CRDA 46th Authority Meeting: ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో సీఆర్డీయే 46వ అథారిటీ సమావేశం జరిగింది. అమరావతి రాజధాని నిర్మాణం కోసం అవసరమైన మిగిలిన నిధులు వివిధ రూపాల్లో సమీకరించేందుకు సీఆర్డీఏ కమిషనర్కు అనుమతిస్తూ అథారిటీ నిర్ణయం తీసుకుంది. పనులను ఎప్పటికప్పుడు పూర్తి చేసేలా మిగిలిన అవసరమైన నిధులను వివిధ ఫైనాన్సియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి సమీకరించేందుకు సీఆర్డీఏ కమిషనర్కు అనుమతి ఇచ్చింది.
ఇప్పటికే ప్రపంచబ్యాంకు, ఏడీబీ, హడ్కో, కేఎఫ్డబ్ల్యూ నుంచి నిర్మాణం కోసం 31 వేల కోట్ల రుణం ఖరారైంది. అమరావతిలో 62 వేల కోట్ల విలువైన పనులు చేసేందుకు దశలవారీగా టెండర్లు పిలుస్తున్నారు. మిగిలిన పనులు చేపట్టేందుకు నిధులు వివిధ ఆర్థిక సంస్థల ద్వారా సేకరించాలని నిర్ణయించారు.
అసెంబ్లీ, హైకోర్టు భవనాల టెండర్లకు ఆమోదం తెలిపిన అథారిటీ, ఎల్ వన్గా నిలిచిన సంస్థలకు లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఇచ్చేందుకు ఆమోదముద్ర వేసింది. అసెంబ్లీ బేస్మెంట్+ జీ+ 3+ వ్యూయింగ్ ప్లాట్ ఫాంలు + పనోరమిక్ వ్యూ (బిల్టప్ ఏరియా 11.22 లక్షల చదరపు అడుగులు, ఎత్తు 250 మీటర్లు) అసెంబ్లీ నిర్మాణానికి టెండర్లలో ఎల్ వన్గా నిలిచిన సంస్థకు LOA ఇచ్చేందుకు అథారిటీ ఆమోదం తెలిపింది. హైకోర్టు బేస్మెంట్ + జీ + 7 అంతస్తుల్లో నిర్మాణం, బిల్టప్ ఏరియా 20.32 లక్షల చదరపు అడుగులు ఎత్తు 55 మీటర్లు కాగా, ఎల్ వన్గా నిలిచిన సంస్థకు LOA ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. అసెంబ్లీ నిర్మాణ కాంట్రాక్టును 617 కోట్లతో ఎల్ అండ్ టీ, హైకోర్టును 786 కోట్లతో ఎన్సీసీ సంస్థలు దక్కించుకున్నాయి
ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల అభివృద్ధికి సీఆర్డీఏ ప్రణాళిక
ఇటీవల జరిగిన అథారిటీ సమావేశంలో, రాజధాని అమరావతిలో 40 వేల కోట్ల నిర్మాణ పనులకు సీఆర్డీఏ పచ్చజెండా ఊపింది. గత నెలలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ సమావేశంలో ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాజధానిలో నిర్మాణ పనులు దక్కించుకున్న కాంట్రాక్టు ఏజెన్సీలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు. అథారిటీ ఆమోదం పొందగానే ఆయా ఏజెన్సీలతో సీఆర్డీఏ అగ్రిమెంట్లు చేసుకోనుంది. లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ పూర్తికాగానే రాజధానిలో పనులు ప్రారంభం కానున్నాయి.
మరోవైపు రాజధాని అమరావతి గ్రామాల అభివృద్ధిపైనా CRDA దృష్టి సారించింది. రాజధాని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు స్థానికులకు ఉపాధి, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ వంటి అంశాలపై ఇప్పటికే చర్చించారు. దీంతోపాటు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని అమరావతికి చుట్టు పక్కల ఉన్న ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అభివృద్ధి చేసేందుకు సీఆర్డీఏ ప్రణాళిక రచిస్తోంది.
అమరావతితో సమానంగా గ్రామాల్లో అభివృద్ధి - రాజధాని రైతులతో సీఆర్డీఏ సమావేశం
అమరావతిలో రూ.40 వేల కోట్ల పనులకు పచ్చజెండా - త్వరలోనే ప్రారంభం