KIMS Study on TB detection using AI : చెస్ట్ ఎక్స్-రేలను ఉపయోగించి క్షయ వ్యాధి (టీబీని) గుర్తించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి కిమ్స్ హాస్పిటల్ అతిపెద్ద పరిశోధన చేసింది. ఈ మేరకు వివరాలను కిమ్స్ హాస్పిటల్స్ పల్మొనాలజీ విభాగాధిపతి డా.లతా శర్మ వివరించారు. పరిశోధనలో భాగంగా ఎక్కడా మానవ ప్రమేయం లేకుండా, 'క్యూఎక్స్ఆర్' అనే అత్యాధునిక ఏఐ టూల్ను ఉపయోగించి మొత్తం 16,675 మంది పేషెంట్ల చెస్ట్ ఎక్స్-రేలను విశ్లేషించారు. ఇందులో ప్రధానంగా 2 అంశాలపై దృష్టిపెట్టారు. ముందుగా ఏఐ ద్వారా టీబీని గుర్తించడం, ఆ తర్వాత రేడియాలజిస్టులు దాన్ని నిర్ధారించడం.
అత్యంత సమర్థవంతమైనది : టీబీ కేసులను గుర్తించడంలో ఏఐ టెక్నాలజీ అత్యంత సమర్థమైనదని ఈ పరిశోధన ద్వారా తెలిసింది. మొత్తం గుర్తించిన కేసుల్లో 88.7% కచ్చితమైనవిగా తేలింది. దీంతో వ్యాధిని త్వరగా గుర్తించడంలో ఏఐ కీలకపాత్ర పోషిస్తుందని నిర్ధారణ అయ్యింది. దానికితోడు ఇందులో టీబీ లేదని నిర్ధారించడంలో 97% కచ్చితత్వాన్ని ఏఐ(ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్) సాధించింది. ఏఐ టూల్ స్పెసిఫిసిటీ 69.1%గా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) ప్రమాణాలను ఇది అందుకుంటోంది.
మెరుగైన ప్రత్యామ్నాయం కానుంది : ఇందులో మరో కీలకమైన అంశం ఏమిటంటే ఏఐ గుర్తించిన కేసులన్నింటినీ నిపుణులైన రేడియాలజిస్టులు కూడా నిర్ధారించారు. అందువల్ల క్లినికల్ డయాగ్నసిస్లో ఏఐ సామర్థ్యం, దాని కచ్చితత్వాలకు ఇది నిదర్శనంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న టీబీ కేసుల నేపథ్యం, సంప్రదాయ రేడియోగ్రఫీతో దాన్ని నిర్ధారించడానికి ఎక్కువ సమయం పడుతున్నందువల్ల ఇది మెరుగైన ప్రత్యామ్నాయం కానుంది.
గేమ్ ఛేంజర్ కానుంది : ఈ సందర్భంగా డా.లతా శర్మ ఈ పరిశోధన ప్రభావం గురించి మాట్లాడారు. “టీబీ గుర్తింపులో ఏఐ టూల్ సామర్థ్యం, దాని కచ్చితత్వం చాలా బాగున్నాయని వివరించారు. ఇది గేమ్ ఛేంజర్ కానుందని వివరించారు. ముఖ్యంగా నిపుణులైన రేడియాజిస్టులు ప్రతిసారీ అందుబాటులో లేని పరిస్థితుల్లో ఇలాంటివి ఎంతగానో ఉపయోగపడతాయని డా.లతాశర్మ తెలిపారు.
కిమ్స్ ఆస్పత్రికి చెందిన సీనియర్ కన్సల్టెంట్ రేడియాలజిస్ట్ డాక్టర్ చైతన్య ఇసమళ్ల మాట్లాడుతూ, 'మానవ నైపుణ్యానికి ఏఐ ప్రత్యామ్నాయం కాలేదు గానీ, ప్రాథమిక పరీక్షల విషయంలో మాత్రం అది చాలా ఆధారపడదగ్గ పరికరంగా ఉపయోగపడుతుందన్నారు. అందువల్ల సంక్లిష్టమైన కేసుల్లో లోతుగా పరిశీలించేందుకు అవసరమైన సమయం వైద్యులకు దొరుకుతుంది' అని వివరించారు.
మరింత సమర్థవంతమైన చికిత్సలు అందించేందుకు : వైద్య పరీక్షలను విప్లవాత్మకం చేయడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్ర పెరుగుతున్న విషయాన్ని ఈ పరిశోధన నిర్ధారిస్తోంది. క్యూఎక్స్ఆర్ లాంటి ఏఐ టూల్స్ అంతర్జాతీయ టీబీ గుర్తింపు ప్రమాణాలను అందుకోవడంతో రోజువారీ చికిత్సా విధానాల్లో వాటిని జతచేయడం వల్ల వ్యాధులను త్వరగా గుర్తించి, మెరుగైన చికిత్సా ఫలితాలు సాధించవచ్చు. ఏఐ రోజురోజుకూ మరింత వృద్ధి చెందుతుండడంతో టీబీ లాంటి సాంక్రమిక వ్యాధులపై సమరం మరింత సమర్థంగా చేయొచ్చు. దీనివల్ల మరింత సమర్థమైన చికిత్సలను అందించేందుకు వీలుంటుంది.
21 ఏళ్లుగా ఊపిరితిత్తుల్లో ఇరుక్కుపోయిన పెన్ క్యాప్ - విజయవంతంగా తొలగించిన కిమ్స్ వైద్యులు
కిమ్స్ సరికొత్త అధ్యాయం.. ప్రపంచంలోనే తొలిసారిగా రోగులకు సేవచేసే రోబోలు