MAN BLACKMAILED WOMAN: రాంగ్కాల్ ద్వారా పరిచయమైన మహిళతో స్నేహం పెంచుకున్న ఓ వ్యక్తి ఆమెతో తీసుకున్న వీడియోలను చూపి, బెదిరిస్తూ రూ.4 కోట్ల డబ్బు, 800 గ్రాముల బంగారు ఆభరణాలను కాజేశాడు. అప్పటికీ అతని వేధింపులు ఆగకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు విశాఖ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు నిందితుడిని పట్టుకుని, అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. దీనికి సంబంధించిన వివరాలను విశాఖ మూడో పట్టణ పోలీసులు తెలిపారు.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన బి.అక్షయ్కుమార్కు 2020లో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ మహిళతో రాంగ్కాల్ ద్వారా పరిచయం ఏర్పడింది. తరువాత ఆమెకు ఫోన్ చేయగా స్పందించకపోవడంతో మెస్సేజ్లు పంపడం మొదలుపెట్టాడు. ఆ క్రమంలో సదరు మహిళ వ్యక్తిగత విషయాలు తెలుసుకున్నాడు.
తనతో స్నేహం కొనసాగించాలని, మాట్లాడాలంటూ ఒత్తిడి చేశాడు. ఆమె మాట్లాడకుండా ఉంటే తన వద్ద ఉన్న వాయిస్ రికార్డులను భర్తకు పంపిస్తానని బెదిరించేవాడు. ఈ విషయం చెప్పకుండా ఉండటానికి విశాఖపట్నం మద్దిలపాలెంలోని ఓ షాపింగ్మాల్ వద్దకు 10 లక్షల రూపాలయు తీసుకుని రమ్మన్నాడు. అక్కడికి వచ్చిన ఆమె నుంచి డబ్బులు తీసుకున్న అనంతరం ఓ ప్రైవేటు హోటల్కు తీసుకుని వెళ్లి, ఆమెను లొంగదీసుకున్నాడు. రహస్యంగా దృశ్యాలను చిత్రీకరించాడు. అప్పటి నుంచి అక్షయ్కుమార్ మరింతగా వేధించసాగాడు.
వీడియోలతో బెదిరిస్తూ పలు దఫాలుగా సుమారు 4 కోట్ల రూపాయలను పలు బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయించాడు. 800 గ్రాముల బంగారు ఆభరణాలు సైతం తీసుకున్నాడు. అంతటితో ఆగకుండా తరచూ తన కోరిక తీర్చాలని, లేదంటే వీడియోలను తన భర్తకు పంపిస్తానని, అతనిపై యాసిడ్ పోస్తానని, పిల్లల్ని కిడ్నాప్ చేస్తానని బెదిరించాడు.
వారం రోజుల క్రితం విశాఖపట్నం బీచ్రోడ్డులోని ఓ హోటల్లో కలవాలంటూ ఫోన్ చేశాడు. తీవ్ర ఆందోళనకు గురైన ఆ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. విషయం తెలుసుకున్న ఆమె భర్త, బావ ఈ నెల 23వ తేదీన విశాఖ మూడో పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితుడు అక్షయ్కుమార్ తిరుపతిలో ఉన్నట్లు తెలుసుకుని, అతడిని అరెస్ట్ చేసి విశాఖకు తీసుకొచ్చారు. నిందితుడు అక్షయ్కుమార్ నుంచి కారు, 65 గ్రాముల బంగారం, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు ఖాతాల్లో సుమారు 2 కోట్ల రూపాయల డబ్బులు ఉన్నట్లు గుర్తించి సీజ్ చేశారు.
బామ్మ అకౌంట్ నుంచి రూ.80 లక్షలు మాయం- అతనితో ఫ్రెండ్షిప్ చేయడమే పాపం!
'గదిలోకి వెళ్లి తలుపులు వేసి వీడియో కాల్లోకి రా' - వృద్ధురాలికి వేధింపులు