Meteorological Department Predicted Rains in AP: వాతావరణ అనిశ్చితి ప్రభావంతో ఓ వైపు ఎండలు, మరోవైపు వర్షాలతో రాష్ట్రంలో భిన్న వాతావరణం నెలకొంది. పగటి పూట భానుడు నెత్తిన నిప్పుల కుంపటిని తలపిస్తున్నాడు. ఈ వేసవి చాలా హాట్ అన్న అంచనాలు నిజం చేస్తూ ఎండలు ఠారెత్తిస్తున్నాయి. మరోవైపు సాయంత్రం కాగానే వాతావరణం చల్లబడిపోతోంది. హోరు గాలితో మొదలై చిటపట చినుకులు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, పిడుగులతో వర్షాలు పడుతున్నాయి.
పిడుగులతో పాటు తేలికపాటి వర్షాలు: వాతావరణ అనిశ్చితి ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ విభాగం తెలిపింది. శుక్రవారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, ఏలూరు, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో పిడుగులతో పాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. శనివారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులు పడటంతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశముందని పేర్కొంది.
36 ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు: మరోవైపు గురువారం(17/04/2025) నంద్యాల జిల్లా గోస్పాడు, రుద్రవరంలో 42.1 డిగ్రీలు, వైఎస్సార్ జిల్లా వేంపల్లెలో 41.5, తిరుపతి జిల్లా మంగనెల్లూరులో 41.4, కర్నూలులో 40.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది. 36 ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయని వెల్లడించింది.
పంటలు చేతికి అందివచ్చే సమయం - ఈ లోపు అన్నదాతపై ప్రకృతి కన్నెర్ర