MISSING CASES IN VIZIANAGARAM DISTRICT: ఉమ్మడి విజయనగరం జిల్లాలో వరుసగా మిస్సింగ్ కేసులు నమోదవుతున్నాయి. గత 3 నెలల్లో 105 మంది ఆచూకీ కానరావడం లేదని పోలీస్స్టేషన్లలో కేసులు నమోదు కావడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఆర్థిక సమస్యలు, ప్రేమ, కుటుంబ కలహాలు, ఒత్తిడి, చదువులో రాణించకపోవడం, ఇంట్లో సహకారం లేకపోవడం, తదితర కారణాలతో అదృశ్యమవుతున్నారు. చాలామంది ఇంటిని వదిలేసి వెళ్లిపోతున్నారు.
ఓ అబ్బాయి ఉన్నత కుటుంబంలో పుట్టాడు. తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. రోజూ స్కూల్కి వెళ్తుండేవాడు. ఒక రోజు స్కూల్కి అని బ్యాగేసుకుని బయలుదేరి, రైలెక్కి వెళ్లిపోయాడు. పోలీసులు ఎంతో కష్టపడి హరియాణాలో గుర్తించారు. తీరా ఆ అబ్బాయి చెప్పింది ఏమిటంటే, చదువు పేరిట తల్లిదండ్రులు వేధిస్తున్నారని, భరించలేక ఇంటిని వదిలేసినట్లు చెప్పాడు. 15 రోజుల కిందట ఈ ఘటన చోటుచేసుకుంది.
మరో కేసులో, అమ్మాయికి వయసు పెరుగుతోందని పెళ్లి చేయాలని ఆ తల్లిదండ్రులు భావించారు. మరో 4 రోజుల్లో పెళ్లి ముహూర్తం ఉండగా, ఆ అమ్మాయి వెళ్లిపోయింది. ఆచూకీ కోసం గాలించి, చివరకు ఎలాగోలా పట్టుకున్నారు. ఆమెను ప్రశ్నించగా, తన స్నేహితురాలు పెళ్లి చేసుకుని ఇబ్బంది పడుతోందని, తాను కూడా అలాంటి కష్టాలు పడలేనని చెప్పింది.
వారే అధికం: అదృశ్యమవుతున్న వారిలో మహిళలు, బాలికలే ఎక్కువగా ఉంటున్నారు. ప్రేమ వ్యవహారం, లైంగిక సంబంధాలు, వేధింపులు తదితర కారణాలతో ఇళ్ల నుంచి వెళ్లిపోతున్నట్లు తెలుస్తోంది. వీరిలో చాలామంది తిరిగి చేరిన ఘటనలు సైతం ఉన్నాయి. పురుషులు, బాలురు మాత్రం ఏళ్ల తరబడి కనిపించడం లేదని పోలీసులు తెలిపారు.

2024లో మిస్సింగ్ కేసుల సంఖ్య: పురుషులు - 83, మహిళలు - 114, బాలికలు 44, బాలురు 11 మంది మిస్ అయినట్లు కేసులు నమోదు అయ్యాయి.
2025లో మిస్సింగ్ కేసుల సంఖ్య (జనవరి నుంచి మార్చి వరకు): పురుషులు - 30, మహిళలు - 44, బాలికలు 24, బాలురు 07 మంది మిస్ అయినట్లు కేసులు నమోదు అయ్యాయి.
ఈ జాగ్రత్తలు తీసుకోవాలి:
- ఎంత బిజీగా ఉన్నా పిల్లలపై ఓ కన్నేయాలి.
- చదువు పేరుతో వారిని ఒత్తిడి చేయకూడదు.
- వారితో మంచి పుస్తకాలు చదివించి, విహారయాత్రలకు తీసుకెళ్లాలి.
- సోషల్ మీడియాకి దూరంగా ఉంచాలి.
- యుక్త వయసు బాలికలకు అవసరం మేరకే ఫోన్ ఇవ్వాలి.
- వేధింపులు, ఆర్థిక, అనారోగ్య సమస్యలు ఉంటే ముందుగానే గుర్తించి, వారికి అండగా నిలవాలి.
ముందే ఇలా గుర్తించండి:ముభావంగా ఉన్నా, ఏవైనా సమస్యలున్నా ముందే గుర్తించి మానసిక వైద్య నిపుణులను సంప్రదించాలని మహారాజా ప్రభుత్వాసుపత్రి మానసిక, వ్యక్తిత్వ వికాస నిపుణుడు ఎస్వీ.రమణ తెలిపారు. ఇబ్బందుల్లో ఉన్నవారిని చూసి ఎగతాళి చేయకుండా, వారి సమస్య తెలుసుకొని ధైర్యం చెప్పాలని పేర్కొన్నారు. ప్రణాళిక బద్ధంగా పనులు పూర్తి చేయడం, వ్యాయామం, సంగీతం వినడం, ఇష్టమైన ఆటలు, ఆహారం తినడం, పుస్తకాలు చదవడం, సినిమాలు చూడటం అలవాటు చేయాలని సూచించారు. ఫోన్లు, టీవీలకు దూరంగా ఉంచాలని అన్నారు.
టీ కోసం రైలు దిగి - 20 ఏళ్ల తర్వాత కుటుంబాన్ని కలుసుకున్న వృద్ధుడు
భార్య మిస్సింగ్ - కంటి చూపు మందగించి భర్తకు ఆపరేషన్! కళ్లు తెరిచి చూస్తే పక్క బెడ్లో!