High Court Concludes Hearing on IPS Petitions : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని 181, 182, 194, 195 సర్వే నెంబర్లలో ఉన్న భూములను నిషేధిత జాబితాలో ఉంచుతూ ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోలేమని, అదే బెంచ్లో వెకెట్ పిటిషన్ వేసుకోవాలని సీనియర్ ఐపీఎస్లను సీజే ధర్మాసనం ఆదేశించింది. వాదనలను అదే బెంచ్లో వినిపించాలని హైకోర్టు తెలిపింది.
సీనియర్ ఐఏఎస్లు, ఐపీఎస్లు కొనుగోలు చేసిన భూమి భూదాన్ బోర్డుకు సంబందించిందని బీర్ల మహేష్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ సీవీ భాస్కర్ రెడ్డి సంబంధిత భూములను నిషేధిత జాబితాలో ఉంచుతూ ఈ నెల 24న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. మధ్యంతర ఉత్తర్వుల అమలును నిలిపివేయాలని కోరుతూ సీనియర్ ఐపీఎస్లు రవిగుప్తా, మహేష్ భగవత్, శికా గోయల్, సౌమ్య మిశ్రా, తరుణ్ జోషి, రాహుల్ హెగ్డెలతో పాటు మరికొంత మంది వేర్వేరుగా అప్పీలు పిటిషన్లు దాఖలు చేశారు. సీనియర్ న్యాయవాదులు దేశాయ్ ప్రకాష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి ఈ పిటిషన్లపై వాదనలు వినిపించారు.
ప్రతివాదుల వాదనలను పరిగణలోకి తీసుకోకుండా సింగిల్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని కోర్టుకు తెలిపారు. సర్వే నెంబర్ 181, 182లలో మాత్రమే భూధాన్ భూములున్నాయని, సర్వే నెంబర్ 194లో పట్టా భూమి ఉందని ఆ భూములనే కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్లు కొనుగోలు చేశారని వాదించారు. పిటీషనర్ అభ్యర్థనకు మించి ఉపశమనం కల్పిస్తూ సింగిల్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని అన్నారు. పిటీషనర్, తన పిటిషన్ను ఉపసంహరించుకోవడానికి అనుమతి ఇవ్వొద్దని సింగిల్ బెంచ్ పరిధికి మించి ఆదేశాలు జారీ చేసిందని సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదించారు. సింగిల్ బెంచ్ కేవలం మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే జారీ చేశారు కదా అని ఐపీఎస్ల తరఫు న్యాయవాదులను సీజే ధర్మాసనం ప్రశ్నించింది. సింగిల్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని, ఆ ఉత్తర్వులపై వెకెట్ పిటిషన్ వేసుకోవాలని ఐపీఎస్లను ఆదేశిస్తూ సీజే ధర్మాసనం అప్పీలు పిటిషన్పై విచారణ ముగించింది.
భూదాన్ భూముల వ్యవహారం - హైకోర్టును ఆశ్రయించిన ఐపీఎస్ అధికారులు