Guidelines For Rajiv Yuva Vikasam scheme 2025 : రాజీవ్ యువ వికాసం పథకం కింద మంజూరు చేసే యూనిట్లకు బ్యాంకు లింకేజీని రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. రాయితీ పోను మిగతా వాటా భరించేందుకు లబ్ధిదారు సిద్ధంగా ఉన్నా, యూనిట్లు మంజూరు చేయకూడదని నిర్ణయం తీసుకుంది. రాజీవ్ యువ వికాసం పథకం అమల్లో పారదర్శకత పెంచేందుకు, నిధులు పక్కదారి పట్టకుండా ఉండేందుకు ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. ఇటీవల ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ జిల్లా సంక్షేమ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు స్పష్టత ఇచ్చింది. క్షేత్ర స్థాయిలో పరిశీలన తరువాత అర్హుల జాబితాను బ్యాంకర్లకు పంపించి, ఆ యూనిట్లకు బ్యాంకు లింకేజీ తప్పనిసరి చేయాలని సూచనలు చేసింది.
బ్యాంకు లింకేజీ తప్పనిసరి : రాజీవ్ యువ వికాసం పథకం కింద తెలంగాణ వ్యాప్తంగా 16.23 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో కేటగిరీ-1 కింద రూ.50,000 విలువైన యూనిట్కు నూరు శాతం రాయితీ ఉంది. బ్యాంకు లింకేజీ లేకుండా ఈ రుణాన్ని అమలు చేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేటగిరీ-2, 3, 4లలో యూనిట్ వ్యయంలో రాయితీ తీసివేయగా, లబ్ధిదారు వాటా కింద బ్యాంకు రుణం తీసుకోవాలి. కేటగిరీ-2 కింద యూనిట్ వ్యయం రూ.లక్షలో 10 శాతం, కేటగిరీ-3 కింద రూ.లక్ష - రూ.2 లక్షల వరకు 20 శాతం, కేటగిరీ-4 కింద రూ.2 లక్షలు-రూ.4 లక్షల వరకు 30 శాతం చొప్పున బ్యాంకు లింకేజీ తప్పనిసరి.
బ్యాంకు రుణం ఇవ్వాలని భట్టి విక్రమార్క ఆదేశాలు : గతంలో బ్యాంకు రుణాలు సకాలంలో మంజూరు కాకపోవడం, తప్పనిసరిగా లబ్ధిదారు ఇచ్చే రుణానికి పూచీకత్తు పెట్టాలని చెప్పడంతో కొందరికి యూనిట్లు మంజూరు అయినా, రాయితీ విడుదల అయినా పథకం అమలు కాలేదు. ఈ తరహా పరిస్థితులను అధిగమించేందుకు యూనిట్ వ్యయంలో రాయితీ తీసివేయగా, మిగతా మొత్తాన్ని సొంతంగా భరిస్తే యూనిట్ మంజూరు చేయాలన్న చర్చ జరిగింది. ఈ తరహా విధానంతో పథకం లక్ష్యం నెరవేరదని, స్వయం ఉపాధి పథకాలు పక్కదారి పట్టే అవకాశాలు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం భావించింది. పథకం కింద ఎంపిక అయిన వారికి తప్పనిసరిగా బ్యాంకు రుణం ఇవ్వాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇటీవల బ్యాంకర్లను ఆదేశించారు. రుణం కింద బ్యాంకులు రూ.1,600 కోట్లు భరిస్తే దాదాపు ఐదు లక్షల మందికి స్వయం ఉపాధి యూనిట్లు మంజూరు అవుతాయని భట్టి విక్రమార్క అన్నారు.
బీసీ సంక్షేమ శాఖకు నిదులు విడుదల : బీసీ సంక్షేమ శాఖ పరిధిలో కల్యాణ లక్ష్మి, ఉపకారవేతనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.4,639.81 కోట్లు విడుదల చేసింది. కల్యాణ లక్ష్మికి రూ.2,173 కోట్లు, బీసీ, ఈబీసీ విద్యార్థుల పోస్టుమెట్రిక్ ఉపకారవేతనాలు, బోధన ఫీజుల కోసం రూ.2,386 కోట్లు, బీసీ విదేశీ విద్యా నిధి పథకానికి రూ.80 కోట్లు ఇచ్చింది.
''రాజీవ్ యువ వికాసం' గేమ్ ఛేంజర్ - దీనిని సాధారణ సంక్షేమ పథకంగా చూడొద్దు'
రాజీవ్ యువ వికాసం పథకం - మీకు ఆ కార్డు ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం లేదు!