తెలంగాణలోనూ 'సైబర్ డెన్'లు! - మనలో ఒకడిగా ఉంటూనే మనల్నే దోచేస్తున్నారు
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మోసాలు - సాంకేతికత సాయంతో నేరగాళ్లపై దృష్టి సారిస్తున్న తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో - హైటెక్ సిటీలో నకిలీ కాల్ సెంటర్ నిర్వహిస్తున్న 63 మంది అరెస్టు

Published : August 4, 2025 at 11:47 AM IST
Crackdown on Cyber Fraud In Mule Accounts : ఇటీవల సైబర్ మోసాలు ఎప్పటికప్పుడు తాజాగా కొత్త రూపాల్లో జరుగుతున్నాయి. ప్రస్తుతం అక్రమ లావాదేవీల కోసం సైబర్ నేరస్థులు ఇతరుల బ్యాంక్ ఖాతాలను వినియోగించి వాటిని అక్రమ డబ్బుగా మార్చుకుంటున్నారు. అలానే ఉత్తరాది రాష్ట్రాలకే పరిమితమైన సైబర్ నేరగాళ్ల స్థావరాలు ప్రస్తుతం తెలంగాణలోనూ బయటపడుతున్నాయి. వివిధ ప్రాంతాలను అడ్డాగా చేసుకుని నకిలీ కాల్ సెంటర్లు, పెట్టుబడులు, డిజిటల్ అరెస్టు మోసాలకు పాల్పడే ముఠాలు వరుసగా చిక్కుతున్నాయి. ఇటీవల జులైలో దాదాపు ఐదుచోట్ల సైబర్ నేరగాళ్ల డెన్లను భగ్నం చేశారు.
వివిధ వెబ్సైట్లతో డేటా సిద్ధం : సైబర్ మోసాలు స్థావరాలు మార్చుకుంటూ దక్షిణాది రాష్ట్రాల ప్రజలను మోసం చేస్తున్నారు. రాజస్థాన్, హరియాణా, ఝార్ఖండ్, ఉత్తర్ప్రదేశ్లోని 10 జిల్లాలపై దృష్టి సారించారు. కొన్నాళ్లుగా వివిధ రాష్ట్రాల పోలీసులు ఈ ముఠాలను కనిపెడుతున్నారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, వివిధ రాష్ట్రాల సైబర్ నేరాల విభాగాలు నేరస్థుల డేటా, వారి ఫోన్ నంబర్లు, ఈ-మెయిళ్లు, వెబ్సైట్లతో డేటా తయారు చేస్తున్నారు. సాంకేతికత సాయంతో నేరగాళ్ల పనిపడుతోంది. గత ఫిబ్రవరిలో హైటెక్సిటీలోని పత్రికానగర్లో నకిలీ కాల్సెంటర్ నిర్వహిస్తున్న 63 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు గంపగుత్తగా కాల్స్ వెళ్లడం, నిఘాతో దీన్ని భగ్నం చేశారు.
ఖాతాలు మనోళ్లవే : నేరగాళ్ల లావాదేవీలకు బ్యాంకు ఖాతాలు (మ్యూల్ అకౌంట్లు) ఇస్తూ తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు పోలీసులకు చిక్కుతున్నారు. ఇప్పటివరకూ కేవలం మ్యూల్ అకౌంట్లు ఇవ్వడం వరకే పరిమితమనుకుంటే, కొందరు మరో అడుగు ముందుకేసి మోసగిస్తున్నారు. వీరంతా అమెరికా, థాయిలాండ్, దుబాయ్, చైనా, కంబోడియా తదితర దేశాల్లో ఉండే వ్యవస్థీకృత ముఠాల ఆదేశాలతో పని చేస్తున్నారు.
గత 6 నెలల నుంచి (జనవరి నుంచి జులై వరకూ) తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో 228 మందిని అరెస్టు చేయగా, వారిలో 93 మంది తెలంగాణ వారే ఉన్నారు. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల సైబర్క్రైం పోలీసులు 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. మంచిర్యాల జిల్లా జన్నారంలో పట్టుబడ్డ సైబర్ ముఠాలో ముగ్గురు తెలంగాణకు చెందిన వారే ఉన్నారు. కంబోడియా నుంచి జాక్ అనే వ్యక్తి ల్యాప్టాప్, ఇతర సామగ్రి పంపించాడు.
మ్యూల్ అకౌంట్ అంటే ఏంటి? : ఈ బ్యాంకింగ్ ద్వారా నిధులను అక్రమంగా తరలించేందుకు సైబర్ మోసగాళ్లు వేరొకరి అకౌంట్ను వినియోగిస్తారు. దీని కోసం ఖాతాదారులకు ఎంతో కొంత ముట్టజెబుతారు. ఇలా ఇతరుల ఖాతాల ద్వారా ట్రాన్సాక్షన్లు చేయడాన్ని మ్యూల్ అకౌంట్ అంటారు.
ఈ-మెయిల్ టిప్స్ : ఈ ముఖ్య సూత్రాలు తెలిస్తే - 'నకిలీ మెయిల్స్' ఇట్టే పట్టేయొచ్చు!
సిటీలో కొత్త రకమైన మోసం - ముందు యూపీఐతో నగదు పంపిస్తారు, ఆ తర్వాత అకౌంట్ ఫ్రీజ్ చేపిస్తారు

