Father And Son Die With Current Shock : విద్యుదాఘాతంతో తండ్రి, కుమారుడు మృతిచెందిన విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరో మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
వివరాల్లోకి వెళితే : ఇల్లందు మండలం మర్రిగూడెం పంచాయతీ ఎల్లాపురం గ్రామానికి చెందిన ఎర్రమ్మ తెల్లవారుజామున కాలకృత్యాలు తీర్చుకునే క్రమంలో దుస్తులు వేసుకునే దండం పట్టుకుంది. కానీ అప్పటికే ఆ తీగకు ఎలక్ట్రికల్ సర్వీస్ వైర్ తాకి విద్యుత్ ప్రవహిస్తోంది. ఈ క్రమంలోనే ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన భర్త ఏనుగు నర్సయ్య(55), కుమారుడు ప్రవీణ్(30) కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు.
ఈ ఘటనలో నర్సయ్య భార్య ఎర్రమ్మ తీవ్రంగా గాయపడింది. ఆమెను ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యచికిత్స కోసం ఖమ్మం తరలించారు. వ్యవసాయమే వీరి కుటుంబానికి జీవనాధారం. ప్రవీణ్కు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై సమాచారమందుకున్న కొమరారం ఎస్సై నాగుల్ మీరా ఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.
గణపతి విగ్రహాలు తరలిస్తుండగా విద్యుదాఘాతం - ఇద్దరి మృతి, ఏడుగురికి తీవ్ర గాయాలు
వర్షాకాలంలో కరెంట్తో జర భద్రం - షాక్ తగలకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?