Summer Camps in Government Schools : విద్యాశాఖ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా సమ్మర్ క్యాంపులను ప్రారంభించనున్నారు. ఇంతవరకు హైదరాబాద్, మరికొన్ని పాత జిల్లా కేంద్రాల్లోని బాల భవన్లలో మాత్రమే సమ్మర్ క్యాంపులు నిర్వహించేవారు. ఈసారి తెలంగాణలోని పలు ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 9 తరగతుల విద్యార్థులకు 15 నుంచి 20 రోజుల పాటు సమ్మర్ క్యాంపులు నిర్వహించనున్నారు. ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనే విషయమై ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్కు ప్రతిపాదనలు పంపించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో కొద్ది రోజుల్లో వాటిని ప్రారంభించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం సైతం పిల్లల భద్రత, ఇతర అంశాలపై ఉమ్మడి మార్గదర్శకాలను జారీ చేయనుంది. పలువురు కలెక్టర్లు 'యంగ్ ఇండియా సమ్మర్ క్యాంప్' అని పేరు పెట్టగా మరికొందరు 'తెలంగాణ రైజింగ్' అని ప్రతిపాదించారు.
12 రోజుల పాటు వేసవి శిక్షణ తరగతులు : వచ్చే నెల మొదటి వారం నుంచి సమ్మర్ క్యాంపులు ప్రారంభిస్తారు. ఎన్ని శిబిరాలు నిర్వహిస్తాం, ఎలాంటి అంశాలను నేర్పుతాం, ఎంతమేర నిధులు అవసరం, తదితర వివరాలతో ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రతిపాదనలు అందజేశారు. ఉదాహరణకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ వచ్చే నెల 1 నుంచి 15వ తేదీ మధ్యలో 12 రోజుల పాటు వేసవి శిక్షణ తరగతులు నిర్వహిస్తామని, 15,000 మంది ప్రయోజనం పొందుతారని, అందుకు సుమారు రూ.50 లక్షలు ఖర్చు అవుతాయని ప్రతిపాదించారు. కొందరు కలెక్టర్లు చొరవ తీసుకొని ఇప్పటికే కార్యక్రమాలు స్టార్ట్ చేశారు. కలెక్టర్ జితేష్ వి.పాటిల్ స్టూడెంట్స్ చేతిరాత మెరుగుపడటంతో పాటు డ్రాయింగ్ కోసం సీఎస్ఆర్ నిధులతో 3, 4, 5 తరగతుల విద్యార్థులు 17,000 మందికి రెండేసి నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు.
జిల్లాల్లో ఉన్న కోచ్లు, వనరులు ఇతర అంశాలను దృష్టిలో ఉంచుకొని ఏమేం నేర్పవచ్చో కలెక్టర్లు ప్రతిపాదించారు. క్యారమ్స్, చదరంగం, లూడో, స్కిప్పింగ్, వైకుంఠపాళి తదితర ఆటలు, పెయింటింగ్ సాధన, డ్రాయింగ్, కాగితాలతో బొమ్మలు తయారు చేయడం, చిన్న చిన్న సైన్స్ ప్రయోగాలు, యోగా, కర్రసాము, డ్రాయింగ్, చదరంగం, నృత్యం, సంగీతం, కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లీష్ తదితర అంశాలను నేర్పుతామని ప్రతిపాదించారు.
సమ్మర్ క్యాంప్ల ద్వారా ప్రతిభకు పదును పెట్టుకున్న విద్యార్థులు
ప్రభుత్వ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంప్స్ - పిల్లలు ఎంత చక్కగా నేర్చుకుంటున్నారో