Electric Vehicle Sales Are Rising in Andhra Pradesh : రాష్ట్రంలో విద్యుత్ వాహనాల వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ వాహనాల కంటే ఖర్చు తక్కువగా ఉండటం, ప్రభుత్వం లైఫ్ ట్యాక్స్ పూర్తిగా మినహాయింపు ఇస్తుండటం, ఎక్కడికక్కడ పెద్ద సంఖ్యలో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటవుతుండటంతో ఈవీల కొనుగోలుపై ఎక్కువ మంది మొగ్గుచూపుతున్నారు. 2019-20లో రాష్ట్రంలో విద్యుత్ ద్విచక్రవాహనాల సంఖ్య 1,042 మాత్రమే ఉండేది. ఈ ఏడాది మార్చి నెలాఖరుకు వీటి సంఖ్య 1.03 లక్షలు దాటిందని పలు సర్వేలు తెలుపుతున్నాయి. ఇదే సమయంలో విద్యుత్ కార్ల సంఖ్య 72 నుంచి 6 వేలకు పెరిగింది. అయితే ఈవీల ఛార్జింగ్కు ఛార్జింగ్ స్టేషన్లలో ధరలు ఎక్కువగా ఉండటం భారంగా ఉంటోంది.
ఛార్జింగ్ స్టేషన్ల హవా : గతంలో విజయవాడ నుంచి హైదరాబాద్ మార్గంలో పరిమితంగా కొన్నిచోట్ల మాత్రమే పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు ఉండేవి. ఇప్పుడు ఆ మార్గంతోపాటు విజయవాడ నుంచి విశాఖపట్నం వైపు, అటు నెల్లూరు, చెన్నై, తిరుపతి వైపు హైవేల వెంట పెద్ద సంఖ్యలో ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయి. విజయవాడ నగర పరిధిలోనే దాదాపు 20కి పైగా ఉన్నాయి. ఔత్సాహిక సంస్థలు పెట్రోల్ బంకులు, హోటళ్లు, రిఫ్రెష్మెంట్ సెంటర్ల వద్ద వీటిని అందుబాటులోకి తెస్తున్నాయి. ప్రస్తుతం అన్ని రకాల పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు కలిపి 880 ఉన్నట్లు విద్యుత్ శాఖ లెక్కలు చెబుతున్నాయి.
వేల స్టేషన్ల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు
- రాష్ట్రంలో 2030 నాటికి 5 వేలకు పైగా పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటును ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర హైవేలు, జాతీయ రహదారులతోపాటు జిల్లా కేంద్రాలు, పట్టణాలు, మండల కేంద్రాలు, ప్రభుత్వ కార్పొరేషన్లు, వాణిజ్య భవనాలు, అపార్ట్మెంట్లు, సొసైటీల్లో వీటి ఏర్పాటుకు ప్రణాళిక రచించారు.
- వాణిజ్య సముదాయాలు, హౌసింగ్ సొసైటీలు, రెసిడెన్షియల్ టౌన్ షిప్స్లో బిల్టప్ ప్రాంతం 5 వేల చదరపు అడుగులకు పైగా ఉంటే పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లకు అనుమతిస్తారు. అక్కడ పబ్లిక్ పార్కింగ్కు స్థలం తప్పనిసరిగా ఉండాలి. వీటి ఏర్పాటుకయ్యే పెట్టుబడిలో 25 శాతం (గరిష్ఠంగా రూ.3 లక్షల వరకు) ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది.
- ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటుకు ఏపీ నెడ్క్యాప్ వద్ద ఇప్పటి వరకు 950 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
- పట్టణాలు, నగరాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్టీసీ బస్టాండ్లు, డిపోల పరిధిలో ఉన్న ఖాళీ స్థలాల్లో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు అవకాశం ఇవ్వొచ్చు. దీనివల్ల ప్రభుత్వ కార్యాలయాలకూ ఆదాయం వస్తుంది.
గుడివాడ, మచిలీపట్నంకు 95 ఎలక్ట్రిక్ బస్సులు - పర్యావరణానికి మేలు
వాహనదారులకు ఇక్కట్లే : ఔత్సాహిక సంస్థలు పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు పెట్టి, వాటి కోసం యాప్లను అందుబాటులోకి తెచ్చాయి. ఆ యాప్లోనే తమ స్టేషన్లు ఎక్కడున్నాయో తెలియజేస్తున్నాయి. ఇలాంటివి మొత్తం 15 యాప్లు ఉన్నాయి. ఇన్ని యాప్లు, వాటిలో కొంత నగదును అందుబాటులో ఉంచటం వాహనదారులకు ఇబ్బందవుతోంది. ఛార్జింగ్ స్టేషన్ల యాప్లన్నీ కలిపి ఒకే ప్లాట్ఫామ్ కిందకు తీసుకురావాలని వినియోగదారులు కోరుతున్నారు.
కొన్ని సంస్థల ఛార్జింగ్ స్టేషన్ల నిర్వహణ దారుణంగా ఉంటుందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. యాప్లో చూసుకొని వెళ్లాక అది పని చేయడం లేదని చూపిస్తోందని ఫిర్యాదులు ఉన్నాయి. అక్కడ సహాయ సిబ్బంది ఎవరూ ఉండడం లేదంటున్నారు. వాహనదారుడే ఛార్జింగ్ చేసుకోవాల్సిన పరిస్థితులున్నాయి. స్టేషన్లో సీసీఎస్-2 గన్ పని చేయకపోతే ఎవరిని అడగాలో అర్థంకాదని వాహనదారులు పేర్కొంటున్నారు. కాల్సెంటర్కు ఫోన్లు చేసినా సరిగా స్పందించడం లేదని కొందరు విద్యుత్ కార్ల వినియోగదారులు వాపోతున్నారన్నారు. ఛార్జింగ్ స్టేషన్ల నిర్వహణ పక్కాగా ఉండేలా చూడాలని కోరుతున్నారు.
రూ. 5కే ఛార్జింగ్ : ప్రస్తుతం అన్ని పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లలో వాహనదారుల నుంచి సగటున యూనిట్కు రూ.22- 24 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇది చాలా ఎక్కువ. పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లకు వినియోగించే విద్యుత్కు పెద్ద ఎత్తున రాయితీ ఇవ్వాలి. వాహనదారులకు గరిష్ఠంగా యూనిట్కు రూ.5కే ఛార్జింగ్ చేసేలా చూస్తే రాష్ట్రంలో విద్యుత్ వాహనాల సంఖ్య భారీగా పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.