Forceful Marriage at Annavaram : 22 ఏళ్ల వయసున్న యువతికి 42 ఏళ్ల వ్యక్తితో వివాహం నిశ్చయించడమే కాకుండా ఆమెకు చెప్పకుండా నేరుగా పెళ్లిపీటల మీద కూర్చోబెట్టిన వైనమిది. ఆలయంలో జరుగుతున్న ఈ బలవంతపు పెళ్లి భక్తులు, సిబ్బంది చొరవతో నిలిచిపోయింది. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరుకు చెందిన 42 ఏళ్ల వ్యక్తికి అదే జిల్లా ఊటుకూరుకు చెందిన 22 ఏళ్ల యువతితో కుటుంబసభ్యులు సంబంధం కుదిర్చారు.
వివాహం చేసుకోవడానికి అక్కడి నుంచి అన్నవరం వచ్చారు. శనివారం ఉదయం దేవస్థానంలో పెళ్లిపీటలపై క్రతువు జరుగుతుండగా పెళ్లికూతురు విలపిస్తుండటాన్ని భక్తులు గుర్తించారు. కొందరు మహిళలు, భద్రతా సిబ్బంది ఆమెను పక్కకు పిలిచి మాట్లాడగా పెద్ద వయసున్న వేరే కులం వ్యక్తితో పెళ్లి చేస్తున్నారని, అస్సలు ఇష్టం లేదని ఆమె చెప్పింది.
కనీసం పెళ్లి అని చెప్పకుండా తీసుకొచ్చారని బోరున విలపిస్తూ మెడలోని దండలు తీసిపడేసింది. ఆలయ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో ఎస్సై శ్రీహరిబాబు దేవస్థానానికి వచ్చి వధూవరులు, కుటుంబ సభ్యులు, పురోహితుడిని పోలీస్స్టేషన్కు తరలించారు. వివరాలు తెలుసుకుని కౌన్సెలింగ్ చేసి పంపించారు.