ETV Bharat / state

పవన్ కల్యాణ్​పై ఫొటోలపై పిల్‌ - కొట్టేసిన ధర్మాసనం

ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం ఫొటో అంశంపై ఏపీ హైకోర్టులో విచారణ - పవన్‌ కల్యాణ్‌ ఫొటో ఉంచడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిల్‌

Pawan Kalyan
Pawan Kalyan (Source: X Account @APDeputyCMO)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : September 10, 2025 at 11:30 PM IST

2 Min Read
Choose ETV Bharat

Pawan Kalyan Photos in Government Offices: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్​ చిత్రపటాలను ప్రభుత్వ కార్యాలయాల్లో తొలగించేలా ఆదేశించాలని కోరుతూ దాఖలైన పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్‌ (పిల్‌)ను హైకోర్టు కొట్టేసింది. ఇలాంటి చిత్రపటాలను ఏర్పాటు చేయకూడదని ఎక్కడా నిషేధం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ పిల్‌ను రాజకీయ ఉద్దేశాలతో దాఖలు చేశారని వ్యాఖ్యానించింది. సమాజానికి ఉపయోగపడే అంశాలపై దృష్టి పెట్టి పిల్‌లు వేయాలని పిటిషనర్‌ను హైకోర్టు హితవు పలికింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్, జస్టిస్ చీమలపాటి రవి ఆధ్వర్యంలోని ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

పిటిషనర్ ఆరోపణలు: ఈ పిల్‌ను రైల్వే విశ్రాంత ఉద్యోగి, విజయవాడకు చెందిన వై. కొండలరావు దాఖలు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో చట్టబద్ధమైన అనుమతి లేకుండా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్​ చిత్రపటాలను ప్రదర్శిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వానికి ఈ విషయంలో ఎటువంటి నిర్దిష్ట విధానం (పాలసీ) లేనందున, ఆ విధానం రూపొందించేంత వరకు చిత్రపటాలను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

ప్రతివాదులు: ఈ కేసులో సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి, సహాయ కార్యదర్శి, సమాచార-పౌరసంబంధాలశాఖ డైరెక్టర్‌తో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్​ను కూడా వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.

ఆర్‌టీఐ సమాధానాలు: కొండలరావు తన వాదనలో భాగంగా సమాచార హక్కు చట్టం (RTI) కింద దరఖాస్తులు దాఖలు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో చిత్రపటాల ప్రదర్శనకు సంబంధించిన జీఓలు, సర్క్యులర్లు, నిబంధనలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా సమాచార, పౌరసంబంధాలశాఖ “ప్రస్తుతం ఎలాంటి జీఓలు, మార్గదర్శకాలు లేదా ఆదేశాలు లేవు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చిత్రపటాలను ప్రదర్శించమని ఎప్పుడూ ఆదేశాలు ఇవ్వలేదు. 2024 నుంచి ఇప్పటివరకు ఈ అంశంపై ఎలాంటి రికార్డు లేదు” అని స్పష్టం చేసింది.

రాజ్యాంగపరమైన ప్రశ్నలు: తన పిటిషన్‌లో పిటిషనర్ రాజ్యాంగంలోని అధికరణ 164ను ప్రస్తావించారు. అందులో ముఖ్యమంత్రి, మంత్రులను గవర్నర్ నియమించే విషయమే ఉన్నదని, కానీ ఉప ముఖ్యమంత్రి అనే హోదా రాజ్యాంగపరంగా గుర్తించలేదని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో, ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి చిత్రపటం పక్కన ఉప ముఖ్యమంత్రి ఫొటో ఉంచడం వల్ల ప్రజల్లో రాజ్యాంగపరంగా రెండు పదవులు సమానమన్న అపోహ కలుగుతుందని పిటిషన్​లో పేర్కొన్నారు.

సుప్రీంకోర్టు మార్గదర్శకాలు: సుప్రీంకోర్టు గత తీర్పులను కూడా పిటిషనర్​ ప్రస్తావించారు. రాజకీయ నేతల వ్యక్తిగత ప్రతిష్ట పెంపొందించేందుకు ప్రజాధనాన్ని వినియోగించరాదని సుప్రీంకోర్టు స్పష్టంచేసిందని గుర్తు చేశారు. రాజ్యాంగబద్ధం కాని ఉప ముఖ్యమంత్రి పదవిని సీఎం స్థాయిలో చూపించడానికి ప్రభుత్వ కార్యాలయాల్లో చిత్రపటాలను ఉంచడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

హైకోర్టు వ్యాఖ్యలు: అయితే, ధర్మాసనం ఈ వాదనలను తోసిపుచ్చింది. ఉప ముఖ్యమంత్రి చిత్రపటాలను ఏర్పాటు చేయకూడదని ఎక్కడా నిబంధనలు లేవని గుర్తు చేసింది. ఇది రాజకీయ ఉద్దేశాలతో దాఖలు చేసిన పిల్ అని పేర్కొంది. పిటిషనర్ సమాజ ప్రయోజనానికి ఉపయోగపడే అంశాలపై దృష్టి పెట్టాలని సూచించింది.

ఈ కారణాలతో, ధర్మాసనం పిల్‌ను కొట్టేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో చిత్రపటాల ప్రదర్శనపై ప్రస్తుతం ఎటువంటి విధానం లేనందున, ఆ అంశంలో తగిన పాలసీని రూపొందించడం ప్రభుత్వ నిర్ణయాధికారంలో ఉందని స్పష్టం చేసింది. దీంతో పవన్ కల్యాణ్​ చిత్రపటాలపై దాఖలైన ఈ పిల్‌ను హైకోర్టు తిరస్కరించడం ద్వారా రాజకీయ పిల్‌లకు ప్రాధాన్యం ఇవ్వమని, ప్రజాస్వామ్యంలో సమాజానికి ఉపయోగపడే అంశాలపై దృష్టి పెట్టాలని మరోసారి స్పష్టం చేసింది.

పవన్‌ కల్యాణ్‌ ఫొటోల వివాదం - తొలగించాలంటూ హైకోర్టులో పిల్‌