Hyderabad Woman Wins 15 Lakhs in Rangoli Competition : పండగొచ్చినా పబ్బమోచ్చినా, వివాహమైనా వ్రతాలు చేసుకున్నా ఆరుబయట వాకిట్లో అతివలు చేసే హంగామా అంతా ఇంతా కాదు, చుక్కలు, గీతలు, పువ్వులు, మెలికల ముగ్గులు వేస్తూ మెలికలు తీరిగిపోతుంటారు/తెగ ఆనందపడిపోతారు. వారిలో దాగున్న చిత్రకారుల్ని తట్టిలేపుతూ ఆకర్షణీయమైన హంసలు, చిలుకలు, నెమళ్లు గీసి వాకిలిని రంగులతో నింపేస్తారు . ఆ యువతికీ ముగ్గులంటే మహా ఆసక్తి. అదే ఇష్టంలో ప్రపంచస్థాయి ముగ్గులో పోటీల్లో పాల్గొని 15 లక్షల ప్రైజ్మనీ గెలుచుకుంది.
బాల్యం నుంచే అలవాటు చేసుకుంటూ : సాధారణంగా ఆడవారి అభిరుచులు వేరువేరుగా ఉంటాయి. కానీ, అతివలందరికీ ఇష్టమైంది ఏదైనా ఉందంటే అది ముగ్గులు వేయడం అని కచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే, పండగ వచ్చిందంటే చాలు ఆరుగొట్టక ముందే వాకిట్లో వాలిపోతారు. ఈమె కూడా అదే కొవకు చెందుతుంది. బాల్యం నుంచి రకరకాల ముగ్గులు వేస్తూ మురిసిపోయేది. అదే ఆసక్తితో ప్రపంచస్థాయి ముగ్గుల పోటీల్లో పాల్గొని 15లక్షల ప్రైజ్మనీ గెలుచుకుంది.
"నాకు చిన్నప్పటి నుంచి బొమ్మలు గీయటం అలవాటు. కరోనాలో కొత్తగా ఏమైనా చేయాలి అనుకున్నాను. అప్పుడే యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాను. అందులో ముగ్గులు వేసిన వీడియోలు అప్లోడ్ చేస్తుంటాను. నాకు తెలిసిన వారి ద్వారా ఈ ముగ్గుల పోటీ గురించి తెలిసింది. పాల్గొన్నాను. సంక్రాంతి సమయంలో ఈ పోటీ జరగ్గా, నేను దేవుళ్లది వేయాలి అనుకున్నాను. అలా దేవుళ్ల పెళ్లి ముగ్గు వేశాను. రెండో బహుమతి వచ్చింది. నేటి తరం అమ్మాయిలకు ముగ్గు గురించి తెలియడానికి నా వంతు కృషి చేస్తున్నాను. " - హర్షిత
జగ్గయ్యపేటకు చెందిన ఈ యువతి పేరు హర్షిత. చిన్ననాటి నుంచి ముగ్గులు, డ్రాయింగ్ వేయడమంటే మహాఇష్టం. న్యూ ఇయర్, సంక్రాంతి వంటి పండగలొస్తే ముగ్గులతో వాకిలికి రంగులద్దేది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచస్థాయి ముగ్గుల పోటీల్లో పాల్గొంది. సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన ఈ పోటీల్లో అత్యాద్భుతంగా ముగ్గువేసి రెండో బహుమతిగా రూ.15 లక్షల బహుమానం అందుకుంది.
శ్రీనివాస కల్యాణం ముగ్గు వేసి : ఎక్కువగా డ్రాయింగ్ వేసే హర్షిత కరోనా సమయంలో తన దృష్టిని రంగవల్లి వైపు మళ్లించింది. యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి రకరకాల ముగ్గులు వేసి ఛానల్లో పోస్ట్ చేయడం మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే బంధువుల ద్వారా ప్రపంచస్థాయి ముగ్గుల పోటీల గురించి తెలుసుకుని దరఖాస్తు చేసుకుంది. సంక్రాంతి సందర్భంగా జరిగిన పోటీల్లో శ్రీనివాస కల్యాణం ముగ్గును కళ్లకు కట్టినట్లు వేసి అందరి దృష్టిని ఆకర్షించింది.
