Skill Hubs in AP : గతంలో టీడీపీ సర్కార్ యువతలో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అవసరమయ్యే నైపుణ్యాలను పెంపొందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేసింది. కానీ వైఎస్సార్సీపీ పాలనలో వాటి నిర్వహణను పూర్తిగా పక్కనే పెట్టి అంతా నిర్వీర్యం చేశారు. మళ్లీ కూటమి ప్రభుత్వం స్కిల్ హబ్ల ద్వారా సాంకేతిక శిక్షణ అందించేందుకు కార్యాచరణ చేపట్టింది. సమ్మర్ హాలిడేస్ నేపథ్యంలో ఈ కేంద్రాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. చదువు పూర్తి చేసినవారితో మధ్యలో ఆపేసిన వారు సైతం ఉద్యోగాలు పొందేలా ఈ కేంద్రాల్లో ట్రైనింగ్ అందిస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో నియోజకవర్గాలవారీగా నైపుణ్య కేంద్రాలను నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళంలోని పలాస, బలగ, ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐ (డీఎల్టీసీ)లు, టెక్కలి, పాతపట్నం, నరసన్నపేట, బారువ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, ఆమదాలవలస ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో స్కిల్ హబ్లు ఏర్పాటు చేశారు. ఈ 8 కేంద్రాల ద్వారా అభ్యర్థులకు మొత్తం 14 అంశాలకు సంబంధించి ప్రత్యేక ట్రైనింగ్ అందిస్తున్నారు.
అభ్యర్థుల అర్హతలివే : ఇందులో శిక్షణ పొందాలనుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఒక కోర్సులో 30 మంది చొప్పున ప్రవేశాలు కల్పిస్తారు. పది, ఇంటర్, డిగ్రీ, పీజీ, వృత్తిపరమైన కోర్సులు చదివిన వారందరూ శిక్షణ కార్యక్రమంలో పాల్గొనేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. మూడు నెలల పాటు సాగే కార్యక్రమంలో 400 గంటల శిక్షణ ఉంటుంది. కోర్సుకు తగిన విధంగా ఆచరణాత్మక శిక్షణ (ప్రాక్టికల్ ట్రైనింగ్) ఉంటుంది. కంప్యూటర్ విభాగాలైన ఎంఎస్వర్డ్, పవర్ పాయింట్, ఇంటర్నెట్, ఫొటోషాప్లలో రోజు విడిచి రోజు, మిగతా రోజుల్లో థియరీ తరగతులు ఉంటాయి. కోర్సు పూర్తి చేసిన వారికి ప్రతిభ పరీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత నైపుణ్య ధ్రువపత్రాలను అందజేస్తారు.
293 మందికి ఉద్యోగాలు : ఇప్పటి వరకు ఈ ఎనిమిది స్కిల్ హబ్ల ద్వారా మొత్తం 23 బ్యాచ్లకు వివిధ కోర్సుల్లో శిక్షణ అందించారు. మొత్తం 593 అభ్యర్థులు శిక్షణ పూర్తి చేసుకున్నారు. వారిలో 293 మందికి ఉద్యోగాల కల్పన జరిగింది. ప్రస్తుతం సమ్మర్ ప్రత్యేక తర్ఫీదు 11 బ్యాచ్ల్లో 283 మందితో నిర్వహిస్తున్నారు.
క్షేత్రస్థాయిలో ప్రచారం : యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని శ్రీకాకుళం జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ఉరిటి సాయికుమార్ తెలిపారు. పది నుంచి పీజీ వరకు చదివిన వారంతా ఈ శిక్షణకు అర్హులేనని చెప్పారు. ఎంచుకున్న కోర్సులో మూడు నెలల పాటు కార్యక్రమం కొనసాగుతుందన్నారు. అనంతరం అభ్యర్థులకు ప్రత్యేక ఉద్యోగ మేళాలో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. దీనిపై ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రచారం చేశామని ఆయన వెల్లడించారు.