Leopard Death Case: ఉచ్చు అమర్చి చిరుతను చంపిన కేసు విచారణను అటవీశాఖ అధికారులు వేగవంతం చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పీసీసీఎఫ్ చలపతిరావును విచారాణాధికారిగా నియమించారు. కాగా అన్నమయ్య జిల్లా మదనపల్లె సమీపంలోని పొన్నూటి పాలెం అటవీ ప్రాంతంలో ఉచ్చులో పడి మరణించిన చిరుత ప్రదేశాన్ని క్షుణ్ణంగా ఆయన పరిశీలించారు. జంతువులకు తాగునీటి వనరులు లభ్యమయ్యే చోటు, అడవి జంతువులు తిరగడానికి అనువుగా ఉండే ప్రదేశాలతో పాటు పరిసర ప్రాంతాలు పరిశీలించారు.
అనంతరం గ్రామస్థులను విచారించారు. ఘటన జరిగిన తీరుపై స్ధానికులను అడిగి తెలుసుకున్నారు. మరో వైపు గ్రామస్థులు అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసులో సంబంధం లేని వ్యక్తులను చేర్చి ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. సమస్య ఏదైనా ఉంటే రాతపూర్వకంగా ఇవ్వాలని ఆయన గ్రామస్థులకు సూచించారు.
ఈ ఘటనకు సంబంధించి అటవీశాఖ అధికారులు కొంతమందిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారని చలపతిరావు తెలిపారు. త్వరలోనే వాస్తవాలు బయటకి వస్తాయని చలపతిరావు వెల్లడించారు. ఉద్దేశపూర్వకంగా ఉచ్చు బిగించిన్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందన్నారు. సమగ్ర విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.
కడుపులో రెండు కూనలతో బలైన చిరుత: కాగా ఉచ్చు కారణంగా ప్రాణాలు కోల్పోయిన చిరుత కడుపులో రెండు కూనలు సైతం ఉండటంతో జంతుప్రేమికులు విషాదం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే మదనపల్లె సబ్-డీఎఫ్వో శ్రీనివాసులు స్పందించారు. ముందస్తు పథకం ప్రకారమే ఉచ్చు అమర్చి చిరుతను చంపారని తెలిపారు. చిరుతను చంపిన వారిని వదిలిపెట్టేది లేదని తేల్చిచెప్పారు.
చిరుత తరచూ ఆ ప్రాంతానికి వస్తుండటంతో చంపడానికి పథకం వేసినట్లు తమకు సమాచారం అందినట్లు సబ్-డీఎఫ్వో శ్రీనివాసులు తెలిపారు. చిరుత సంచారం గురించి ముందుగా సమాచారమిచ్చి ఉంటే బంధించి వేరే అటవీ ప్రాంతంలో వదిలిపెట్టే వాళ్లమని చెప్పారు. స్థానికులు అటవీశాఖ అధికారులకు సహకరించి ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదన్నారు. భవిష్యత్తులో ఎక్కడైనా అడవి జంతువులు కనిపిస్తే తక్షణమే అటవీశాఖ అధికారులకు సమాచారం అందజేయాలని సబ్ డీఎఫ్వో శ్రీనివాసులు ప్రజలను కోరారు.