GBS VIRUS CAUSES: గులియన్ బారీ సిండ్రోమ్ (GBS) కేసులు అధిక సంఖ్యలో నమోదవడానికి కలుషిత నీరు, ఆహారం కారణమని తెలిసింది. బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్ల ప్రభావంతో ముఖ్యంగా రోగనిరోధకశక్తి బలహీనంగా ఉన్న వారు జీబీఎస్ బారిన పడుతున్నారు. పలువురు బాధితుల నుంచి సేకరించిన నమూనాల్లో డయేరియాకు కారణమయ్యే ‘కంపైలో బ్యాక్టర్ జెజునీ’ బ్యాక్టీరియా, నాన్పోలియో ఎంటెరో, నోరో వైరస్లు ఉన్నట్లు తెలిసింది.
అసలేంటీ కంపైలో బ్యాక్టర్ జెజునీ: జీబీఎస్ కేసులు అధికంగా నమోదవడానికి ప్రధాన కారణం బాధితులు కలుషిత నీరు, ఆహారం తీసుకోవడం వల్లే ఈ వ్యాధి బారినపడినట్లు తెలుస్తోంది. కంపైలో బ్యాక్టర్ జెజునీ బ్యాక్టీరియా ప్రభావానికి గురైన వ్యక్తులలో పొత్తికడుపులో నొప్పి, జ్వరం, వాంతులు, డయేరియా వంటి లక్షణాలు ఉంటున్నాయి. దానికి బాధితుల రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందించే క్రమంలో సమస్యలు తలెత్తుతుండటంతో జీబీఎస్ వస్తోంది.
చిన్నారుల్లోనూ వైరస్ లక్షణాలు - ఈ జాగ్రత్తలు తప్పనిసరి
సొంత కణజాలాన్నే శత్రువుగా భావించి: సాధారణంగా ఏవైనా బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్లు తలెత్తినప్పుడు రోగనిరోధకశక్తి ఉత్తేజితమై వాటిని ఎదుర్కోవడానికి యాంటీబాడీలను ఉత్పత్తి అవుతాయి. అయితే ఈ సమయంలో కొంతమందిలో ఈ యాంటీబాడీలు బాధితుల కణజాలాన్నే శత్రువుగా భావించి ఎదురుదాడి చేస్తున్నాయి. దీనివల్లే ఆటోఇమ్యూన్ జబ్బులు తలెత్తుతున్నాయి. ఈ పరిస్థితులే జీబీఎస్ వచ్చేందుకు సైతం దోహదం చేస్తున్నాయి. జన్యుపరమైన కారణాలతో సైతం కొందరు జీబీఎస్ బారినపడే అవకాశం ఉంది. అత్యంత తక్కువ మందిలో శస్త్రచికిత్సలు, వ్యాక్సినేషన్లు, గాయాల వల్ల ఈ తరహా కేసులు నమోదవుతాయి.
ఏపీలో పరిస్థితి ఎలా ఉందంటే?: మహారాష్ట్రలోని పుణెలో అధిక సంఖ్యలో జీబీఎస్ కేసులు నమోదవడానికి కలుషిత నీరు, ఆహారం కారణమని అక్కడి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తేల్చారు. అయితే పుణె తరహా పరిస్థితులు ఏపీలో లేవు. ఇక్కడ ప్రతి సంవత్సరం మాదిరిగానే కొన్నిచోట్ల జీబీఎస్ కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా 17 కేసులు మాత్రమే ఉన్నాయని అధికారికంగా ప్రకటించారు. గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల హాస్పిటల్స్లలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు విడిచినట్లు తెలుస్తోంది. తాజాగా సోమవారం పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన వ్యక్తికి, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలేనికి చెందిన వ్యక్తికి జీబీఎస్ బారినపడినట్లు నిర్ధారించారు. ఈ రెండు కేసులు కలిపితే మొత్తం ఏపీలో కేసుల సంఖ్య 19కి చేరింది.
ఆమె మృతికి జీబీఎస్ కారణం కాదు: జీబీఎస్ లక్షణాలతో కేజీహెచ్లో చికిత్స పొందుతున్న రేణుక (63) సోమవారం ఉదయం మృతి చెందారు. ఆమె ఈ నెల 6వ తేదీన ఇక్కడి మెడికల్ వార్డులో చేరగా, ఆమెకు చికిత్స అందించారు. కోలుకుంటున్న సమయంలో ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో చికిత్స పొందుతూ కన్ను మూసినట్లు హాస్పిటల్ పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్ పి.శివానంద తెలిపారు. రేణుక మృతికి జీబీఎస్ కారణం కాదని, తీవ్రమైన గుండెపోటుతోనే మరణించినట్లు పేర్కొన్నారు.
ఏపీలో 'జీబీఎస్' మరణం - జీజీహెచ్లో చికిత్స పొందుతూ మహిళ మృతి