సేంద్రియ సాగులో మహిళా రైతు ఆదర్శం - ప్రమాదంలో కాలు కోల్పోయినా నిండైన ఆత్మస్థైర్యంతో!
సుమారు 30 రకాల పంటలు సాగు - మేలైన ఉత్పత్తుల సాగే లక్ష్యంగా అధిక దిగుబడులు సాధిస్తున్న కోటేశ్వరమ్మ

By ETV Bharat Andhra Pradesh Team
Published : July 31, 2025 at 10:28 AM IST
Woman Farmer Koteswaramma Organic Farming In Palnadu District: పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ప్రకృతి సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు పల్నాడు జిల్లాకు చెందిన మహిళా రైతు మన్నవ కోటేశ్వరమ్మ. ప్రమాదంలో కాలు కోల్పోయినా రెట్టించిన ఉత్సాహంతో భర్తతో కలిసి వాణిజ్య పంటలు, ఆకుకూరలు, ఉద్యాన పంటలను సాగు చేస్తున్నారు. రసాయన రహిత సాగుతో చక్కటి ఫలితాలు సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న కోటేశ్వరమ్మ విజయగాథను ఇప్పుడు చూద్దాం.
ప్రకృతి వ్యవసాయంలో ప్రత్యేకంగా: రెక్కాడితే కానీ డొక్కాడని జీవితం పరమాత్ముల కోటేశ్వరమ్మది. పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం ఉన్నవ గ్రామానికి చెందిన ఈమె 2020లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలు పోగొట్టుకున్నారు. అయినా నిరాశను దరిచేరనివ్వలేదు. అవరోధాలు ఎదురైనా సేంద్రియ సాగును వదిలిపెట్టలేదు. ఈ పట్టుదలే కోటేశ్వరమ్మను ప్రకృతి వ్యవసాయంలో ప్రత్యేకంగా నిలిపింది. కోటేశ్వరమ్మ, వెంకటేశ్వర్లు దంపతులు మెుదట నుంచి కౌలుకు పొలం తీసుకుని పత్తి, మిరప లాంటి పంటలు వేసేవాళ్లు. 2018లో వ్యవసాయ శాఖ అధికారులు చేసిన సూచన వారి సాగు పద్ధతుల్ని పూర్తిగా మార్చేసింది. ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేసేలా చేసింది.
కొనుగోలు చేసేందుకు పొలం వద్దకే: రసాయన ఎరువులు తగ్గించి, సేంద్రియ వ్యవసాయం చేయమంటూ వ్యవసాయ శాఖ అధికారులు చెప్పిన చిట్కాను ఆచరణలో పెట్టిన కోటేశ్వరమ్మ. ఆ ఫలితం చూసిన తరువాత పూర్తిస్థాయిలో ప్రకృతి వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇన్నాళ్లు రసాయనాల వల్ల భూమికి కలిగించిన నష్టం నుంచి ఉపశమనం కలిగించాలని సంకల్పించారు. ప్రయోగాత్మకంగా మెుదట 15 సెంట్లలో రసాయనాలు చల్లకుండా మిర్చి పంట వేశారు. మిగిలిన పొలంలో తెగుళ్లు రాకుండా రసాయనాలు చల్లారు.
ఈ క్రమంలో సేంద్రియ మిరప పంట చెక్కు చెదరకుండా ఉండటం గమనించారు. అప్పట్నుంచి భర్త సహకారంతో పూర్తిగా ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా కోటేశ్వరమ్మ దంపతులు పండిస్తున్న పంట ఉత్పత్తుల్ని కొనుగోలు చేసేందుకు గుంటూరుకు చెందిన వ్యాపారులు, విద్యా సంస్థల నిర్వాహకులు పొలం వద్దకే రావడం మెుదలుపెట్టారు. పండించిన పంటనంతా వాళ్లే కొంటామని ఒప్పందం చేసుకోవడంతో రెట్టించిన ఉత్సాహంతో ఆమె ముందుకు సాగుతున్నారు.
'నేను ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆకుకూరలు పండిస్తున్నాను. మొదట్లో అయితే మిరప, పత్తి పండించాము. మూడు సంవత్సరాల నుంచి కూరగాయలు, కంది పండిస్తున్నాము. 30 రకాల విత్తనాల వల్ల 30 రకాల పోషకాలు భూమిలో అందుతున్నాయి. దాంతో కెమికల్స్ ఉపయోగించాల్సిన అవసరం ఇక ఉండదు. దిగుబడి బాగుంది. మార్కెటింగ్ ఇబ్బందులు కూడా లేవు.' - కోటేశ్వరమ్మ, మహిళా రైతు
30 రకాల పంటలు: ప్రస్తుతం ఆరెకరాలు కౌలుకు తీసుకుని సేంద్రియ వ్యవసాయం చేస్తున్న కోటేశ్వరమ్మ. మిర్చి, పత్తి, కంది, అరటి, క్యాబేజీ, క్యారెట్ ఇలా సుమారు 30 రకాల పంటల్ని పండిస్తున్నారు. సర్జికల్ వాకర్ సాయంతో పొలంలో అడుగుపెట్టి, కూలీలతో కలసి వ్యవసాయ పనులను చక్కబెడుతున్నారు.పదిమందికి ఉపాధి కల్పిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాలతో పాటు గుంటూరులోనూ ఆకుకూరలు, కూరగాయల్ని విక్రయిస్తున్నారు. రసాయన రహిత పంట ఉత్పత్తుల్ని అందరికీ చేరువ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
సేంద్రియ ఎరువుగా గుర్రపుడెక్క - మహిళలకు ఉపాధి
ఐటీ జాబ్ను వదులుకొని సేంద్రీయ వ్యవసాయం - ఆర్గానిక్గా ఫుడ్ వ్యాపారం చేస్తున్న దంపతులు