తానే మిక్సింగ్ చేసుకుని : 10 రోజులు శ్రమించి శ్రీనివాస కల్యాణం ముగ్గు వేసింది హర్షిత. ప్రతి రోజు 10 గంటలకు పైగా కష్టపడి 38దేవతా మూర్తుల రూపాలను ముగ్గులో వేసింది. దేవుళ్ల ముఖాలు క్లియర్గా కనిపించేందుకు స్వతాహాగా తనే రంగులు మిక్సింగ్ చేసుకుని ముఖాలకు సహజ రూపన్నిచ్చింది. పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా 30 వేల మంది పాల్గొన్నారు. విజేతలను ఉగాది రోజు ప్రకటించగా హర్షిత రెండోస్థానంలో నిలిచి ప్రముఖులు, స్థానికుల ప్రశంసలు అందుకుటోంది.
రంగవల్లి చెప్పుకోవటానికి చిన్నదే అయినా రంగులు, ముగ్గుల పట్ల తనకున్న ఆసక్తి నేడు ప్రపంచ స్థాయిలో పోటీల్లో విజేతగా నిలబెట్టిందంటోంది హర్షిత. ప్రాక్టీస్ చేయకుండానే ఒకే ప్రయత్నంలో శ్రీనివాస కల్యాణం చిత్రాన్ని వేసినట్లు వివరిస్తోంది. ఎప్పుడు, ఎక్కడ ముగ్గుల పోటీల్లో పాల్గొనలేదని మొదటి సారి పోటీల్లోనే రూ.15 లక్షల బహుమానం అందుకోవడం సంతోషంగా ఉందని చెబుతోంది.
అమ్మాయిలకు అవగాహన కల్పిస్తూ : నేటితరం అమ్మాయిలు మగ్గులు వేసేందుకు ఆసక్తి చూపించడం లేదంటోంది హర్షిత. ఒక వేళ వేద్దమనుకున్నా నేర్పించేవాళ్లు లేరని అంటోంది. సామాజిక మాధ్యమాల ద్వారా కనుమరుగవుతున్న ముగ్గుల పట్ల అమ్మాయిలకు అవగాహన కల్పిస్తూ మెళకువలు నేర్పిస్తానని వివరిస్తోంది. ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచస్థాయి ముగ్గుల పోటీల్లో 15లక్షలు గెలుచుకున్న హర్షిత పట్ల కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
భిన్నత్వాన్ని జోడించి : వాకిట్లో వేసే ముగ్గుకి కాస్త భిన్నత్వాన్ని జోడించి ప్రపంచస్థాయి విజేతగా నిలిచింది హర్షిత. అలవాటుని అభిరుచిగా మలచుకుని ముగ్గులు వేయడానికి దూరంగా ఉంటున్న అమ్మాయిలకు ఆదర్శంగా నిలిచేలా శ్రీనివాస కల్యాణాన్ని చిత్రీకరించింది.
YUVA : మూడేళ్ల ప్లానింగ్, రోజుకు 10 గంటల ప్రిపరేషన్ - చివరకు నెరవేరిన లక్ష్యం
YUVA : పేదలకు సేవ చేయడమే లక్ష్యం - సాఫ్ట్వేర్ ఉద్యోగం మానేసి గ్రూప్-1 సాధించిన యువకుడు
YUVA : అమ్మనాన్నల కష్టానికి ప్రభుత్వ ఉద్యోగమే పరిష్కారం అనుకున్నాడు - గ్రూప్-2 ఆఫీసర్ అయ్యాడు