How to Identify Fake Seeds : రైతులకు వానాకాలం ముందుగానే వస్తుండటంతో సీజన్కు ముందుగానే పంట పొలాలను దుక్కిదున్ని సిద్ధం చేసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆకాల వర్షాలు కురవడంతో మంచి పదును అవుతుండటంతో దుక్కులు దున్నేస్తున్నారు. అయితే మే 27 నుంచి నైరుతి రుతుపవనాలు కేరళను తాకతాయని వాతావరణ శాఖ మంచి శుభవార్త చెప్పింది. ఈ క్రమంలో అవి రాష్ట్రానికి చేరుకోవడానికి జూన్ మొదటి వారం కావచ్చు.
జూన్ మొదటి వారంలో వానాకాల సీజన్ ప్రారంభం అవుతుంది. ఈ నేపథ్యంలో రైతులు విత్తనాలు కొనడానికి మార్కెట్లకు వెళుతూ ఉంటారు. అయితే కొనేముందు వారు తగిన జాగ్రత్తలు తీసుకుంటే నకిలీ విత్తనాలకు కళ్లెం వేయొచ్చు. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా పంట దిగుబడి, పంట కాలం వృథా అయ్యే ప్రమాదంతో పాటు రైతు అప్పులపాలు అవ్వడం ఖాయం.

కమీషన్ల కక్కుర్తిలో : పల్లెల్లో అనధికారికంగా విత్తనాలు అమ్మే వారు కమీషన్ల కక్కుర్తిలో రైతులకు నకిలీ విత్తనాలను అంటగడతారు. గత మూడేళ్లుగా ఇదే పరిస్థితి ఉంది. కొందరు రైతులు ఓ పత్తి విత్తన కంపెనీ నుంచి ఫౌండేషన్ తీసుకుని సాగు చేసిన వారికి చేదు అనుభవం ఎదురైంది. వరి విత్తనాల్లో కంకి బయటకు వచ్చే దశలో కానీ దాని స్వరూపం బయటపడదు. మొక్కజొన్న, వేరుశెనగ పంట పూర్తయితే కానీ నకిలీ వల్ల జరిగిన నష్టం రైతుకు అర్థం కాదు. ముఖ్యంగా పత్తి, వరి, మిరప, మొక్కజొన్న వంటి విత్తనాల్లో నాసిరకం హవా ఎక్కువగా సాగుతోంది. అందుకే విత్తనాలు కొన్న రైతులు కచ్చితంగా రసీదు, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం అలవాటు చేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు హెచ్చరిస్తుంటారు.
ఇవి తప్పనిసరి తెలుసుకోవాలి :
- లైసెన్స్ ఉన్న అధీకృత దుకాణాల్లోనే విత్తనాలను కొనుగోలు చేయాలి.
- విత్తన మొలక శాతం సరిగా ఉందో లేదో చూసుకోవాలి.
- విత్తన ప్యాకెట్లపై లాట్నంబర్, ప్యాకింగ్ తేదీ, లేబుల్ తదితరాలను పరిశీలిస్తూ ఉండాలి.
- కొనుగోలు చేసిన విత్తనాలకు రసీదు తప్పనిసరిగా తీసుకోవాలి.
- విత్తన ప్యాకెట్లపై క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని మొబైల్తో స్కాన్ చేస్తే విత్తనాలకు సంబంధించిన పూర్తి వివరాలు అనేవి ఆన్లైన్లో ప్రత్యక్షం అవుతాయి.
- నాటే కంటే ముందే కొన్ని విత్తనాలు తీసుకొని మొలక శాతం పరీక్షించుకోవాలి.
- ముఖ్యంగా విత్తన సంచులు, రసీదులను భద్రపరుచుకోవడం మంచిది.
- తెలిసిన షాపులో విత్తనాలు కొంటే ఇంకా మంచిది.
ఉదాహరణలు :
- గతేడాది గద్వాల మండలానికి చెందిన రైతు పత్తి సాగు చేయగా విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో పత్తి ఏపుగా పెరిగినా కాయ కాయలేదు. దీంతో రెండెకరాల్లో రూ.3 లక్షల వరకు నష్టాన్ని చవిచూశాడు.
- అలాగే వనపర్తి జిల్లాకు చెందిన ఓ రైతు నాలుగు ఎకరాల్లో వరి సాగు చేశారు. కంపెనీ విత్తనమేనంటూ కొనుగోలు చేసి నాటారు. తీరా చూస్తే ఏముంది దిగుబడి రాలేదు. కొనుగోలు సమయంలో రసీదు తీసుకోకపోవడంతో ఆయన నష్టపోయారు.
మార్కెట్ నిండా నకిలీ విత్తనాలు - రైతన్నా!! జర జాగ్రత్త - FAKE SEEDS SALES IN TELANGANA