టుపెట్టుకుని డబ్బును ఇస్తుంటారు. అది కూడా అధికవడ్డీలకు ఇస్తూ సకాలంలో చెల్లించనట్లయితే సంబంధిత బుణగ్రహీతల ఆస్తులను స్వాదీనం చేసుకుంటున్నారు. ప్రజల వద్ద అధిక వడ్డీలు వసూలు చేస్తూ కోట్లకు పడగలెత్తుతున్నవారెందరో. అయితే వడ్డీ వ్యాపారం చేయడానికి కూడా కొన్ని నిబంధనలు ఉంటాయి. వారు తప్పనిసరిగా సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి తగిన అనుమతులు పొందాలి. కానీ అధికశాతం మంది ఈ నిబంధనలను బేఖాతరు చేస్తూ ఇష్టారాజ్యంగా వడ్డీ వ్యాపారాలు చేస్తున్నారు.
మచ్చుకు కొన్ని ఘటనలు : ఆదిలాబాద్లో ఆయనో ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తుంటారు. విధినిర్వహణ కంటే వడ్డీ వ్యాపారంపైనే అతడికి మక్కువ ఎక్కువ. రైతులు, చిరువ్యాపారులు, కూలీల అవసరాలను ఆసరా చేసుకొని వారికి రూ.25 వేలనుంచి రూ.50 వేల వరకు అప్పుగా ఇస్తుంటారు. రూ.25 వేల అప్పు ఇస్తే ముందుగానే రూ.2,500, అదే యాబై వేల రూపాయలైతే రూ.5 వేలు కోత పెడతారు. మిగిలిన డబ్బులను రోజువారీ లెక్క ప్రకారం 3 నెలల్లోగా తిరిగి చెల్లించాలనేది షరతు. అప్పును తీసుకునే వ్యక్తి ఏదో ఒకటి తాకట్టుపెట్టాల్సి ఉంటుంది. సకాలంలో చెల్లించకుంటే తాకట్టులో ఉన్నటువంటి ఆస్తి ఉద్యోగి సొంతమవుతుంది. ఈ విధంగా ఆయన కోట్లు సంపాదించాడని పోలీసుల దృష్టికి వెళ్లింది.
వడ్డీ వ్యాపారానికి నిబంధనలివి..
- వడ్డీ వ్యాపారం చేయాలంటే తప్పనిసరిగా నిర్దిష్ట అడ్రస్తో సబ్రిజిస్ట్రార్ ఆఫీస్లో తప్పనిసరిగా పేరును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
- బ్యాంకు బ్యాలెన్సు చూపించి తహసీల్దార్(ఎమ్మార్వో), ఆర్డీవో పర్మిషన్ తీసుకోవాలి.
- అప్పులు, వసూళ్లను రిజిస్టర్లో ఎంటర్ చేయాలి.
- తాకట్టు పెట్టుకోరాదు.
- స్టాంపుపేపర్లను రాసుకోకూడదు.
- ప్రభుత్వం నిర్దేశించిన వడ్డీలకు మాత్రమే అప్పు ఇవ్వాలి.
కాగా ఇటీవల కాలంలో పలు జిల్లాల్లో అక్రమ వడ్డీ వ్యాపారం చేస్తున్న వారిపై పోలీసులు దృష్టిసారించారు. తాజాగా ఇల్లు గుల్ల చేసేలా అక్రమ వడ్డీ వ్యాపారం చేసేటువంటి వ్యక్తుల జాబితాను తయారు చేసి వారి ఇళ్లపై ఏకకాలంలో సోదాలను నిర్వహించటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆదిలాబాద్ పురపాలక పరిధిలోని వన్టౌన్, టూటౌన్ సహా ఆదిలాబాద్ గ్రామీణం, మావల, బేల, నార్నూర్, బోథ్, గుడిహత్నూర్, ఇచ్చోడ, ఉట్నూరు మండలాల్లో బుధవారం ఏకకాలంలో సోదాలు నిర్వహించిన పోలీసులు 31 మందిపై కేసులు నమోదు చేశారు. బాధితుల ఫిర్యాదులను నమోదు చేయని పోలీసులపై కూడా చర్యలు తీసుకునేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది.
Chits Fraud in AP: చిట్టీలు, వడ్డీ వ్యాపారం పేరుతో రూ.20 కోట్లు బురిడీ