ETV Bharat / state

'సేమ్​ టు సేమ్'​ కానీ పులస కాదు - డిమాండ్​ను క్యాష్​ చేసుకుంటున్న వ్యాపారులు

కోల్​కతా, హౌరా నుంచి విలస చేపల్ని తెచ్చి విక్రయం - మార్కెట్లో సైజును బట్టి రూ.600 నుంచి రూ.1300ల ధర

East Godavari Beware Of Fake Pulasa
East Godavari Beware Of Fake Pulasa (EENADU)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : July 26, 2025 at 10:02 AM IST

|

Updated : July 26, 2025 at 5:31 PM IST

3 Min Read
Choose ETV Bharat

East Godavari Beware Of Fake Pulasa: గోదావరిలో పులస చేపల జాడ లేకపోయినా, యానాం మార్కెట్లో మాత్రం ఇవి పుష్కలంగా లభ్యమవుతున్నాయి. మత్స్యకారుల వలలకు చిక్కకుండా ఇవి ఎక్కడి నుంచి వచ్చాయో అని ఆశ్చర్యపోకండి. ఈ చేపలకు ఉన్న భారీ డిమాండ్​ను కొందరు వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. కోల్​కతా, హౌరా నుంచి విలస చేపల్ని తెచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. ప్రస్తుతం అక్కడి మార్కెట్లో సైజును బట్టి రూ.600 నుంచి రూ.1300 వరకు ధర పలుకుతున్నాయి. బంగాళాఖాతంలో వేటాడే విలసలను హౌరా పరిసరాల నుంచి రైలు మార్గంలో కాకినాడకు తీసుకువస్తున్నారు. అక్కడి నుంచి గూడ్స్ ఆటోల్లో వివిధ ప్రాంతాలకు తరలించి అమ్ముతున్నారు.

రంగు, వాసన ఒకేలా ఉన్నప్పటికీ: రంగు, వాసన ఒకేలా ఉండే విలస, పులస చేపల్లో రుచి, తాజాదనంలో తేడా ఉంటుంది. గోదావరిలో దొరికే పులస తాజాగా వండినప్పుడు ఎంతో రుచికరంగా ఉంటుంది. నాలుగైదు రోజులు ముందు పట్టిన విలస తాజాగా ఉండదు. రుచిలోనూ వ్యత్యాసం తెలుస్తుంది. తాజాదనాన్ని గుర్తించి వాటి మధ్య తేడాను తెలుసుకోగలం. సంతానోత్పత్తి కోసం గోదావరిలోకి ప్రవేశించే పులస వరదనీటిలో పలు పదార్థాలను తింటూ ధవళేశ్వరం బ్యారేజీ మీదుగా భద్రాచలం వరకు ప్రయాణిస్తుంది. ఈ క్రమంలో ఎగువకు వెళ్లే కొద్దీ రుచి పెరుగుతుంది. ధవళేశ్వరం, రాజమహేంద్రవరం మార్కెట్లో దొరికే పులసలకు ఎక్కువ రుచి ఉంటుంది.

మత్స్యకారుల అంచనాలు: పులసల సీజన్ వచ్చిందంటే చాలు యానాం ప్రాంతానికి చెందిన మత్స్యకారులు గుంపులుగా గోదావరిలో వేట సాగిస్తూ కనిపిస్తుంటారు. ప్రస్తుతం వీరు ఎక్కడా కనిపించడం లేదు. గతంలో నిత్యం రూ.లక్షల్లో వ్యాపారం సాగేది. కొద్ది వారాలుగా పులస లభ్యత లేకపోవడంతో కోల్​కతా నుంచి తెచ్చిన విలసలనే అమ్ముతున్నారు. ఆగస్టులోనైనా పులసలు దొరక్కపోతాయా అని ఆశతో ఎదురుచూస్తున్నారు.

మరోవైపు రానురాను పులస చేపల లభ్యత తగ్గిపోతోంది. పెద్ద పెద్ద వలలతో వేటాడితే పెద్ద చేపలు పడి ఎక్కువ డబ్బులు వస్తాయనే ఆలోచనలో జాలర్లు ఉన్నారు. దీనివల్ల తల్లి చేపకు నష్టం వాటిల్లి ఆ ప్రభావం వాటి ఉత్పత్తిపై పడుతుంది. సముద్రంలో పిల్ల పులసలనే వేటాడం, సంతానోత్పత్తి సమయంలో వేట, జలకాలుష్యం ఇతరత్రా కారణాలతో వీటి లభ్యత ఏడాదికేడాది తగ్గిపోతుందని గణాంకాలు చెబుతున్నాయి. ఇవి దొరకటం తగ్గిపోతున్న క్రమంలో ధరలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ చేపల ఉత్పత్తి తగ్గిపోవడానికి గల కారణాలపై పరిశోధనలు జరుగుతున్నాయి.

పుస్తెలమ్మైనా పులస కొని తినాల్సిందే : పుస్తెలమ్మైనా పులస కొని తినాల్సిందే అన్నది ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నా నానుడి. గోదావరికి వర్షాకాలం బురదనీరు వచ్చిందంటే పులసల చేపల సీజన్​ మొదలైయినట్లే మరి. ఈ సీజన్ జులై నుంచి అక్టోబరు వరకు ఉంటుంది. యానాం రేవులో వేలం పాటకు కిలో పైగా బరువున్న పులస విక్రయానికి వస్తే, దానిని స్థానిక మత్సకార మహిళ పొన్నమండ రత్నం రూ.15,000లకు దక్కించుకున్నారు. అలాగే తిరిగి దానిని రూ.18,000లకు అమ్మకానికి పెట్టారు. అయితే ఈ సీజన్​లో యానాం మార్కెట్​కు పులస రావడం కూడా ఇదే తొలిసారి. పైగా మంచి ధర పలకడంతో జాలర్లకు సంతోషం కలిగించింది. మరోవైపు రెండు రోజుల క్రితమే మరో పులాస చేప రూ. 10,000 కు అమ్ముడైనట్లు తెలుస్తోంది. అదే విధంగా యానాంలో మంగళవారం రెండు కిలోల బరువున్న పులస చేప వేలంలో రూ. 26,000 ధర పలికింది. ఈ పులసను ఆత్రేయపురం మండలం పేరవరం గ్రామానికి చెందిన బెజవాడ సతీష్‌ దక్కించుకున్నారు. దీన్ని బట్టి పులసకు ఉన్న డిమాండ్ ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు.

గోదావరికి పయనమైన పులస చేప - ముందు మాకే ఇవ్వాలంటూ పోటీ

దొరికిన 2 కిలోల పులస - వేలంలో ఎంత ధర పలికిందంటే!

Last Updated : July 26, 2025 at 5:31 PM IST