IPS Officers Approached High Court in Bhoodan Land Issue : భూదాన్ భూముల అంశంలో గతవారం హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తేలింది. ఈ వ్యవహారంపై పలువురు ఐపీఎస్ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. సింగిల్ బెంచ్ తీర్పుపై మహేశ్ భగవత్, స్వాతి లక్రా, సౌమ్యా మిశ్రా అప్పీల్ పిటిషన్ చేశారు. పిటిషనర్లు 74 మందిని ప్రతివాదులుగా చేర్చారు. ప్రతివాదుల జాబితాలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్లు ఉన్నారు. ఈ నెల 24న 27 మంది అధికారుల భూములను నిషేధిత జాబితాలో పెట్టాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. సింగిల్ బెంచ్ జస్టిస్ భాస్కర్ రెడ్డి ఈ తీర్పును వెల్లడించారు.
హైకోర్టులో భూదాన్ భూముల వ్యవహారం : భూదాన్ భూముల్లో అక్రమాలపై విచారణ చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంతో సీబీఐ, ఈడీలతో దర్యాప్తు చేయించాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలానికి చెందిన బిర్ల మల్లేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సీవీ భాస్కర్ రెడ్డి ఏప్రిల్ 24న విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు విన్న ధర్మాసనం ప్రాథమికంగా రికార్డులను పరిశీలిస్తే నాగారంలోని 181, 182, 194, 195 సర్వే నంబర్లలోని భూములు భూదాన్ బోర్డుకు చెందినవని తేలుతోందని స్పష్టం చేశారు. పిటిషన్లో ఉన్నత అధికారులపై తీవ్రమైన ఆరోపణలు చేసిన నేపథ్యంలో వారి ప్రయోజనాల కోసం అధికార దుర్వినియోగానికి అవకాశం ఉందని పేర్కొన్నారు.
హైకోర్టు తన విచక్షణాధికారంతో సామాజిక ఆస్తి పరిరక్షణలో భాగంగా ఈ పిటిషన్పై విచారణ ముగిసేదాకా ఆ సర్వే నంబర్లలోని భూములను నిషేధిత జాబితాలో చేర్చాలని ఆదేశాలు జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేదాకా ఆ భూముల్లో ఎలాంటి మార్పులు, చేర్పులు చేయరాదని, అన్యాక్రాంతం చేయడానికి వీల్లేదని ప్రతివాదులను ఆదేశించారు. ఉన్నతాధికారులపై తీవ్రమైన ఆరోపణలున్న నేపథ్యంలో పిటిషన్ను ఉపసంహరించుకోవడానికి పిటీషనర్కు అనుమతించబోమని పేర్కొన్నారు. అనుమతిలేకుండా ఉపసంహరణకు అనుమతించరాదని రిజిస్త్రీనీ ఆదేశించారు.
ఇందులో ప్రతివాదులైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, భూదాన్ యజ్ఞ బోర్డు, సీసీఎల్ఎలతోపాటు సీబీఐ, ఈడీలకు నోటీసులు జారీ చేస్తూ కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించారు. వ్యక్తిగత హోదాలో ప్రతివాదులైన ఐఏఎస్, ఐపీఎస్ లు, వారి కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలనే ఆదేశిస్తూ తదుపరి విచారణను జూన్ 1వ తేదీకి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో పలువురు ఐపీఎస్లు హైకోర్టును ఆశ్రయించారు.
ఐఏఎస్పై ఈడీ ప్రశ్నల వర్షం - భూదాన్ భూముల స్కాంలో చిక్కుముడులు వీడినట్టేనా!