ETV Bharat / state

పిల్లలు పోటీ పడలేక పోతున్నారని - కాళ్లూ చేతులూ కట్టేసి, తలలు బకెట్లలో ముంచేసి!

అనంతరం తనూ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న తండ్రి - పిల్లలు పోటీ ప్రపంచంలో రాణించలేకపోతున్నారని సూసైడ్‌ నోట్‌

Father Kills Two Children And Also he Died in Kakinada
Father Kills Two Children And Also he Died in Kakinada (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : March 15, 2025 at 8:24 AM IST

2 Min Read
Choose ETV Bharat

Father Kills Her Two Children and Also he Died in Kakinada : కన్న బిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన సొంత తండ్రే కాలయముడిగా మారాడు. అత్యంత క్రూరంగా వారి జీవితాలను చిదిమివేశాడు. కాళ్లూ, చేతులను తాళ్లతో కట్టేసి, నీళ్ల బకెట్లలో తలలు ముంచి ఊపిరి తీశాడు. అంతటితో ఆగక తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం, సొంతిల్లు, మంచి కుటుంబం ఉన్నా, ఈ పోటీ ప్రపంచంలో తన పిల్లలు రాణించలేరని, దీంతో వారిని చంపేసినట్లు సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడు.హోలీ పండుగ రోజు కాకినాడలోని సుబ్బారావునగర్‌లో జరిగిన ఈ దారుణం తీవ్ర విషాదాన్ని నింపింది.

పిల్లల పాఠశాలను మార్పించారు : సర్పవరం సీఐ పెద్దిరాజు తెలిపిన వివరాల మేరకు, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన వానపల్లి చంద్రకిశోర్‌ కాకినాడ జిల్లా వాకలపూడిలోని ఓఎన్‌జీసీ కార్యాలయంలో అసిస్టెంట్‌ ఎకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు. పట్టణంలోని ఓ ఫ్లాట్‌లో నివాసం ఉంటున్నాడు. అతనికి భార్య తనూజ, ఒకటో తరగతి చదివే జోషిల్‌ (7), యూకేజీ చదివే నిఖిల్‌(6) పిల్లలున్నారు. వారి పిల్లలు సరిగా చదవడం లేదంటూ ఇటీవలే పాఠశాలను మార్పించారు.

బకెట్‌లలో తలలు మునిగిపోయి : శుక్రవారం హోలీ సందర్భంగా చంద్రకిశోర్‌ భార్య, పిల్లలను తీసుకుని తమ ఆఫీసులో వేడుకలకు వెళ్లాడు. అనంతరం పిల్లలకు యూనిఫాం కొలతలు తీయించడానికి టైలర్‌ వద్దకు తీసుకెళ్తున్నానని, పది నిమిషాల్లో వస్తానని తన భార్యను అక్కడే ఉండమని చెప్పి వెళ్లాడు. ఎంతసేపటికీ భర్త రాకపోవడం, ఫోన్‌ చేసినా ఎత్తకపోవడంతో తనూజ తోటి ఉద్యోగులతో కలిసి ఇంటికి వెళ్లారు. కిటికీలోంచి చూడగా, భర్త ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చనిపోయి ఉన్నాడు. బలవంతంగా తలుపులు తెరిచి చూడగా, పిల్లలిద్దరూ కాళ్లూ చేతులకు కట్లతో నిండా నీళ్లు ఉన్న బకెట్‌లలో తలలు మునిగిపోయి ఉన్నారు.

పోటీ పడలేక పోతున్నారు : దీంతో ఒక్కసారిగా తనూజ కుప్పకూలిపోయారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో తన పిల్లలు పోటీ పడలేక పోతున్నారని, వారికి భవిష్యత్తు లేదని, అందుకే ఇద్దరు పిల్లలను చంపి తాను కూడా చనిపోతున్నానని చంద్రకిశోర్‌ సూసైడ్‌ నోటులో రాసినట్లు పోలీసులు తెలిపారు. ఆ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. తన తమ్ముడికి ఆర్థిక ఇబ్బందులేమీ లేవని, ఆస్తులు ఉన్నాయని, ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని మృతుడి సోదరుడు వాపోయారు.

'పిల్లలు నిద్ర లేచి నాన్నా అమ్మ ఏదంటే ఏమని చెప్పాలి'

పోర్న్ వీడియోలు చూపించి వేధిస్తున్న భర్త - ఆత్మహత్య చేసుకున్న భార్య