Heatwaves Will Increase In Telangana : తెలంగాణలో భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. మొన్నటి వరకు వర్షాలతో కాస్త తెరిపినిచ్చినా, ఉదయం నుంచి సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. గరిష్ఠ ఉష్టోగ్రతలు పెరిగిపోతున్నాయి.
రాత్రి పూట వేడి వాతావరణం : తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఎండల తీవ్రత మరింత అధికంగా ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా ఉండే వీలుందని వెల్లడించింది. ఇవాళ, రేపు ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. చాలా జిల్లాల్లో రాత్రి పూట వేడి వాతావరణం మరింత అధికంగా ఉండనుందని తెలిపింది.
గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో గాలులు : ఉత్తర, దక్షిణ ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు, ఎల్లుండి కొన్ని జిల్లాల్లో మెరుపులు, ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే వీలుందని పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
వడదెబ్బతో యువకుడు మృతి : నిర్మల్ జిల్లాలో వడదెబ్బతో యువకుడు మృతి చెందారు. ఎండ వేడికి అస్వస్థతకు గురైన బ్రహ్మపురికి చెందిన సోఫి బేగ్ (25) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.