Japan Miyawaki Method to Implement in Amaravati: రాజధాని అమరావతి నిర్మాణం అభివృద్ధికి చిరునామాగా ఉండేలా బృహత్ ప్రణాళిక రూపొందించిన విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీకి వివరించారు. రాష్ట్ర రాజధానిని భవిష్యత్తు అవసరాలు తీర్చే నగరంగా ఎలా రూపుదిద్దుకోనుందో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించే అక్షయపాత్రలా అమరావతిని తయారు చేసే ప్రణాళిక వివరాలు ఇప్పుడు చూద్దాం.
ప్రధాని నరేంద్రమోదీ చేతులమీదుగా 2015 అక్టోబర్లో శంకుస్థాపన చేసుకున్న రాజధాని అమరావతి నిర్మాణం, 2019 వరకూ వేగంగా ముందుకు కదిలి తదనంతరం చోటుచేసుకున్న అధికార మార్పు వల్ల ఎలా స్తంభించిందో తెలిసిందే. మే 2వ తేదీన అమరావతి పునః ప్రారంభం పేరిట ప్రధాని నరేంద్ర మోదీతో దాదాపు లక్ష కోట్ల రూపాయలకు పైగా వివిధ ప్రాజెక్టు పనులు శంకుస్థాపన చేయించే దిశగా ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. వెలగపూడి సచివాలయం వెనుక దాదాపు 250 ఎకరాల విస్తీర్ణంలో ఇందుకు చేపట్టిన ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి.
అమరావతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్: ప్రధాని నరేంద్ర మోదీకి అధికారికంగా ఆహ్వానం పలికేందుకు దిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనతో దాదాపు గంటన్నర పాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అమరావతి నిర్మాణంపై రూపొందించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను సీఎం మోదీకి వివరించారు. పర్యావరణం, పౌరజీవనం మధ్య సమతౌల్యం పాటిస్తూ ఈ మాస్టర్ ప్లాన్ రూపుదిద్దుకుంది. అమరావతిని అత్యంత సౌకర్యవంతమైన నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతూ, అత్యున్నత జీవన ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు, ఆర్థిక వాతావరణంతో అభివృద్ధి చెందే నగరంగా మాస్టర్ ప్లాన్ రూపొందింది. స్థిరత్వం, రహదారుల అనుసంధానం, జీవన ప్రమాణాలు, నవీకరణ, వారసత్వ పరిరక్షణ, అన్ని వర్గాలు కలిసి ఉండేలా ఈ ప్రణాళికలో పెద్దపీట వేశారు.
ఐకానిక్ భవనాలు: నవనగరాలుగా నిర్మితమయ్యే అమరావతిలో విద్య, వైద్య, ప్రభుత్వ, క్రీడా, న్యాయ, ఆర్థిక, పర్యాటక, మీడియా, ఎలక్ట్రానిక్స్ సిటీలు ఉంటాయి. కేవలం 58 రోజుల్లో రైతులు స్వచ్ఛందంగా 34 వేల ఎకరాలు సమీకరణకు ఇచ్చిన విధానాన్ని గొప్ప చరిత్రగా ప్రధానికి ఇచ్చిన ప్రజెంటేషన్లో అభివర్ణించారు. ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్డు, గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కోసం మలిదశ భూ సమీకరణ చేపట్టనున్నట్లు వివరించారు. గ్రీన్, బ్లూ కాన్సెప్ట్తో రాజధానిలో 30 శాతం పచ్చదనం, నీటి ప్రవాహానికి ప్రాధాన్యం ఇచ్చారు.
బాహ్య, అంతర్ వలయ రహదారుల్ని 4 జాతీయ రహదారులతో అనుసంధానించేలా గ్రిడ్ రోడ్ నెట్వర్క్ విధానం చేపట్టనున్నారు. భూగర్భ కారిడార్ ద్వారానే నీరు, మురుగునీరు, వరద నీరు, శుద్ధి చేసిన నీటి పంపిణీతో పాటు విద్యుత్, ఐసీటీ సరఫరా జరగనుంది. 3300 కిలోమీటర్లకు పైగాసైక్లింగ్, వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు కానున్నాయి. సంప్రదాయేతర ఇంధన వనరులకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయాన్ని గ్రీన్ ఫీల్డ్ మోడల్లో నిర్మించనున్నారు. అసెంబ్లీ, సచివాలయం, హెచ్ఓడీ కార్యాలయాలు, హైకోర్టులు ఐకానిక్ భవనాలుగా నిర్మించనున్నారు.
