Gollapeta Woman Ends Life : ఆ దంపతులకు వివాహమై 22 సంవత్సరాలైంది. వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. సజావుగా సాగుతున్న వారి కాపురంలో కొంత కాలంగా కలతలు చోటు చేసుకున్నాయి. అతను ఆస్తి కోసం భార్యను వేధించసాగాడు. ఈ విషయమై ఇరువురి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయమై వారికి పెద్దమనుషులు సర్దిచెప్పారు. అయినా అతడిలో మార్పు రాలేదు. మరోసారి ఆస్తి పత్రాలు ఇవ్వాలని వేధింపులకు గురిచేశాడు. ఇక ఆ బాధలు తట్టుకోలేక ఆమె ఇవాళ ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని గొల్లపేటలో చోటుచేసుకుంది.
దీనికి సంబంధించి పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం రాజాపులోవలకు చెందిన ఇప్పిలి రమణ అదే గ్రామానికి చెందిన మేనత్త కూతురు అంకయ్యమ్మతో 22 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఎనిమిది సంవత్సరాల క్రితం దంపతులు ఉపాధి కోసం రావాడ పంచాయతీలోని గొల్లపేటకు వలస వచ్చారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు మాధవ్ ప్లంబింగ్ పనులు చేస్తున్నాడు.
Gollapeta Woman Kills Self : కుమార్తె భాగ్యలక్ష్మి ఇటీవలే పదో తరగతి పరీక్షలు రాసింది. చిన్న కుమారుడు వెంకటేష్ మూడో తరగతి చదువుతున్నాడు. అయితే గత రెండేళ్లుగా ఆస్తి పత్రాలు ఇవ్వాలని రమణ అంకయ్యమ్మను వేధించసాగాడు. భర్త వేదింపుల తాళలేక ఆమె స్థానిక గ్రామపెద్దలు, పోలీసులకు ఈ విషయమై ఫిర్యాదు చేసింది. గత సంవత్సరం స్థానిక ఎస్సై సూర్యకుమారి వారికి సర్దిచెప్పి పంపించారు.
ఈ క్రమంలో మళ్లీ గొడవలు జరుగుతుండటంతో పెద్ద కుమారుడిని, కుమార్తెను అంకయ్యమ్మ పుట్టింటికి పంపించింది. గత వారం రోజులుగా ఆమెను భర్త రమణతో పాటు ఆయన సోదరుడు కూడా భూములకు సంబంధించిన పత్రాలు ఇవ్వాలని వేధించసాగారు. ఇప్పటికే చాలా వరకు భూములు అమ్మారని ఇప్పుడు ఉన్నదీ కాస్తా అమ్మేస్తే భవిష్యత్లో కుమార్తె వివాహం ఎలా చేయాలని అంకయ్యమ్మ వారికి తెలిపింది.
అయినా మరోసారి ఈ విషయమై బలవంతం చేయడంతో అంకయ్యమ్మ ఇవాళ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభినట్లు ఎస్సైలు సూర్యకుమారి, పాపారావు తెలిపారు.
డబ్బు కోసం హత్యలు - తెలిసిన వాళ్లే మహిళల ముఠా టార్గెట్ - Murders by Womens Gang