Legislative Assembly Estimates Committee on TTD Services to Devotees : శ్రీవారి భక్తులకు టీటీడీ అందిస్తున్న సేవలపై ఏపీ శాసనసభ అంచనాల కమిటీ సంతృప్తి వ్యక్తం చేసింది. గతంలో, ప్రస్తుతం అందుతున్న సేవలను పోల్చితే ఎంతో సానుకూల మార్పు కనిపిస్తోందని కమిటీ ఛైర్మన్ జోగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. సేవల్లో నాణ్యత పెంచడం నిరంతర ప్రక్రియ అని గుర్తుచేశారు. పరిశుభ్రత, పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని ప్రశంసించారు. తిరుపతిలోని శ్రీపద్మావతి అతిథి గృహంలో గురువారం జరిగిన సమీక్షలో కమిటీ ఛైర్మన్, సభ్యులు పలు సూచనలు చేశారు.
నవతరానికి శ్రీవారి వైభవాన్ని తెలియజేసేలా డిజిటల్ మీడియాను బలోపేతం చేయాలన్నారు. టీటీడీ సేవలపై తిరుమలలో క్రమం తప్పకుండా ప్రకటనలివ్వాలి. స్వామివారి కీర్తనలు, గోవింద నామావళి రాత్రి 10 గంటల వరకూ వినిపించేలా చూడాలని సూచించారు. ఇటీవల తాను శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చి అస్వస్థతకు లోనైతే, అశ్విని ఆసుపత్రిలో నాణ్యమైన వైద్యం అందించారని కమిటీ సభ్యుడు వెంకట సూర్యనారాయణరాజు హర్షం వ్యక్తంచేశారు. వసతి గదుల నిర్మాణాలపై సభ్యుల ప్రశ్నలకు ఈవో బదులిస్తూ, తిరుమలలో కాలం చెల్లిన భవనాల స్థానంలో హైకోర్టు నిబంధనలకు లోబడి కొత్తవి నిర్మిస్తున్నామని చెప్పారు.
శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్ - జులై ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల
భక్తులకు కాషన్ డిపాజిట్ చెల్లించడంపై స్పందిస్తూ ఒకరి పేరుతో గది తీసుకుని, చెక్ అవుట్ సమయంలో వేరేవారు రావడం వల్ల ఫేస్ రికగ్నిషన్లో సమస్య తలెత్తి ఆలస్యమవడం మినహా ఇతర ఇబ్బందులేవీ లేవన్నారు. వైకుంఠం-1, 2లలో భక్తులకు అందిస్తున్న అత్యవసర వైద్యసేవలు, శ్రీవాణి ట్రస్టు వివరాలను వివరించారు. టీటీడీ ఆధ్వర్యంలో స్వామి, అమ్మవారి రాతి విగ్రహాల తయారీ, పంపిణీపై సభ్యులు ప్రశ్నించగా, హిందూ ఆలయాలకు ఐదడుగుల లోపు విగ్రహాలను ఉచితంగా అందిస్తామని ఈవో చెప్పారు.
టీటీడీ సేవలపై విభాగాల వారీగా అదనపు ఈవో సీహెచ్ వెంకయ్యచౌదరి పవర్ పాయింట్ ద్వారా వివరించారు. కమిటీ సభ్యులు భూమా అఖిలప్రియ, నిమ్మక జయకృష్ణ, మద్దిపాటి వెంకటరాజు, డాక్టర్ వాల్మీకి పార్థసారథి, పాశిం సునీల్కుమార్, ఏలూరు సాంబశివరావు, వరుదు కళ్యాణి, పెన్మత్స వరాహ వెంకటసూర్య నారాయణరాజు పాల్గొన్నారు.
ఉనికిని చాటుకునేందుకే తిరుమలపై దుష్ప్రచారం - వైఎస్సార్సీపీపై కూటమి మంత్రులు ఫైర్