LEAP SCHOOLS IN AP: ఆంధ్రప్రదేశ్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి నియోజకవర్గానికి ఒకటి చొప్పున లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఏపీ (LEAP) పాఠశాలల అభివృద్ధికి విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. మంగళగిరి నియోజకవర్గంలోని నిడమర్రు పాఠశాలలో ప్రయోగాత్మకంగా లీప్ను అమలు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వచ్చే జూన్ నుంచి ఈ లీప్ స్కూళ్లను తీసుకురానున్నారు. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ను తీసుకొస్తామని ఇప్పటికే ప్రకటించారు. దీనినే 'లీప్'గా పేర్కొంటున్నారు.
ప్రస్తుత విద్యా శాఖలోని సవాళ్లు, సమస్యలతో పాటు రాబోయే 5 సంవత్సరాలలో తీసుకురావాల్సిన మార్పులతో లీప్ డాక్యుమెంట్ను రూపొందించారు. ఇందులో ప్రీ-ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి యూనివర్సిటీల వరకు తీసుకురాబోయే మార్పులతోపాటు వాటికి సమయాలను నిర్దేశించారు. లీప్ పాఠశాలలను ఎమ్మెల్యేలు, జిల్లా విద్యాధికారులు, కలెక్టర్లు కలిసి సెలక్ట్ చేస్తారు. వీటికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) ఫండ్స్, దాతల సహాయంతో సౌకర్యాలు కల్పించాలని భావిస్తున్నారు.
వివిధ స్థాయిలు: లీప్ విధానం అమలుతో సాధించాల్సిన లక్ష్యాలను స్థాయిల వారీగా నిర్ణయించారు. ఫౌండేషనల్, ప్రాథమిక, ప్రాథమికోన్నత, సెంకడరీ స్థాయిలుగా దీన్ని డివైడ్చేశారు. అంగన్వాడీ సెంటర్లలో వందశాతం అభ్యసన ప్రక్రియలు చేర్చుతారు. 1వ తరగతిలో చేరేందుకు పిల్లల్ని సంసిద్ధుల్ని చేస్తారు. ప్రభుత్వ బడుల్లో ప్రవేశాలు 5% పెరిగేలా చర్యలు తీసుకుంటారు. వీటిని సాధించేందుకు కరిక్యులం, పెడగాజీలో మార్పులు, మదింపు, టీచర్లకు ట్రైనింగ్ తదితరాలు అమలు చేస్తారు.
ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 80% మంది పిల్లలు వారి స్థాయికి తగిన సామర్థ్యాలు సాధించడం, అభ్యసన సామర్థ్యాల్లో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ స్టార్ రేటింగ్ పొందడంపైన ఫోకస్ చేస్తారు. డిజిటల్ అక్షరాస్యత, కరిక్యులంలో 21వ శతాబ్దపు స్కిల్స్ను ప్రవేశపెడతారు. చదువు మధ్యలో మానేసే పిల్లల్లో 95% మందిని తిరిగి స్కూళ్లలో చేర్పించడం, ప్రభుత్వ బడుల్లో 5% ప్రవేశాలు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించారు. సెకండరీ స్థాయిలోనూ వీటిని ప్రవేశపెడతారు.
5 అంశాల ప్రాధాన్యంగా: లీప్ కార్యక్రమంలో ముఖ్యంగా 5 అంశాలను ప్రాధాన్యంగా తీసుకొస్తున్నారు.
- ప్రతి ఒక్కరికీ సమాన, సమ్మిళిత విద్య అందించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా స్థూల ప్రవేశాల నిష్పత్తిని పెంపొందించడం, లింగ, సామాజిక సమ్మిళితతత్వం సాధించడంతోపాటు దివ్యాంగులకు సదుపాయాలు కల్పించాలని నిర్ణయించారు.
- విద్యార్థుల్లో సంపూర్ణ అభివృద్ధి, భవిష్యత్తుపై దృష్టిసారించి, వారి స్కిల్స్ని పెంపొందిస్తారు.
- ఇండస్ట్రీ ఆధారిత నైపుణ్యాలు, విద్యలో భాగంగా భవిష్యత్తు కేంద్రీకృత, ఉద్యోగాలు లభించేలా పాఠ్యప్రణాళిక రూపకల్పన చేస్తున్నారు.
- రీసెర్చ్, ఇన్నోవేషన్ కింద సృజనాత్మక పరిశోధనలు, వ్యవస్థాపక స్ఫూర్తిని ప్రోత్సహిస్తారు. నాలెడ్జ్ ఎకనామీ, ఇన్నోవేషన్ క్లస్టర్లు, నాణ్యమైన రీసెర్చ్ విజ్ఞానాన్ని పెంపొందిస్తారు.
- ఆర్థికవృద్ధిని ఆకర్షించే ప్రపంచస్థాయి ప్రతిభను సృష్టించడాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రపంచ ప్రమాణాలతో కూడిన కరిక్యులమ్, అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యం, వాటి క్యాంపస్ల ఏర్పాటుకు కృషి చేస్తారు.
బైజూస్కి బైబై - ప్రభుత్వ పాఠశాలల్లో మూలకు చేరుతున్న ట్యాబ్లు
ఏపీ విద్యార్థులకు గుడ్న్యూస్ - స్కూళ్లలో సెమిస్టర్ విధానం!