స్వయం ఆర్థికాభివృద్ధి నగరంగా అమరావతి: రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.77,250 కోట్ల రూపాయలతో ప్రణాళిక రూపొందిస్తే రూ.49 వేల కోట్లకు టెండర్లు పిలిచారు. ఐకానిక్ భవనాలతో పాటు నివాస భవన సముదాయాల నిర్మాణానికి రూ.12,700 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఆర్టీరియల్, సబ్-ఆర్టీరియల్ యూటిలిటీ కారిడార్లతో కూడిన రోడ్లు, వరద నిర్వహణ పనులు, ఇతర మౌలిక సదుపాయాలకు రూ.16,200 కోట్లు ఖర్చు చేయనున్నారు.
భూసమీకరణ మౌలిక సదుపాయాల కల్పనకు రూ.20,100 కోట్లు కలిపి మొత్తంగా 49 వేల కోట్ల రూపాయల పనులకు టెండర్లు పిలిచారు. దీనికి రూ.15 వేల కోట్లు కేంద్ర పూచికత్తుతో ప్రపంచ బ్యాంక్, ఏడీబీ రుణం అందించాయి. మరో 11 వేల కోట్ల రూపాయల హడ్కో రుణం సమకూరింది. అన్ని వసతులు పోను ప్రభుత్వం వద్ద దాదాపు 4 వేల ఎకరాల మిగులు భూమి ఉంటుందని అంచనా. ఎకరా 20 కోట్ల రూపాయల చొప్పున ఆ భూమిని తనఖా పెట్టినా స్వయం ఆర్థికాభివృద్ధి నగరంగా అమరావతి అభివృద్ధి చెందనున్నట్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో వివరించారు.
21వ శతాబ్దపు భవిష్యత్తు రాజధాని: రాజధాని అమరావతి నగరం రూ.30,885.5 కోట్ల పెట్టబడుల్ని ఇప్పటికే ఆకర్షించింది. విద్యారంగంలో బిట్స్ అమరావతి, ఎక్స్ ఎల్ఆర్ఐ, విట్, ఏఐఐఎంలు, వైద్య రంగంలో ఈఎస్ఐతో పాటు ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రులు తమ సంస్థల ఏర్పాటుకు ముందుకొచ్చాయి. ఆతిథ్య రంగంలో హిల్టన్, మారియట్, నోవోటెల్, క్రోన్ ప్లాజాలు హోటళ్లు నిర్మించనుండగా, బ్యాంకింగ్ రంగంలో ఆర్బీఐ, ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్, నాబార్డ్లు తమ క్యార్యాలయాల ఏర్పాటుకు సముఖత వ్యక్తం చేశాయి.
ప్రభుత్వ రంగ సంస్థలైన సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, విదేష్ భవన్, హడ్కో, హెచ్పీసీఎల్లు అమరావతిలో ఏర్పాటు కానున్నాయి. భారతదేశంలోనే తొలి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ అమరావతిలో ఏర్పాటు కానుంది. దీనికి ఐబీఎం, టీసీఎస్, ఎల్అండ్ టీ, ఐఐటీ మద్రాస్లు తమ సహాయ సహకారాలు అందించనున్నాయి. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుతో పాటు సీఐఐ ఆధ్వర్యంలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ అమరావతిలో ఏర్పాటు కానుంది. వచ్చే 3 ఏళ్లలో ప్రారంభానికి నోచుకునే విధంగా 21వ శతాబ్దపు భవిష్యత్తు రాజధాని నిర్మాణంలో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొననుండటం ఓ అరుదైన ఘట్టంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో అభివర్ణించారు.
జపాన్లో అనుసరిస్తున్న మియావాకి విధానం: రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాజధాని అమరావతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు ప్రధానమంత్రి మోదీ తన ఆలోచనలను పంచుకున్నారు. జపాన్లో అనుసరిస్తున్న మియావాకి విధానం ద్వారా రాజధాని అమరావతిలో వేగంగా పచ్చదనం విస్తరింపచేయవచ్చన్న మోదీ సూచనను రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. మియావాకి విధానం అనేది స్థానిక మొక్కలతో గ్రీనరీని వేగంగా, సమర్థవంతంగా సృష్టించడానికి ఉపయోగించే ఒక పద్ధతి. జపాన్కి చెందిన అకిరా మియావాకీ అనే వృక్షశాస్త్రవేత్త ఈ పద్ధతిని అభివృద్ధి చేశారు. ఈ పద్ధతిలో తక్కువ స్థలంలోనే వేగంగా, దట్టంగా చెట్లను పెంచడం సాధ్యమవుతుంది.
అమరావతిలో వంపులు తిరుగుతూ వెళ్లనున్న 'కృష్ణమ్మ' - రెండువైపులా పార్కులు
డయాగ్రిడ్ విధానంలో ఐకానిక్ టవర్లు - 47 అంతస్తులపై హెలీప్యాడ్