Bhu Bharathi Portal : ధరణి పోర్టల్ స్థానంలో భూభారతిని తీసుకొచ్చిన ప్రభుత్వం ఈనెల 14న ప్రజలకు అంకితం చేయనుంది. అంబేడ్కర్ జయంతి రోజున సాయంత్రం 5 గంటలకు శిల్పారామం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి భూభారతిని ఆవిష్కరించనున్నారు. తద్వారా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ధరణి పోర్టల్ను బంగాళాఖాతంలో కలిపినట్లు అవుతుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
తెలంగాణలో గత BRS ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ స్థానంలో భూభారతిని తీసుకొచ్చింది. ఎన్నికల హామీ అమలులో భాగంగా ధరణి స్థానంలో భూభారతి పేరుతో రెవెన్యూ చట్టం-2025 చట్టాన్ని తీసుకొచ్చింది. మండల, డివిజన్, జిల్లా, రాష్ట్రస్థాయి అంటూ నాలుగు అంచల్లో ధరణి పోర్టల్కు చెందిన సమస్యల పరిష్కారానికి అవకాశం ఇచ్చింది. ఫలితంగా సాధా బైనామాలు మినహా ధరణి సమస్యలు దాదాపు సమసిపోయాయని అధికారులు చెబుతున్నారు.
సాఫ్ట్వేర్ మార్చేందుకే 4 నెలలు : అయితే గత డిసెంబర్ నెలలో భూభారతిని తీసుకొచ్చిన ప్రభుత్వం పూర్తిస్థాయిలో సాప్ట్వేర్ మార్చేందుకు దాదాపు నాలుగు నెలలు పట్టినట్లు అధికారులు చెబుతున్నారు. చట్టం అమలుకు అవసరమైన నిబంధనలు కూడా రూపకల్పన కావడంతో చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈనెల 14 సాయంత్రం 5 గంటలకు హైటెక్ సిటీ శిల్పారామం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా భూభారతిని ప్రజలకు అంకితం చేస్తారు. రెవెన్యూ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు తీసుకొచ్చిన భూ భారతి చట్టాన్ని ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు.
"గడిచిన ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వంలో ఎలా ఇబ్బంది పడ్డామో, ఆ ఇబ్బందులు అన్నింటినీ కూడా భూభారతి చట్టంలో ప్రతి అంశాన్ని క్రోడీకరించాం. ప్రతి అంశానికి పరిష్కార మార్గం చూపించాం. గజము ఉన్న ఆషాములకు కూడా భద్రత కల్పించి ఈ చట్టాన్ని తయారు చేయడం జరిగింది." - పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రెవెన్యూశాఖ మంత్రి
ప్రజల దీవెనలు ఉన్నంత కాలం ఈ ప్రభుత్వాన్ని ఎవరూ టచ్ చేయలేరు : తమ ప్రభుత్వంపై ఎంత మంది, ఎన్ని కుట్రలు చేసినా ప్రజల దీవెనలు ఉన్నంతకాలం ఈ ప్రభుత్వాన్ని ఎవరూ ఏమీ చేయలేరని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. ధరణి మూడేళ్ల పాటు అమల్లో ఉన్నా నిబంధనలు రూపొందించలేదని ఆయన చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని అనతికాలంలోనే పూర్తిస్థాయిలో తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు.
భూ భారతి పోర్టల్లో కొత్త చిక్కులు!
త్వరలోనే 'భూ భారతి' అమలు - కొత్త టెక్నాలజీతో మరిన్ని ఆప్షన్లు