Civil Toppers 2025 From Telugu States : మంగళవారం యూపీఎస్సీ సివిల్స్ -2024 ఫలితాలు విడుదలయ్యాయి. ఉత్తర్ప్రదేశ్లోని నైనికి చెందిన శక్తి దుబె మొదటి స్థానంలో నిలిచారు. తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందిన సాయిశివాని 11వ ర్యాంకు సాధించారు. తెలుగు రాష్ట్రాల్లో ఆమెదే ఉత్తమ ర్యాంకు. ఆ తర్వాత ర్యాంకు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన బన్నా వెంకటేశ్ది. ఆయన ఇప్పటికే సివిల్ సర్వీసెస్లో సేవలు అందిస్తున్నా మళ్లీ రాసి 15వ ర్యాంకు కైవసం చేసుకున్నారు.
సివిల్ సర్వీసెస్లో 100 లోపు ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాల అభ్యరులు ఐదుగురు సత్తా చాటారు. మొత్తం 55 మంది ఎంపికయ్యారు. ఈ ఫలితాల్లో ర్యాంకులు సాధించిన తెలుగు వారు ఇప్పటికే వివిధ కేంద్ర సర్వీసులకు ఎంపికయ్యారు. తెలుగు విజేతల్లో అమ్మాయిలు 10 మందిలోపే ఉండటం గమనార్హం. ఈసారి 1 నుంచి 200 లోపు ర్యాంకు సాధించిన అభ్యర్థుల్లో పలువురు గతంలోనూ సివిల్స్కు ఎంపికైన వారున్నారు. అయితే ఐఏఎస్, ఐపీఎస్ తదితర సర్వీస్ల కోసం మరో ప్రయత్నం చేసి పలువురు తమ లక్ష్యాన్ని సాధించారు.
తెలుగు అభ్యర్థులు వివరాలు ఇలా : బన్నా వెంకటేశ్ 2023లో 467వ ర్యాంకు సాధించి ఐపీఎస్ ట్రైనింగ్ తీసుకుంటూనే, ఈసారి 15వ ర్యాంకు పొంది జాతీయస్థాయిలో మెరిశారు. గత ఫలితాల్లో 104వ ర్యాంకు సాధించిన రావుల జయసింహారెడ్డి, ఈసారి 46వ ర్యాంకు సాధించారు. నెల్లూరు సాయితేజ గత ఫలితాల్లో 558 ర్యాంకు రాగా ఈసారి 154వ ర్యాంకుతో మెరిశారు. ఎన్.చేతన రెడ్డికి సివిల్స్-2022లో 346వ స్థానంలో నిలవగా ఈసారి 110 ర్యాంకు సాధించారు. చింతకింది శ్రవణ్కుమార్రెడ్డి సివిల్స్ 2022 ఫలితాల్లో 426 ర్యాంకు సాధించగా, ఈసారి 62వ ర్యాంకుతో మెరిశారు. ఇంకా పలువురు ఉత్తమ ర్యాంకులను పొందారు.
గత కొన్నేళ్లలో వంద ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు | |
2020 | 8 |
2021 | 10 |
2022 | 7 |
2023 | 4 |
2024 | 5 |
ప్రణాళికతో చదివితే సివిల్స్ ఈజీ : సివిల్స్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి ఆగ్రస్థానంలో నిలిచిన వరంగల్కు చెందిన ఇట్టబోయిన సాయి శివాని రెండో ప్రయత్నంలోనే 11వ ర్యాంకు సాధించారు. వరంగల్కు చెందిన సాయి శివాని మధ్యతరగతి కుటుంబం. కడప జిల్లాలోని ఇడుపులపాయ ట్రిపుల్ఐటీలో బీటెక్ పూర్తి చేశారు. ఇటీవల తెలంగాణ గ్రూప్ 1 ఫలితాల్లోనూ రాష్ట్రస్థాయిలో 21వ ర్యాంకు, జోన్ 1లో 11వ ర్యాంకుతో మెరిశారు. రోజుకు పన్నెండు గంటలు చదివానని, ఒక ప్రణాళికతో చదివితే సివిల్స్ పెద్ద కష్టం కాదని తెలిపారు. సొంతంగా నోట్స్ ప్రిపరేషన్తో పాటు చిత్తశుద్ధితోనే మెరుగైన ఫలితాలు పొందుతారని వివరించారు.
ఐపీఎస్ ట్రైనింగ్ తీసుకుంటూనే : శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం అల్లాడపేట గ్రామానికి చెందిన బన్నా వెంకటేశ్ సివిల్స్లో 15వ ర్యాంకు సాధించారు. రైతు దంపతులు చంద్రరావు, రోహిణిల తొలి సంతానం వెంకటేశ్. గతేడాది సివిల్స్లో 467 ర్యాంకు సాధించి ఐపీఎస్కు ఎంపికయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఐపీఎస్ శిక్షణ పొందుతూనే సివిల్స్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. వెంకటేశ్ తమిళనాడు తిరుచిరాపల్లి ఎన్ఐటీలో ఇంజినీరింగ్ చదివారు. రెండేళ్లపాటు సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేసి ఉద్యోగాన్ని వదిలిపెట్టి సివిల్స్కు సిద్ధమయ్యారు. తమ్ముడు వంశీ ఇస్రో శాస్త్రవేత్తగా విధులు నిర్వహిస్తున్నారు.