Rains in Andhra Pradesh : వాతావరణ అనిశ్చితి ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ విభాగం తెలిపింది. ఉత్తర మధ్య మహారాష్ట్ర నుంచి గల్ఫ్ అఫ్ మన్నార్ వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. ప్రస్తుతం ఈశాన్య విదర్భ నుంచి గల్ఫ్ అఫ్ మన్నార్ వరకు తెలంగాణ, అంతర్గత కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతుంది. సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో విస్తరించి ఉన్న ఉపరితల ద్రోణి కేంద్రికృతమైంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో ఉత్తర కోస్తాంధ్ర, యానాం, దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి.
అక్కడ ఉరుములు, పిడుగులతో : కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులుతో కూడిన జల్లులు పడే సూచనలు ఉన్నట్లు వాతావరణశాఖ స్పష్టంచేసింది. గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. అటు రాయల సీమలోనూ చాలా చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షం నమోదు అయ్యే సూచనలు చేసింది. ఉరుములు, పిడుగులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని స్పష్టంచేసింది.
భిన్న వాతావరణం : వాతావరణ అనిశ్చితి ప్రభావంతో ఓ వైపు ఎండలు, మరోవైపు వర్షాలతో రాష్ట్రంలో భిన్న వాతావరణం నెలకొంది. పగటి పూట భానుడు నెత్తిన నిప్పుల కుంపటిని తలపిస్తున్నాడు. ఈ వేసవి చాలా హాట్ అన్న అంచనాలు నిజం చేస్తూ ఎండలు ఠారెత్తిస్తున్నాయి. మరోవైపు సాయంత్రం కాగానే వాతావరణం చల్లబడిపోతోంది. హోరు గాలితో మొదలై చిటపట చినుకులు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, పిడుగులతో వర్షాలు పడుతున్నాయి. వాతావరణ అనిశ్చితి నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
ఏపీలో భిన్న వాతావరణం - ఓ వైపు ఎండలు - మరోవైపు వర్షాలు
పంటలు చేతికి అందివచ్చే సమయం - ఈ లోపు అన్నదాతపై ప్రకృతి కన్నెర్ర