IG RAVI KRISHNA ON DRUGS CONTROL: డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా, రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మార్గనిర్దేశకత్వంలో ఈగల్ పనిచేస్తుందని ఐజీ ఆకే రవికృష్ణ అన్నారు. ఈగల్ (Elite Anti-Narcotics Group for Law Enforcement), డ్రగ్స్ కంట్రోల్ అసోసియేషన్ ఆధర్యంలో రాష్ట్ర సీమాంధ్ర డ్రగ్స్ డీలర్స్ అసోసియేషన్ వారితో మంగళగిరి పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన డ్రగ్స్ నియంత్రణపై జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.
నిబంధనలు అతిక్రమించిన 58 మందుల షాపులు: ఈగల్, డ్రగ్స్ కంట్రోల్ శాఖ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, పోలీసు శాఖలు సంయుక్తంగా 'ఆపరేషన్ గరుడ'ను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ దాడుల్లో 158 మందుల షాపులు నిబంధనలు అతిక్రమించారని, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకొని, కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. ఎన్.ఆర్.ఎక్స్, ఎక్స్ఆర్.ఎక్స్ డ్రగ్స్ ఎటువంటి ప్రిస్కిస్సన్స్ లేకుండా మెడికల్ షాపుల్లో విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. మందుల అమ్మకం, కొనుగోలుకు సంబంధించిన బిల్ బుక్ను సరైన పద్ధతిలో నిర్వహించడం లేదన్నారు.
సంబంధిత వ్యక్తులపై కేసులను నమోదు చేస్తాం: కాలం చెల్లిన మందులను నిరక్షరాస్యులు, పిల్లలు, వృద్ధులకు డిస్కౌంట్స్ పేరుతో అమ్ముతున్నట్లు "ఈగల్" బృందం గుర్తించిందన్నారు. అటువంటి మందుల షాపులపై ఎన్జీపీఎస్ అండ్ డ్రగ్ కాస్మోటిక్ యాక్ట్ ప్రకారం సీజ్, వార్షింగ్ మెమో, లైసెన్సులను రద్దు చేయడంతో పాటు సంబంధిత వ్యక్తులపై కేసులను నమోదు చేస్తామని ఐజీ ఆకే రవికృష్ణ హెచ్చరించారు.
మీ దృష్టికి వస్తే 1972 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయండి: ఎవరైనా నిషేధిత మందులను విక్రయిస్తున్నట్లు దృష్టికి వస్తే 1972 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఈగల్ ఎస్పీ నగేష్ బాబు, డీజీ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ప్రసాద్, సీమాంధ్ర డ్రగ్ డీలర్స్ అసోసియేషన్ రాష్ట్ర, జిల్లా స్థాయి కార్యవర్గ సభ్యులు, ఈగల్కు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఏపీలో 'ఆపరేషన్ గరుడ' - మెడికల్ షాపులు, ఏజెన్సీల్లో ఆకస్మిక దాడులు
గంజాయి, మాదకద్రవ్యాల స్మగ్లర్లపై ఈగల్ ఉక్కుపాదం - ఆస్తులు జప్తు