Man Throws His 2 Kids into Canal in Konaseema District : తండ్రి వెంట ఉంటే పిల్లలకు కొండంత ధైర్యం. ఏదైనా చెయ్యగలమన్న నమ్మకం. పసి వయసు నుంచి నాన్నే పిల్లలకు సూపర్ హీరో. బొమ్మలు కొని పెడతాడు, కథలు చెప్తాడు, చిన్న గాయం అయితే అల్లాడిపోతాడు. బిడ్డలను కంటతడి పెట్టనీయకుండా కాపాడుకుంటాడు. కానీ కన్న బిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన సొంత తండ్రే కాలయముడిగా మారుతున్నారు. అత్యంత క్రూరంగా వారి జీవితాలను చిదిమిస్తున్నారు. కాకినాడలో ఇద్దరు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన మరవకముందే అలాంటి ఘటనే మరొకటి జరిగింది. అభం శుభం తెలియని పిల్లలను తండ్రి కాలువలో తోసేశాడు. దీంతో ఆరేళ్ల బాలిక మరణించగా, బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు.
ఆర్థిక ఇబ్బందులతో ఓ తండ్రి (Father) పిల్లలిద్దరినీ కాలువలోకి తోసేసి ఆపై అదృశ్యమైన విషాద ఘటన కోనసీమ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో కుమార్తె మృతి చెందగా కుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడు. రాయవరం మండలం వెంటూరుకు చెందిన పిల్లి రాజుకు వ్యాపార భాగస్వామి నుంచి 30 లక్షలు రావాల్సి ఉంది. దీని గురించి నాలుగైదు రోజులుగా భార్య విజయతో చర్చిస్తూ ఆవేదన చెందాడు.
కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకుందామని భార్యతో చెప్పాడు. పొలం అమ్ముకునైనా కష్టాల నుంచి బయట పడదామని ఆమె నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రాజు సోమవారం రామచంద్రపురంలో పిల్లలు చదువుతున్న బడికి వెళ్లి వారిని తన వెంట తీసుకుని వెళ్లాడు. ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని తొగరువారి సావరం కాలువ గట్టుకు తీసుకెళ్లి ఇద్దరినీ అందులోకి తోసేశాడు.
కుమార్తె నీటమునిగి చనిపోగా కుమారుడు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. ఏడుస్తూ కనపడిన బాలుడిని స్థానికులు గమనించి విషయం తెలుసుకుని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని కుమార్తె మృతదేహాన్ని బయటకు తీశారు. తమను తండ్రి రెండురోజులుగా కోటిపల్లి పరిసర ప్రాంతాల్లో తిప్పాడని, చనిపోదామంటూ చెప్పేవాడని సందీప్ తెలపడం అక్కడి వారిని కలచివేసింది. పిల్లలిద్దరినీ కాలువలోకి తోసేసిన తర్వాత రాజు ఏమయ్యాడనేది తెలీలేదు. అతడి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది.
పిల్లలు పోటీ పడలేక పోతున్నారని - కాళ్లూ చేతులూ కట్టేసి, తలలు బకెట్లలో ముంచేసి!
ఇష్టంలేని పని చేసిన కుమార్తె - ఉరితాడు ఇచ్చి, చెట్టు చూపించిన తండ్రి