Vijayawada Night Food Courts Issue : 'బిర్యానీ, రండి రండి. రూ.150లకే నాలుగు రకాలతో బిర్యానీ. ఒక్కసారి తినండి. నచ్చితేనే డబ్బులివ్వండి. ఇదిగో ఈ కప్పుతో రుచిచూడండి. తింటారా, తినిపించమంటారా?’ ‘మేడం ఒక్క నిమిషం స్కూటీ ఆపండి. మా దగ్గరకొచ్చి ఒక్కసారి బిర్యానీ తినండి. మీలాగే మా బిర్యానీ కూడా అందంగా ఉంటుంది. ఒక్కసారి తింటే మళ్లీమళ్లీ వస్తారు. ఇప్పుడు కాకున్నా ఇంకోసారైనా రండి. ఇదిగో ఇదే మా బండి గుర్తుపెట్టుకోండి’ ఇదీ బెజవాడలో అర్ధరాత్రి వరకు కమ్మని రుచులందించిన ఈట్స్ట్రీట్లో శైలి.
రాత్రి 11 తర్వాత అటుగా వెళ్లాలంటే : నగర జీవికి రాత్రి పొద్దుపోయే వరకు ఆహారం లభించాలనే సదుద్దేశంతో విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం, బీఆర్టీఎస్ రోడ్లలో ఈట్స్ట్రీట్, ఫుడ్ కోర్టు ఏర్పాటు చేశారు. కానీ ఈట్స్ట్రీట్లోకి వెళ్తే దుకాణదారులు నడిరోడ్లపైకి వచ్చి మా వద్దకు రండంటే, మా దుకాణానికి రావాలని ప్రజల మీద పడిపోతున్నారు. పిల్లలతో వెళ్తున్న వారిని చుట్టుముట్టి వేధిస్తున్నారు. విసుగెత్తి ప్రశ్నిస్తే దాడి చేస్తున్నారు. రాత్రి 11 తర్వాత అటుగా వెళ్లాలంటే సామాన్యులు జంకాల్సిన పరిస్థితి.
ఒక్కో బండి దగ్గర అమ్మేవారు కాకుండా నలుగురేసి మనుషులను పెట్టుకున్నారు. వీరు ఈట్స్ట్రీట్లోకి ప్రవేశించిన వారిని చుట్టముట్టి చేయిపట్టుకుని మరీ బండి దగ్గరకు బలవంతంగా తీసుకెళ్తారు. మహిళలనైతే వ్యంగ్యంగా పిలుస్తూ రాద్ధాంతం చేస్తున్నారు. ఇటీవల ఓ జంట రాత్రి పది దాటాక వెళ్తే ఒక్కసారిగా మీదపడ్డారు. ఇదేంటని అతడు కసురుకుంటే మీదకెళ్లి కొట్టబోయారు.
చేయి చాస్తే రూ.400 : అలాగే ఇద్దరు స్నేహితులు బైక్పై వెళ్తే తాళం ఆపి రుచి చూశాక వెళ్లండన్నారు. గట్టిగా అడిగేసరికి బల్లదగ్గర ఉన్న వారంతా ఏకమై స్నేహితుల మీదకు దూసుకొచ్చారు. ఇక్కడ రోజురోజుకీ పరిస్థితులు అదుపు తప్పుతున్నాయి. ఈట్స్ట్రీట్లో చిన్నా, పెద్ద కలిపి 130పైగా దుకాణాలు ఉన్నాయి. రాత్రి పది దాటాక ఓ బండిపై ఇద్దరు వచ్చి చేయి చాస్తే కరెంట్, క్లీనింగ్కని రూ.400 చేతిలో పెట్టాల్సిందే. రోజూ ఇదే తంతు. ఇవ్వకుంటే మరుసటిరోజు అక్కడ దుకాణం ఎత్తేయాల్సిందే. ఈ దందా కొందరు చిన్న నాయకుల కనుసన్నల్లోనే జరుగుతోంది. అధికారంలో ఎవరుంటే వారి వైపు నిలిచి దందా నడుపుతున్నారు.
పట్టించుకోని అధికారులు : ఈట్స్ట్రీట్ సూర్యారావుపేట, మాచవరం ఠాణాలకు సరిహద్దులో ఉంది. రోడ్డుకు ఓ వైపు సూర్యారావుపేట, మరోవైపు మాచవరం ఠాణా పరిధిలోకి వస్తుంది. దీనిపై నిఘా ఉంచాల్సిన ఇరుస్టేషన్ల అధికారులు కనీసం పట్టించుకోవడంలేదు. రాత్రి 12 అయితే సైరన్తో కాసేపు హడావుడి చేస్తారు తప్ప అంతకు ముందు, తర్వాత కనీసం చూడడంలేదు. పరిస్థితులు చక్కదిద్ది తమకు నచ్చిన బండి వద్ద ఆహారం తినేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
రాత్రిళ్లు ఒకేచోట ఆహారం.. గుంటూరులో ఫుడ్కోర్టులు ప్రారంభం
ఆకలి తీరుస్తున్న ఫుడ్ కోర్టులు.. లేకుంటే పస్తులంటున్న అన్నార్తులు