Leopard Died in Hunters Trap At Annamaya District: ఉచ్చులో చిక్కుకున్న చిరుత ప్రాణాలను కాపాడుకోవడానికి పోరాడి చివరకు మృత్యువుడిలోకి చేరుకుంది. చిరుతను కాపాడడంలో అటవీశాఖ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. చిరుత మృతిపై పరిసర ప్రాంతంలోని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేయడమే కాక అధికారుల నిర్లక్ష్య వైఖరిపై వాపోతున్న ఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది.
అసలేం జరిగిందంటే? అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం పొన్నూటిపాలెం అడవి పక్కన పొలం సమీపంలో వేటగాళ్లు ఏర్పాటు చేసిన ఉచ్చులో రెండు సంవత్సరాల వయసు కలిగిన చిరుత పులి చిక్కుకుంది. తెల్లవారుజామున ఉచ్చులో చిక్కుకున్న చిరుత ఉదయం 11 గంటల వరకు బాగానే ఉంది. ఆ తర్వాత చనిపోయిందని గ్రామస్థులు చెబుతున్నారు. అటవీ శాఖ అధికారులు మాత్రం చిరుతకు ఎలాంటి ప్రాణాపాయం లేదని రిస్క్యూ టీం సహకారంతో ద్వారా దాన్ని కాపాడి తిరిగి అడవులకు పంపిస్తామని భరోసా కల్పించారు.
కానీ చిరుతకు గన్ ద్వారా మత్తుమందు ఇవ్వడానికి సామగ్రి అంతా సిద్ధం చేసినప్పటికీ షూటర్ సకాలంలో రాకపోవడం గమనార్హం. అతని కోసం అటవీశాఖ అధికారులు గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. అటవీ శాఖ అధికారులు వెంట తీసుకొచ్చిన గన్ కాలం చెల్లిందని తెలిసింది. చివరకు అధికారుల నిర్లక్ష్యం కారణంగా చిరుత ఉచ్చులోనే తుది శ్వాస విడిచింది. చిరుత మృతి పై గ్రామస్తులు అధికారులపై తీవ్రంగా మండిపడ్డారు.
''చిరుత పులి మరణానికి సంబంధించి కారణమైన వారిని పట్టుకుని వారిపై వన్యపాణి సంరక్షణ చట్టం కింద తక్షణ చర్యలు తీసుకుంటాం. చిరుతను కాపాడేందుకు ప్రయత్నించాం. కానీ దురదృష్టవశాత్తు కాపాడలేకపోయాం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం'' -శ్రీనివాసులు, సబ్ డిఎఫ్ఓ, మదనపల్లి
అనంతపురం జిల్లాలో చిరుత కలకలం - భయాందోళనలో రైతులు
తిరుమల అలిపిరి నడకమార్గంలో చిరుత సంచారం - సీసీ కెమెరాలో దృశ్యాలు