Falcon Company Investment Fraud : హైదరాబాద్ కేంద్రంగా మరో భారీ మోసం బయటపడింది. ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరిట భారీగా లాభాలు ఇప్పిస్తామని ఓ సంస్థ ఏకంగా రూ.850 కోట్ల మేర పెట్టుబడిదారులకు కుచ్చుటోపీ పెట్టింది. దేశవ్యాప్తంగా రూ.1700 కోట్లు సేకరించి అకస్మాత్తుగా బోర్డు తిప్పేయడంతో 6 వేల 9 వందల 79 మంది దగా పడ్డారు. కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేసిన సైబరాబాద్ పోలీసులు, మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే : అమర్దీప్ కుమార్, ఆర్యన్సింగ్, యోగేందర్ సింగ్, పవన్ కుమార్ ఓదెల, కావ్యనల్లూరి తదితరులంతా కలిసి క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట సంస్థను ఏర్పాటు చేశారు. పవన్ కుమార్ వైస్ ప్రెసిడెంట్, కావ్య నల్లూరి డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఆ సంస్థకు అనుబంధంగా ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ సంస్థ ఫాల్కన్ క్యాపిటల్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సహా మరికొన్నింటిని ఏర్పాటు చేశారు. కంపెనీల నిధుల సమీకరణలో భాగంగా ఉపయోగించే ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ను తెరపైకి తెచ్చి జనాన్ని వంచించారు.
పెట్టుబడుల పేరుతో మోసం : నిందితులు ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరిట హైటెక్సిటీలోని హుడా ఎన్క్లేవ్లోని భవనంలో కార్యాలయం ప్రారంభించారు. బ్రిటానియా, అమెజాన్, గోద్రేజ్ వంటి సంస్థలతో సంబంధాలున్నాయంటూ నమ్మబలికారు. 2021 నుంచి డిపాజిట్లు సేకరించారు. ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరుతో యాప్, వెబ్సైట్ ప్రారంభించారు. ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు చెల్లిస్తామని 25 వేల నుంచి 9 లక్షల వరకు ఇన్వాయిస్లు అందుబాటులో ఉంచారు. నిందితులు నాలుగేళ్లలో 7 వేల మంది నుంచి దాదాపు రూ.1,700 కోట్లు వసూలు చేశారు. ప్రారంభంలో వడ్డీతో సహా సక్రమంగా చెల్లింపులు జరిపినా, కొన్ని నెలలుగా ఆపేశారు. ఇలా రూ.850 కోట్ల సొమ్మును పక్కదారి పట్టించి 14 కంపెనీల్లోకి మళ్లించారు.
14 కంపెనీలకు మళ్లింపు : పలు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినా సదరు సంస్థల నుంచి డబ్బు రాకపోవడంతో ఇన్వాయిస్లు కొనుగోలు చేసిన వారి నుంచి ఒత్తిడి పెరుగుతూ వస్తోంది. బాధితులు హైటెక్ సిటీలోని కార్యాలయానికి రావడంతో నిందితులు జనవరి 15న కార్యాలయాన్ని మూసేసి పరారయ్యారు. దీంతో బాధితులు మోసపోయినట్లు గుర్తించి సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు.
40 మంది నిందితుల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చి సాంకేతిక ఆధారాలతో పవన్ కుమార్ ఓదెల, కావ్య నల్లూరిని అరెస్టు చేశారు. నిందితులు గతంలో బ్లూ లైఫ్ ఇంటర్నేషనల్ కంపెనీ పేరిట గొలుసుకట్టు మోసానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. సొమ్ము రికవరీ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న మరికొందరి కోసం గాలిస్తున్నారు. జీవితకాలం సంపాదించినదంతా పెట్టుబడిగా పెట్టి మోసపోయినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మా కంపెనీలో పెట్టుబడులు పెడితే 40 శాతం షేర్లు - రూ.కోట్లలో మోసం చేసిన కేటుగాడు
రూ.17 లక్షలు ఇస్తే ప్రతి నెలా 30 వేలు, బోనస్గా 267 గజాల ప్లాట్!