నానో బనానా ట్రెండ్ను మీరూ ఫాలో అవుతున్నారా? - దోచేస్తున్న సైబర్ నేరగాళ్లు
సామాజిక మాధ్యమాల్లో వైరల్గా నానో బనానా ట్రెండ్ - నకిలీ వెబ్సైట్లు, యాప్లను విస్తృతంగా ప్రచారం చేస్తూ డబ్బు కొట్టేస్తున్న సైబర్ నేరగాళ్లు - జాగ్రత్తలు పాటించాలంటున్న అధికారులు

Published : September 17, 2025 at 8:50 PM IST
Nano Banana Prompt Scam Telugu : 'గూగుల్ జెమిని నానో బనానా' ట్రెండ్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది. కృత్రిమ మేధ సాంకేతికతతో పనిచేసే ఈ ఫొటో ఎడిటింగ్ టూల్ను ప్రస్తుతం ప్రముఖుల నుంచి సామాన్యుల వరకూ అందరూ వినియోగించుకుంటున్నారు. దీనిలో ఫొటో అప్లోడ్ చేసి దానిని ఏ విధంగా మార్చాలి అనుకుంటున్నామో దానికి అర్థమయ్యే రీతిలో ప్రాంప్ట్ ఇస్తే మనం అనుకున్న రీతిలో మనకు దానిని ఎడిట్ చేసి ఇస్తుంది. దీనితో పాటు మన ఫొటోలను త్రీడీ బొమ్మలుగా కూడా మార్చుకునే వెసులుబాటును కల్పిస్తుంది.
సామాజిక మాధ్యమాల్లో వైరల్ : దీనితో ఎడిట్ చేసిన ఫొటోలను కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. అవి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త వేషంలో మోసాలకు పాల్పడుతూ బురిడీ కొట్టిస్తున్నారు. కాగా వైరల్గా మారిన ఈ ట్రెండ్ వారికి ఓ వరంలా మారింది. నానో బనానా పేరుతో నకిలీ వెబ్సైట్లు, మొబైల్ యాప్లను తయూరు చేసి వాటిని విస్తృతంగా ప్రచారం చేస్తూ డబ్బులు దోచుకుంటున్నారు.
తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన ఓ వ్యక్తికి సోషల్ మీడియాలో నానో బనానా ట్రెండ్కు సంబంధించిన ఒక పోస్టు కనిపించింది. దానిలోకి వెళ్లి ఓ లింకును క్లిక్ చేశాడు. దీంతో అతని బ్యాంకు ఖాతాలోని రూ. 70 వేలు మాయమయ్యాయి. ఇదే మాదిరిగా హైదరాబాద్లోనూ మోసాలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

గూగూల్లో వెతికే సందర్భంలో : ఆయా యాప్లు లేక సమాచారం కోసం వ్యక్తులు గూగుల్లో (ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ నుంచి) వెతకడం సైబర్ నేరగాళ్లకు కలిసి వస్తోంది. గూగూల్లో వెతికే సందర్భంలో వారి నకిలీ సైట్లు తెరపైకి వస్తున్నాయి. అనంతరం వాటిని క్లిక్ చేస్తే యాప్ను డౌన్లోడ్ చేసుకోమని సూచిస్తాయి. లేదంటే లింకులు (ఏపీకే ఫైళ్లు) పంపిస్తాయి. వాటిమీద క్లిక్ చేస్తే ఎనీడెస్క్ యాప్లు డౌన్లోడ్ అవుతాయి.
దీంతో ఫోన్ మనదగ్గరే ఉంటుంది. కానీ సుదూర ప్రాంతాల్లో ఉండే నేరగాళ్లు మన ఫోన్ను ఆపరేట్ చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది. దీంతో ఫోన్లోని బ్యాంకింగ్, యూపీఐ యాప్ల సమాచారాన్ని సేకరించి నగదు కాజేస్తుంటారు. మన ఫోన్లో ఉండే సమాచారాన్ని, గ్యాలరీలో ఉండే ఫొటోలను సేకరిస్తారు. వాటిని ఆధారంగా చేసుకుని మన ఫొటోలను అసభ్యకరంగా మనకు పంపించి బ్లాక్మెయిల్ చేస్తారు. మన నుంచి డబ్బులు డిమాండ్ చేస్తారు.
జాగ్రత్తలు పాటించండి : ఫొటోల ఎడిటింగ్, ప్రాంప్ట్ కోసం ఎట్టి పరిస్థితుల్లో థర్డ్ పార్టీ యాప్లను ఆశ్రయించకూడదు. గూగుల్ ప్లేస్టోర్, ఐస్టోర్లోని యాప్లను మాత్రమే వినియోగించాలి. యాప్, ట్రెండ్ ఏదైనా వ్యక్తిగత ఫొటోలు అప్లోడ్ చేయకపోవడం మంచిది. 'ఇంటర్నెట్ ట్రెండింగ్లతో జాగ్రత్త. నానో బనానా మాయలోపడి వ్యక్తిగత సమాచారాన్ని ఇంటర్నెట్లో కుమ్మరిస్తే ఇలాంటి మోసాలే జరుగుతాయి. ఫొటోలు, వ్యక్తిగత సమాచారాన్ని అప్లోడ్ చేసే ముందు కచ్చితంగా ఆలోచించాలి. ఒక్కసారి నకిలీ వెబ్సైట్లు, అనధికారిక యాప్లకు డేటా వెళ్తే తిరిగి రాబట్టడం కష్టం' అని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఎక్స్ వేదికగా సూచించారు.
"ఇంటర్నెట్ ట్రెండింగ్లతో జాగ్రత్త. నానో బనానా మాయలోపడి వ్యక్తిగతసమాచారాన్ని ఇంటర్నెట్లో కుమ్మరిస్తే ఇలాంటి మోసాలే జరుగుతాయి. ఫొటోలు, వ్యక్తిగత సమాచారాన్ని అప్లోడ్ చేసే ముందు కచ్చితంగా ఆలోచించాలి. ఒక్కసారి నకిలీ వెబ్సైట్లు, అనధికారిక యాప్లకు డేటా వెళ్తే తిరిగి రాబట్టడం కష్టం" - వీసీ సజ్జనార్, ఆర్టీసీ ఎండీ
ఈ యాప్లు మీ ఫోన్లో ఉంటే - సైబర్ నేరగాళ్లు మిమ్మల్ని ఏం చేయలేరు!
అంతర్జాతీయ ఫోన్ కాల్స్ను స్థానిక కాల్స్గా మార్చే సిమ్ బాక్స్ - హైదరాబాద్లో ముఠా సభ్యుల అరెస్ట్

