Govt Employees Tribal Village : విద్య లేనివాడు వింత పశువు అని అన్నారు ఓ కవి. ఈ మాటలను నిజంగా నమ్మిన ఈ మారుమూల అటవీ ప్రాంతంలోని గిరిజన ప్రజలు విద్యతోనే వెలుగు వస్తుందని నమ్మి బాగా చదువుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగస్థులతో ఆ ఊరు విరాజిల్లుతోంది. ఆ గ్రామమే కరీంనగర్ జిల్లాలోని కోనరావుపేట మండలం జైసేవాలాల్ గిరిజన తండా.
ఈ తండా ప్రజలు మూడు దశాబ్దాల క్రితం అటవీ ప్రాంతంపై ఆధారపడి జీవించేవారు. మొర్రి, తునికి పండ్లు, ఇప్ప పువ్వు సేకరణ, వంట చెరకు విక్రయించి జీవనం సాగించేవారు. కనీసం తండాలో సౌకర్యాలు కూడా ఉండేవి కావు. అప్పుడు ఆ తండాలోని యువకులు విద్యతోనే అభివృద్ధి, గుర్తింపు, విలువ లభిస్తుందని తెలుసుకొని, తల్లిదండ్రుల కష్టాలకు చదువుతోనే పరిష్కారం లభిస్తుందని భావించారు. ఆ విధంగా కాలినడకన కిలో మీటర్ల దూరం వెళ్లి చదువుకునే వారు. అలా అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత విద్య అభ్యసిస్తూ పోటీ పరీక్షలు రాసి ప్రతిభ చాటి, ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికై ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఒకప్పుడు ఈ జైసేవాలాల్ గిరిజన తండా వట్టిమల్ల గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామంగా కొనసాగింది. గత ప్రభుత్వం నూతన గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయగా, జైసేవాలాల్ గిరిజన తండా గ్రామ పంచాయతీగా ఏర్పడింది. ఇప్పుడు ఈ గ్రామంలో 612 మంది జనాభా ఉండగా, వీరిలో 317 పురుషులు, 304 మంది స్త్రీలు ఉన్నారు. ఇక్కడ 140 జనావాసాలు ఉండగా, 80 మందికి పైగా వివిధ విభాగాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. వీరిలో ప్రభుత్వ ఉపాధ్యాయులు -12, వివిధ ప్రభుత్వ శాఖలు-12, బ్యాంకు ఉద్యోగులు-5, వైద్య వృత్తి-1, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ -52 మంది ఉన్నారు.
వరి సాగు చేస్తూ మెరుగైన దిగుబడి : ఇక్కడి తండా ప్రజలు స్థానికంగా వరి సాగు చేస్తూ మెరుగైన దిగుబడి సాధించడమే కాకుండా ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు, రిజర్వేషన్లను చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఉద్యోగులందరూ సంఘంగా ఏర్పడి గ్రామంలోని యువతకు తోడ్పాటు అందిస్తున్నారు. ఉన్నత చదువులు అభ్యసించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న వారికి సూచనలు, సలహాలు ఇస్తూ వారిని ప్రోత్సహించడమే కాకుండా గ్రామాభివృద్ధికి సైతం సహకరిస్తున్నారు.
1989లో ఉద్యోగం సాధించి, ఇప్పుడు బ్రాంచి మేనేజర్గా : భూక్యా భీమ్లా నాయక్ 7వ తరగతి చదువుతుండగానే 1989లో యూనియన్ బ్యాంకు మెట్పల్లి శాఖలో అటెండర్గా ఉద్యోగం వచ్చింది. నిమ్మపల్లిలో ప్రాథమిక విద్య అభ్యసించడానికి సుమారు 5 కిలోమీటర్లు కాలినడకన వెళ్లారు. తల్లిదండ్రులు పడుతున్న కష్టం, ఉద్యోగంతోనే కుటుంబ భద్రత, గుర్తింపు లభిస్తుందని భావించాడు. సర్కారు కొలువు సాధించడమే లక్ష్యంగా చదివి, ప్రస్తుతం కరీంనగర్ యూనియన్ బ్యాంకులో బ్రాంచి మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.
మలావత్ పూర్ణ స్ఫూర్తితో కిలిమంజారోను అధిరోహించిన గిరిజన యువతి