Two Friends Killed in ORR Car Accident : వేరే రాష్ట్రం నుంచి వచ్చి హైదరాబాద్లో ఇద్దరు చిరకాల స్నేహితులు ఐటీ ఉద్యోగం చేసుకుంటున్నారు. ఒకే అపార్ట్మెంట్లో నివాసం ఉంటూ ఆదివారం తెల్లవారుజామున ఇద్దరూ ఒకే కారులో ప్రయాణిస్తూ రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందారు. ఈ హృదయ విదారక ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని ఐఫోన్ కుటుంబ సభ్యులకు చేరవేసింది. వారు ఘటనా స్థలానికి చేరుకొని కన్నీటి పర్యంతమయ్యారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఒడిశాలోని జైపూర్కు చెందిన భాను ప్రకాశ్ (36), అదే రాష్ట్రం రావుర్కెలాకు చెందిన నళినికంఠ బిశ్వాల్(37)లు కాలేజ్లో చదువుకుంటున్నప్పటి నుంచి మంచి స్నేహితులు. వివాహితులైన ఇద్దరూ రాజేంద్రనగర్ మంచిరేవులలోని యునైటెడ్ అమిగో అవెన్యూ అపార్ట్మెంట్లో వేర్వేరుగా నివాసం ఉంటున్నారు. ఒకే అపార్టుమెంట్లో ఉన్న వేర్వేరు ఫ్లాట్లలో కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తున్నారు.
శనివారం రాత్రి 8 గంటలకు స్నేహితులిద్దరూ కారులో అపార్ట్మెంట్ నుంచి బయటకు వెళ్లారు. తిరిగి ఆదివారం తెల్లవారుజామున మేడ్చల్ నుంచి పటాన్చెరు మీదుగా ఓఆర్ఆర్పై ఇళ్లకు బయలుదేరారు. వేగంగా వెళుతున్న కారు మార్గంమధ్యలో మల్లంపేట 4ఏ ఎగ్జిట్ వద్ద అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. మొదట పల్టీలు కొట్టిన కారు విద్యుత్ స్తంభానికి తగిలి పక్కరోడ్డుపై పడింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరూ అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
గంటసేపు శ్రమిస్తే మృతదేహాలు బయటకు : అవుటర్ సిబ్బంది గుర్తించి సమాచారాన్ని పోలీసులకు చేరవేయగా ఘటనాస్థలికి చేరుకున్నారు. కారులో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీసేందుకు గంటసేపు శ్రమించాల్సి వచ్చింది. కారును భాను ప్రకాశ్ నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సమాచారం కుటుంబ సభ్యులకు చేరవేసిన ఐఫోన్ : కారు ప్రమాదం జరగ్గానే సమాచారం నళినికంఠ బిశ్వాల్ ఐఫోన్ ద్వారా అతని భార్య సునైనా మొబైల్కు వెళ్లింది. సమాచారం, లొకేషన్ వివరాలు వెళ్లాయి. ఆమె భయాందోళనలకు గురై అదే అపార్ట్మెంట్లో ఉంటున్న భానుప్రకాశ్ భార్య సాయిలక్ష్మికి విషయాన్ని చెప్పారు. వెంటనే వారు కారులో అక్కడికి సుమారు 1.30 గంటల పాటు ప్రయాణించి ఘటనా స్థలికి చేరుకున్నారు. ఘటనను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. కారు ప్రమాదానికి గురైనప్పుడు అందులో ఐఫోన్ వాడుతున్న వ్యక్తి ఉంటే అత్యవసర నంబర్లకు సమాచారాన్ని చేరవేస్తుంది. కాగా భానుప్రకాశ్, సాయిలక్ష్మి దంపతులకు మూడేళ్ల కుమార్తె ఉంది.
ఆరాంఘర్ ఫ్లై ఓవర్పై డివైడర్ను ఢీకొన్న బైక్ - ముగ్గురు మైనర్లు మృతి
లారీ బోల్తాపడి ఐదుగురు వలస కూలీల దుర్మరణం - దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం రేవంత్