Investment Fraud In Hyderabad : తమ సంస్థలో పెట్టుబడి పెడితే తక్కువ సమయంలో అధిక లాభాలు పొందవచ్చని మాయమాటలతో ప్రజలను మోసగిస్తూ రూ.14 కోట్లు వసూలు చేసిన వ్యక్తిని సైబరాబాద్ ఆర్థిక నేర విభాగం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. తొలుత 34 మందిని రూ.5.13 కోట్లు మోసగించినట్లు ఫిర్యాదు రాగా దర్యాప్తు చేసిన పోలీసులు రూ.14 కోట్లు వసూలు చేసినట్లు తేల్చారు.
ఈవోడబ్ల్యూ డీసీపీ కె. ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం : ఆంధ్రప్రదేశ్లోని ఏలూరుకు చెందిన కందుల శ్రీనివాసరావు(44) అనే వ్యక్తి మరికొందరితో కలిసి కేపీహెచ్బీలో వెల్విజన్ పేరుతో సంస్థను ఏర్పాటు చేశారు. తమ కంపెనీలో పెట్టుబడి పెడితే అధిక వడ్డీలు ఇస్తామని ఆశచూపించి డబ్బులు డిపాజిట్ చేయాలని విస్తృతంగా ప్రచారం చేశారు. నాలుగైదు పథకాల పేర్లతో ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేశారు. రూ. లక్ష డిపాజిట్ చేస్తే 100 రోజుల పాటు రోజూ రూ.2 వేల చొప్పున లేదా రూ.లక్ష డిపాజిట్ కు నెలకు రూ.20 వేల చొప్పున 10 నెలలు చెల్లిస్తామని చెప్పారు.
రూ.6.50 లక్షల డిపాజిట్ కు 121 చదరపు గజాల భూమి రిజిస్టర్ చేయడంతో పాటు నెలకు రూ.32,500 చొప్పున 20 వాయిదాల్లో తిరిగిస్తామని హామీలిచ్చారు. టీవీ, వాషింగ్ మెషిన్ తదితర గృహోపకరణాలు కొనుగోలు చేస్తే 20 వాయిదాల్లో తిరిగి డబ్బు మొత్తం చెల్లిస్తామని చెప్పారు. జనాన్ని నమ్మించేందుకు బాండు పేపరుతో ఒప్పందాలు కుదుర్చుకునేవారు.
నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు : ఇదంతా నిజమని నమ్మిన రాజేంద్రనగర్వాసి 2023 నుంచి దశలవారీగా రూ.33.50 లక్షలు డిపాజిట్ చేశాడు. కొన్ని నెలల లాభాలు ఇచ్చినట్లు చూపిన సంస్థ ప్రతినిధులు 2023 ఆగస్టు నుంచి చెల్లింపులు ఆపేశారు. బాధితుడు కార్యాలయానికి వెళ్లి చూడగా మరికొందరు డిపాజిటర్లు కనిపించారు. మోసపోయినట్లు గుర్తించి సైబరాబాద్ ఈవోడ బ్ల్యూలో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. దర్యాప్తు చేసిన పోలీసులు కందుల శ్రీనివాస్ మొత్తం 200 మంది నుంచి రూ.14 కోట్లు వసూలు చేసినట్లు గుర్తించి అరెస్టు చేశారు.
అధిక వడ్డీ ఆశ చూపి రూ. 20 కోట్ల మోసం - బాధితులంతా బంధువులే - 20 Crore Rupees Investment Fraud