Story On Sahyog Portal : ఓ ప్రముఖ వ్యక్తి పరువుకు భంగం కలిగించేలా యూట్యూబ్లో అసత్యప్రచారం చక్కర్లు కొడుతోంది. మరో యువతి పేరిట టెలిగ్రామ్లో నకిలీ అకౌంట్ సృష్టించి అప్లోడ్ చేసిన తప్పుడు సమాచారం వైరల్గా మారుతోంది. ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాల బారినపడేటువంటి బాధితుల వేదన వర్ణనాతీతం. ఆ సమాచారాన్ని తొలగించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఏళ్లుగా ఫలించకపోవడం బాధితులను మరింత కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలోనే ఆన్లైన్లో చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలు, అసత్య ప్రచారాలను నియంత్రణకు కేంద్ర హోంశాఖ సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేసింది.
చట్టవ్యతిరేకంగా ఉన్న కంటెంట్ నియంత్రణకు : సైబర్ క్రైంలను కట్టడి చేసేందుకు కేంద్ర హోంశాఖ తరఫున నోడల్ ఏజెన్సీగా ఉన్నటువంటి ఇండియన్ సైబర్ క్రైమ్ కో-ఆర్డినేషన్ సెంటర్(ఐ4సీ) నేతృత్వంలో '‘సహ్యోగ్' పోర్టల్ను సిద్ధం చేసింది. సైబర్ నేరాలపై కంప్లైంట్ చేసేందుకు ఉద్దేశించిన ‘నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్సీఆర్పీ) తరహాలోనే ఈ పోర్టల్ ఏకీకృతంగా ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన దర్యాప్తు ఏజెన్సీలు, సోషల్మీడియా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) వంటి మధ్యవర్తిత్వ సంస్థలు కూడా ఇందులో భాగస్వాములుగా ఉంటాయి. తొలిదశలో ఆన్లైన్లో చట్టవ్యతిరేకంగా ఉన్న సమాచారాన్ని(కంటెంట్) పోర్టల్ సాయంతో నియంత్రించాలని, రెండో దశలో వాటిపై దర్యాప్తు చేయాలని నిర్ణయించారు.
పోర్టల్ ఏ అంశాల నియంత్రణపై దృష్టి సారిస్తుందంటే
- ఛైల్డ్ పోర్నోగ్రఫీ
- నకిలీ యాప్లు
- ఫిషింగ్ వెబ్సైట్లు
- ఫేక్ సోషల్ మీడియా ప్రొఫైళ్లు
- ఇతర చట్టవ్యతిరేక అంశాలు
- కేసుల విచారణలో జాప్యంపై మొరపెట్టుకోవడంతో
చట్టవ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించి : చట్టవ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన లేదా తప్పుడు సమాచారం ఆన్లైన్లో ఉన్నప్పుడు వాటిపై విచారణ కోసం దర్యాప్తు సంస్థలు అడిగిన డేటాను ఇచ్చేందుకు సోషల్ మీడియా, ఐటీ మధ్యవర్తిత్వ సంస్థలు అంగీకరించడం లేదు. దీంతో సదరు సమాచారానికి ఎవరు బాధ్యులు అనే విషయాన్ని తేల్చడం పోలీస్, సీఐడీ సహా ఏ ఇతర దర్యాప్తు సంస్థకూ సాధ్యం కావడం లేదు.
సైబర్ కేటుగాళ్లు వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్(వీపీఎన్), ప్రాక్సీ సర్వర్ల ద్వారా కార్యకలాపాలు సాగిస్తుండటంతో వాటి మూలాలను కనిపెట్టేందుకూ వీలు కావడం లేదు. దీంతో నకిలీ బాంబు బెదిరింపుల్లాంటి అత్యవసర కేసుల దర్యాప్తు కూడా కొంత ఆలస్యమవుతోంది. ప్రధానంగా ఎన్నికల సమయంలో అసత్య ప్రచారాలకు సంబంధించిన సమాచారాన్ని మూడు గంటల్లోపే ఆన్లైన్ నుంచి తొలగించాలని ఎన్నికల కమిషన్ పలుమార్లు ఆదేశించినప్పటికీ మధ్యవర్తిత్వ సంస్థలనేవి సకాలంలో స్పందించకపోవడంతో తొలగింపు సాధ్యం కావడం లేదు.
పరిష్కార మార్గంగా సహయోగ్ పోర్టల్ : ఎఫ్ఐఆర్ నమోదైతే తప్ప సమాచారం ఇవ్వలేమంటూ ఆయా సంస్థలు స్పష్టం చేస్తున్నాయని, చాలా సందర్భాల్లో డేటాను సేకరించేందుకు 15-30 రోజులు పడుతుండటం వల్ల దర్యాప్తు పురోగతికి తీవ్ర ఆటంకంగా మారుతోందని’ ఇటీవలే హోంశాఖ సమీక్షలో వివిధ దర్యాప్తు సంస్థలు ఏకరువు పెట్టడంతో పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం ‘సహ్యోగ్’ పోర్టల్ను రూపొందించింది.
ఆన్లైన్లో చట్టవ్యతిరేక సమాచారాన్ని నియంత్రించేందుకు ఉద్దేశించినటువంటి ఐటీ చట్టం-2000లోని సెక్షన్ 79(3)(బి) ప్రకారం ఈ పోర్టల్కు రూపకల్పన జరిగింది. ఐ4సీ వర్గాలు పలు దఫాలుగా మధ్యవర్తిత్వ సంస్థలతో సమీక్షలు నిర్వహించిన అనంతరం పోర్టల్కు సంబంధించిన విధివిధానాలను సిద్ధం చేశారు. దర్యాప్తు సంస్థలతోపాటు మధ్యవర్తిత్వ సంస్థలు పోర్టల్లో భాగస్వాములుగా ఉండటంతోపాటు ఈ వేదికలో కలిసి పనిచేస్తాయి.
భాగస్వామ్యులైన మధ్య వర్తిత్వ సంస్థలు ఇవే : 15 మధ్యవర్తిత్వ సంస్థలను ‘సహ్యోగ్’ పోర్టల్లో చేర్చేందుకు ఐ4సీ సంప్రదింపులను చేపట్టింది. గతేడాది డిసెంబరు 10 నాటికి ‘ఎక్స్’, ‘లింక్డ్ఇన్’ లాంటి పది సంస్థలు ఈ పోర్టల్లో భాగస్వాములయ్యాయి.
- టెలిగ్రామ్
- యూట్యూబ్
- గూగుల్
- అమెజాన్
- కోరా
- జోష్
- పీఐ డేటాసెంటర్
- షేర్చాట్